Telugu University Dispute: తెలుగు వర్సిటీల మధ్య వివాదం.. ఏపీ వీసీకి తెలంగాణ లీగల్ నోటీసులు.

0
123

Telugu University Dispute: తెలుగు వర్సిటీల మధ్య వివాదం.. ఏపీ వీసీకి తెలంగాణ లీగల్ నోటీసులు

10-03-2026 Tue 08:22 | Both States

 

Muniratnam Naidu Responds to Telugu University Legal Dispute

ఏపీ తెలుగు వర్సిటీకి తెలంగాణ వర్సిటీ లీగల్ నోటీసు

సంగీత, నృత్య కళాశాలల పరీక్షల నోటిఫికేషన్‌పై అభ్యంతరం

విభజన పూర్తవనందున కాలేజీలు తమ పరిధిలోనే ఉన్నాయని తెలంగాణ వాదన

ప్రభుత్వం తరఫున సమాధానమిస్తామన్న ఏపీ వర్సిటీ వీసీ

ఇటీవలే తెలంగాణ వర్సిటీ పేరును 'సురవరం ప్రతాపరెడ్డి'గా మార్చిన వైనం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో వివాదం తెరపైకి వచ్చింది. రాష్ట్ర విభజన జరిగి దశాబ్దం గడిచినా ఆస్తుల పంపకాలు ఇంకా పూర్తికాని నేపథ్యంలో రెండు రాష్ట్రాల తెలుగు విశ్వవిద్యాలయాల మధ్య న్యాయపోరాటం మొదలైంది. ఏపీలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం లీగల్ నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

 

తమ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలు, పాఠశాలల్లో ప్రవేశ పరీక్షల నిర్వహణకు ఏపీ వర్సిటీ నోటిఫికేషన్ ఇవ్వడమే ఈ వివాదానికి మూలకారణం. విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజులు వసూలు చేయడాన్ని తెలంగాణ వర్సిటీ తీవ్రంగా తప్పుబట్టింది. రాష్ట్ర విభజన ప్రక్రియ ఇంకా పూర్తిగా కొలిక్కి రానందున విజయనగరం, గుంటూరు, నెల్లూరు, రాజమహేంద్రవరం, విజయవాడ, కర్నూలులోని ఈ కళాశాలలు, పాఠశాలలు చట్టపరంగా తమ పరిధిలోనే ఉన్నాయని తెలంగాణ వర్సిటీ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో తమ పరిధిలోని సంస్థలకు పరీక్షలు నిర్వహించే అధికారం ఏపీ వర్సిటీకి లేదంటూ వీసీకి లీగల్ నోటీసులు పంపింది.

 

ఈ వివాదంపై ఏపీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మునిరత్నం నాయుడు స్పందించారు. తెలంగాణ వర్సిటీ నుంచి లీగల్ నోటీసులు అందిన మాట వాస్తవమేనని, దీనిపై ప్రభుత్వం తరఫున తగిన సమాధానం ఇస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తవడంతో తెలంగాణ వర్సిటీ ఏపీలో ప్రవేశాలు నిలిపివేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఇక్కడ కొత్తగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి, వీసీని నియమించింది.

 

కాగా, తెలంగాణ అస్తిత్వం, సంస్కృతిని ప్రతిబింబించేలా, అక్కడి తెలుగు విశ్వవిద్యాలయానికి 2024 జూన్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం 'సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం'గా పేరు మార్చిన విషయం తెలిసిందే. తెలంగాణ వైతాళికుడు, సామాజిక సంస్కర్త, గోల్కొండ పత్రిక వ్యవస్థాపకుడైన సురవరం ప్రతాపరెడ్డికి గౌరవ సూచకంగా ఈ మార్పు చేశారు. ప్రస్తుతం ఈ రెండు వర్సిటీల మధ్య నెలకొన్న న్యాయపోరాటం ఎలాంటి మలుపు తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com