అవినీతి విచారణైతే వేటకుక్కలు, మౌనంగా ఉంటే కాపలాకుక్కలా?
ED, IT, CBIలను BJP వేటకుక్కల్లా ఉపయోగిస్తోంది అనే ఆరోపణ గత కొన్ని సంవత్సరాలుగా విపక్షాలు పదేపదే చేస్తున్నాయి.
ED, IT, CBIలు BJP ప్రభుత్వం సృష్టించిన సంస్థలా? కావు కదా... ఇవి దశాబ్దాలుగా భారత పరిపాలనా వ్యవస్థలో భాగంగా ఉన్నాయి. కాంగ్రెస్ పాలనలో కూడా ఇవే సంస్థలు పనిచేశాయి. అప్పట్లో కూడా ఈ సంస్థల దర్యాప్తులను విపక్షాలు రాజకీయ కక్షసాధింపుగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దర్యాప్తు సంస్థలను రాజకీయంగా ఉపయోగించడం అనే ఆరోపణ కొత్తది ఏమీ కాదు.
ఏ దేశంలోనైనా, ఏ ప్రజాస్వామ్యంలోనైనా చట్టాన్ని అమలు చేసే సంస్థలు ఉండాల్సిందే. ఎందుకంటే మనిషి వాడే అధికారం, డబ్బు, ప్రభావం ఉన్న చోట అవినీతి, అక్రమాలు, దుర్వినియోగం జరిగే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అందుకే సమాజం పోలీసులను, కోర్టులను, దర్యాప్తు సంస్థలను సృష్టించుకుని..
విచిత్రం ఏమిటంటే ఒక నాయకుడిపై దర్యాప్తు జరగనప్పుడు ప్రభుత్వం అవినీతిని చూస్తూ ఊరుకుంటోంది అంటారు. అదే దర్యాప్తు మొదలైతే ప్రభుత్వం సంస్థలను దుర్వినియోగం చేస్తోంది అంటారు..
అధికారం లేకపోతే అరాచకం మొదలౌతుంది.అధికారానికి నియంత్రణ లేకపోతే నిరంకుశత్వం ఏర్పడుతుంది. ప్రజాస్వామ్యం ఈ రెండింటి మధ్య సమతుల్యత కోసం చేసే నిరంతర ప్రయత్నం. కాబట్టి ప్రశ్న సంస్థలు ఎందుకు పనిచేస్తున్నాయి? అని కాదు.సంస్థలు చట్ట పరిధిలో పనిచేస్తున్నాయా లేదా? అనేదే ముఖ్యం.
ఒక వ్యక్తిపై దర్యాప్తు జరగడం అంటే అతను దోషి అని కాదు.అలాగే దర్యాప్తు జరగడం వల్ల అది రాజకీయ ప్రతీకారమే అని కూడా నిరూపించబడదు. ED లేదా CBI కేసులు కోర్టుల పర్యవేక్షణలో నడుస్తాయి. అరెస్టులు, బెయిల్లు, చార్జ్షీట్లు, విచారణలు అన్నీ చివరికి న్యాయవ్యవస్థ పరిశీలనకు లోబడి ఉంటాయి.
ఎందుకు ఎక్కువగా ప్రతిపక్ష నాయకులపైనే చర్యలు కనిపిస్తున్నాయి?
స్వాతంత్ర్యం తర్వాత దశాబ్దాల పాటు కేంద్రంలో... రాష్ట్రాల్లో అధికారాన్ని నిర్వహించినవారిలో పెద్ద భాగం నేటి ప్రతిపక్ష నాయకులే. సహజంగానే గత పాలనలకు సంబంధించిన ఆరోపణలు, ఆర్థిక అక్రమాల కేసులు, పరిపాలనా నిర్ణయాలపై విచారణలు వారిపైనే ఎక్కువగా ఉన్నాయి.
చాలామంది నాయకులు తమపై ఆరోపణలు వచ్చినప్పుడు దర్యాప్తు సంస్థలను నమ్మరు. కానీ కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇస్తే న్యాయవ్యవస్థను ప్రశంసిస్తారు. అంటే సమస్య సంస్థల ఉనికిలో లేదు. ఫలితం తమకు అనుకూలంగా ఉందా లేదా అన్నదాంట్లో ఉంది.
BJPలో చేరిన తర్వాత కేసులు మాయమవుతున్నాయని విమర్శలు వస్తుంటాయి. కానీ రాజకీయ పార్టీ మారడం వల్ల కేసులు చట్టపరంగా రద్దు కావు. కేసులు కోర్టుల పరిధిలోనే కొనసాగుతాయి. మీడియా దృష్టి తగ్గడం, రాజకీయ చర్చ తగ్గడం, కేసు ముగిసిపోవడం అన్నీ ఒకటి కావు.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన సూత్రం రాజకీయ వ్యవస్థకూ వర్తిస్తుంది. ధర్మాన్ని కాపాడటానికి చర్య అవసరం. అధర్మాన్ని చూసి మౌనంగా ఉండటం కూడా ఒక విధమైన అధర్మమే. అవినీతి ఆరోపణలు ఉన్న వారిపై దర్యాప్తు జరగకపోతే ప్రభుత్వం తన కర్తవ్యాన్ని విస్మరించినట్టే అవుతుంది. దర్యాప్తు చేస్తే రాజకీయ వేధింపులు అంటారు. చేయకపోతే అవినీతిని ప్రోత్సహిస్తోందంటారు.
ED, IT, CBI చర్యలు పూర్తిగా రాజకీయమే అయితే, అనేక కేసుల్లో కోర్టులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నాయి? ఎందుకు కొన్ని అరెస్టులను సమర్థిస్తున్నాయి? ఎందుకు కొన్ని కేసులు సంవత్సరాలుగా న్యాయపరమైన పరిశీలనలో కొనసాగుతున్నాయి? ఎందుకంటే, ప్రజాస్వామ్యంలో తీర్పు ప్రభుత్వానిది కాదు, న్యాయస్థానానిది కాబట్టి..
అందువల్ల BJP దర్యాప్తు సంస్థలను వేటకుక్కల్లా ఉపయోగిస్తోంది అనే వ్యాఖ్య రాజకీయంగా జనాలను ఆకర్షించడానికి బాగుంటుంది..
ప్రజాస్వామ్యంలో చట్టం వ్యక్తులను చూడదు.చర్యలను చూస్తుంది. పదవిని చూడదు. ఆధారాలను చూస్తుంది. పార్టీని చూడదు. ఆరోపణలను చూస్తుంది.
చట్టం పనిచేసినప్పుడు ఇబ్బంది కలిగేది న్యాయానికి కాదు, విచారణకు గురైన వ్యక్తికే. కాబట్టి ఒక సంస్థను అది ఎవరిని విచారించింది అనే ప్రమాణంతో కాకుండా, అది చట్టాన్ని ఎంత నిష్పాక్షికంగా అమలు చేసింది అనే ప్రమాణంతోనే అంచనా వేయాలి. అదే ప్రజాస్వామ్యానికి, న్యాయానికి,సరైన కొలమానం
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz