Chandrababu Naidu: ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ: సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ: సీఎం చంద్రబాబు
10-03-2026 Tue 16:57 | Andhra
Chandrababu Naidu Focuses on Developing Andhra Pradesh as Integrated Strategic Material Hub
ఏపీ టైటానియం, స్ట్రాటజిక్ మెటీరియల్స్ మిషన్ ఏర్పాటుకు సన్నాహాలు
రాబోయే పదేళ్లలో రూ.50 వేల కోట్ల పెట్టుబడులు, 40 వేల ఉద్యోగాలే టార్గెట్
శ్రీకాకుళం, అనకాపల్లి, మచిలీపట్నంలో 3 ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదన
రాష్ట్రంలో లభించే బీచ్ సాండ్ మినరల్స్పై ప్రత్యేక దృష్టి
ఆంధ్రప్రదేశ్ను ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకు రాష్ట్ర తీరప్రాంతంలో లభించే విలువైన బీచ్ సాండ్ వంటి ఖనిజ సంపదను సమర్థంగా వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. తద్వారా రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి కొత్త ఊపునివ్వాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో గనుల శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఆంధ్రప్రదేశ్ టైటానియం, స్ట్రాటజిక్ మెటీరియల్స్ మిషన్ (AP-TSMM)’ ఏర్పాటు, పెట్టుబడుల ఆకర్షణ వంటి కీలక అంశాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.
ఈ మిషన్ ద్వారా రాబోయే పదేళ్లలో రూ.50,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు, 40,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం కావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేవలం వనరులను వెలికితీయడమే కాకుండా, వాటికి విలువ జోడించడం (వాల్యూ ఎడిషన్)పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రేర్ మినరల్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలన్నారు. రాష్ట్రంలోని వనరులపై పూర్తి అవగాహన పెంచుకోవడంతో పాటు, భవిష్యత్ డిమాండ్కు అనుగుణంగా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా, రాష్ట్రంలోని తీరప్రాంతంలో లభించే బీచ్ సాండ్ మినరల్స్ దేశంలోనే అత్యంత విలువైనవని అధికారులు సీఎంకు వివరించారు. వీటిలో ప్రధానంగా ఇల్మెనైట్, రుటైల్, జిర్కాన్, మోనాజైట్, గార్నెట్, సిల్లిమనైట్ వంటి వ్యూహాత్మక ప్రాధాన్యమున్న ఖనిజాలు ఉన్నట్లు తెలిపారు. ఈ బీచ్ సాండ్ మినరల్స్ నుంచి వచ్చే ఉత్పత్తులు పెయింట్స్, కాస్మెటిక్స్, ఫార్మా రంగాలతో పాటు ఏరోస్పేస్, రక్షణ, శస్త్రచికిత్స పరికరాలు, సెరామిక్స్, ఎలక్ట్రానిక్స్, అణు ఇంధనం, అణు రియాక్టర్ల విడిభాగాల తయారీ వంటి అత్యంత కీలకమైన పరిశ్రమలకు అవసరమని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
ఈ ఖనిజ సంపదను సమర్థంగా వినియోగించుకునేందుకు రాష్ట్రంలో మూడు ముఖ్యమైన ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. శ్రీకాకుళంలో టైటానియం పార్క్ (ఏడాదికి 15 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం), అనకాపల్లిలో రేర్ ఎర్త్ కారిడార్ (ఏడాదికి 25,000 టన్నుల ఉత్పత్తి లక్ష్యం), మచిలీపట్నంలో సమగ్ర టైటానియం, రేర్ ఎర్త్ కారిడార్లను ఏర్పాటు చేయాలని తమ ప్రతిపాదనలను సీఎం ముందుంచారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, గనులు, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz