నేటి నుండి మూడు రోజులు "దుర్గాష్టమి-మహార్నవమి- విజయదశమి. (దసరా)

0
258

హైదరాబాద్:

_🚩నేటి నుండి మూడు రోజులు దుర్గాష్టమి - మహర్నవమి - విజయ దశమి (దసరా)🚩_

"దుర్గాష్టమి"

ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులనూ 'దసరా' లేక 'దేవీ నవరాత్రులు' అంటారు. ఈ తొమ్మిది రోజుల్లో  చివరి మూడురోజులు దుర్గాష్టమి , మహర్నవమి , విజయదశమి. విద్యార్ధులు పుస్తకపూజ , శ్రామికులు పనిముట్లపూజ , క్షత్రియులు ఆయుధపూజ చేసి , అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. దేవి మహిషాసురమర్దనిగా రాక్షసుని మీదకు దండెత్తి విజయం సాధించిన స్పూర్తితో , పూర్వం రాజులు ఈ శుభముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకొనే వారని పురాణాల్లో చెప్పబడింది. కొన్ని ప్రాంతాలలో దసరాకు ఒక వేడుకగా బొమ్మల కొలువు పెట్టే ఆచారం ఉంది.

"దుర్గాష్టమి"

దుర్గాదేవి "లోహుడు" అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని , అందువల్ల లోహపరికరాలని పూజించే ఆనవాయితి వచ్చింది అని చెప్తారు. ఇక దుర్గ అంటే ? దుర్గమైనది దుర్గ. దుర్గతులను తొలగించేది దుర్గ. ఈమె దుర్గేయురాలు కనుక దుర్గ అయింది. "దుర్గలోని 'దుర్' అంటే దుఃఖం , దుర్భిక్షం , దుర్వ్యసనం , దారిద్ర్యం మొదలైనవి. 'గ' అంటే నశింపచేసేది", అని దైవజ్ఞులు వివరణ చెప్తూ ఉంటారు. ఈమె ఆరాధనవల్ల దుష్టశక్తులు , భూత , ప్రేత , పిశాచ , రక్కసుల బాధలు దరిచేరవు , చేరలేవు. అందువల్లనే మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను , తదుపరి మూడురోజులు లక్ష్మిరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను , చివరి మూడురోజులు సరస్వతిరూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని , ఆక్రమంలో ఈ నవరాత్రులలో ఆతల్లిని ఆరాధించి తగు ఫలితాలు పొందవచ్చునని పెద్దలు చెప్తుంటారు. ఈరోజు దుర్గసహస్రనామ పారాయణము , 'దుం' అను బీజాక్షరముతో కలిపి దుర్గాదేవిని పూజిస్తారు. "ఈ దుర్గాష్టమి మంగళవారంతో కలిసిన మరింత శ్రేష్టము" అని అంటారు.

"మహర్నవమి"

మానవకోటిని పునీతులను చేయుటకు భగీరదుడు గంగను భువినుండి దివికి తెచ్చినది ఈనాడే. ఇక ఈ నవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైనదిగా ఈ నవమి తిధిని గూర్చి చెప్పుటలో ఆంతర్యం ఈ తొమ్మిదవ రోజు మంత్ర సిద్ది కలుగును. కావున 'సిద్ధదా' అని నవమికి పేరు. దేవి ఉపాసకులు అంతవరకు వారు చేసిన జపసంఖ్య ఆధారంగా హోమాలుచేస్తూ ఉంటారు. అలా వ్రతసమాప్తి గావించిన వారికి సర్వసిద్ధుల సర్వాభీష్ట సంసిద్ధి కలుగును. ఇక క్షత్రియులు , కార్మికులు , వాహన యజమానులు , ఇతర కులవృత్తులవారు అందరూ ఆయుధపూజ నిర్వహిస్తారు.

"విజయదశమి"

దేవదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తదినం ఈ విజయదశమి రోజే అని తెలియజేయబడింది. 'శ్రవణా' నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి 'విజయా' అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయదశమి' అనుపేరు వచ్చినది. ఏపనైనా తిధి , వారము , తారాబలము , గ్రహబలము , ముహూర్తము మున్నగునవి విచారించకుండా , విజయదశమినాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము. 'చతుర్వర్గ చింతామణి' అనే ఉద్గ్రంధము ఆశ్వీయుజ శుక్ల దశమినాటి నక్షత్రోదయ వేళనే 'విజయం' అని తెలిపియున్నది. ఈ పవిత్ర సమయము సకల వాంచితార్ధ సాధకమైనదని గురువాక్యము. 

"శమీపూజ" చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది. శమీవృక్షమంటే "జమ్మిచెట్టు" అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను , వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి , తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది , శమీవృక్ష రుపమున ఉన్న 'అపరాజితా' దేవి ఆశీస్సులు పొంది , కౌరవులపై విజయము సాధించినారు. 

శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ "అపరాజితా" దేవిని పూజించి , రావణుని సహరించి , విజయము పొందినాడు. 

తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం "పాలపిట్ట" ను చూచే ఆచారం కూడా ఉన్నది. 

ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని , విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి , ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలుచేస్తారు.

శ్లో" శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||

పైశ్లోకము వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటు , శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.

 sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
వేదక్షరి స్కూల్ సైన్స్ ఎగ్జిబిషన్ విశేష స్పందన ముఖ్యఅతిథిగా జనసేన నేత జొన్న రాజేష్
*వేదాక్షరి స్కూల్ సైన్స్ ఎగ్జిబిషన్ కు విశేష స్పందన*   *ముఖ్య అతిధిగా జనసేన నేత జొన్న...
By Rajini Kumari 2025-12-21 09:11:28 0 219
Telangana
నిజామాబాద్: హనుమాన్ జయంతికి పతిష్ట బందోబస్త్
నిజామాబాద్.హనుమాన్ జయంతి సందర్భంగ జిల్లా వ్యాప్తంగ పటిష్ట బందోబస్తు ఎర్పటుచేసి నిఘా ఉంచలాని...
By Sadaq Sadaq 2026-03-30 17:15:12 0 136
Andhra Pradesh
మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో తాగునీటి సమస్య – అధికారులు స్పందన.
మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో తాగునీటి సమస్య తీవ్రతరం కావడంతో అధికారులు శనివారం స్పందించారు. పాత...
By Pagadala Venkateswar 2026-04-05 06:13:17 0 129
Telangana
కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మార్కెఫెడ్ డీఎం
రామాయంపేట మండల కేంద్రంలోని మొక్కల కొనుగోలు కేంద్రాన్ని మార్ఫెడ్ డీఎం సునీత సందర్శించారు. కొనుగోలు...
By Katiyala JeevanRaj 2026-04-18 11:17:24 0 208
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com