Chandrababu Naidu: మీరు చేసింది మహా పాపం... ఏక సభ్య కమిషన్ వేస్తున్నాం: సీఎం చంద్రబాబు.

0
129

 

Chandrababu Naidu: మీరు చేసింది మహా పాపం... ఏక సభ్య కమిషన్ వేస్తున్నాం: సీఎం చంద్రబాబు

| Andhra

Chandrababu Naidu on Tirumala Laddu Ghee Adulteration

తిరుమల నెయ్యి కల్తీపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజం

గత వైసీపీ ప్రభుత్వం 2022 నివేదికను ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టిందని ఆరోపణ

సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ప్రక్షాళన మొదలుపెట్టానని వెల్లడి

పామాయిల్, కెమికల్స్, జంతువుల కొవ్వుతో నెయ్యి తయారు చేశారని ఆగ్రహం

దేవుడితో పెట్టుకోవద్దని, భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని తీవ్ర హెచ్చరిక

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ వ్యవహారాన్ని తొక్కిపెట్టి, భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని, ఇది క్షమించరాని మహా పాపం అని ఆయన అభివర్ణించారు. దేవుడితో చెలగాటమాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులను, అపవిత్ర ఘటనలను గుర్తుచేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఉండవల్లిలో కూటమి నేతల కీలక సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.

 

భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దు

 

కరడుగట్టిన నేరస్థులు అసత్యాన్ని ఎలా నమ్మిస్తారో, అలాగే గత పాలకులు ఇప్పుడు మాట్లాడుతున్నారని చంద్రబాబు అన్నారు. "సీబీఐ నివేదికలో కల్తీ లేదని ఎక్కడా చెప్పలేదు. అయినా, కల్తీ జరగలేదని ఎదురుదాడి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్రంలోని భక్తులందరికీ ఒక సామాన్య భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నా. దేవునికి అపచారం జరిగినప్పుడు ముక్తకంఠంతో ఖండించాలి. ఈ దోషులను కఠినంగా శిక్షిస్తాం. ఏకసభ్య కమిషన్ వేసి సమగ్ర విచారణ జరిపిస్తాం. ఇప్పటివరకు ఉన్న నివేదికలన్నీ ఆ కమిషన్ ముందు ఉంచుతాం. అవసరమైతే కోర్టులోనూ అదనపు సమాచారం సమర్పిస్తాం. ఇది దేవుడిచ్చిన బాధ్యత, దైవ కార్యం. ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తాం" అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

 

దేవుడితో పెట్టుకోవద్దు.. ఇది దుర్మార్గమైన అపచారం

 

వైసీపీ నేతలకు దేవుడిపై విశ్వాసం లేకపోవచ్చని, కానీ విశ్వాసం ఉన్న కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే హక్కు వారికి లేదని చంద్రబాబు హెచ్చరించారు. "అంతర్వేదిలో రథం తగలబడితే కందిరీగలు కొరికాయని, ఆంజనేయుడి విగ్రహాన్ని పగలగొడితే 'అదో బొమ్మే కదా, ఇంకోటి పెట్టుకోండి' అని అప్పటి పాలకులు ఎంతో గర్వంగా మాట్లాడారు. ఇవన్నీ చేస్తూ, తిరిగి మాపైనే నిందలు వేశారు. విశ్వాసం లేకపోతే దేవుడి జోలికి రావొద్దు. దేవుడి పవిత్రతను దెబ్బతీయడం దుర్మార్గం. చరిత్రలో ఇప్పటివరకు శ్రీ వెంకటేశ్వర స్వామి జోలికి ఎవరూ రాలేదు. బ్రిటిష్ వాళ్లు కూడా స్వామివారి సంప్రదాయాలను గౌరవించి, మరింత అభివృద్ధి చేశారు. అలాంటిది మీరు చేసిన ఈ పని దుర్మార్గమైన అపచారం" అని ఆయన తీవ్రంగా ఖండించారు. 

 

సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ప్రక్షాళన

 

తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి ప్రాధాన్యతగా పరిపాలన, దైవ కార్యాల ప్రక్షాళనపై దృష్టి సారించానని చంద్రబాబు వివరించారు. "ముఖ్యమంత్రిగా నా కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీని నియమించడం నా మొదటి సంతకం. మానవ సేవ కన్నా ముందు మాధవ సేవ ముఖ్యమని భావించి, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తిరుమల ప్రక్షాళన కోసం టీటీడీ ఈఓగా శామలరావును నియమిస్తూ రెండో సంతకం చేశాను. ఈ రెండు పనులు పూర్తి చేశాకే ఇతర కార్యక్రమాలు చేపట్టాను" అని ఆయన తెలిపారు. 

 

అనంతరం తిరుమలలో పరిస్థితులను సమీక్షించి, కల్తీ జరుగుతోందన్న అనుమానంతో నెయ్యి శాంపిళ్లను నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌డీడీబీ)కు పంపించామని, ఆ నివేదికలోనే కల్తీ వాస్తవాలు బయటపడ్డాయని స్పష్టం చేశారు.

 

2022లోనే నివేదిక.. అయినా తొక్కిపెట్టారు

 

ఈ కల్తీ వ్యవహారం కొత్తగా బయటపడింది కాదని, 2022లోనే గత వైసీపీ ప్రభుత్వానికి దీనిపై నివేదిక అందిందని చంద్రబాబు సంచలన విషయాలు వెల్లడించారు."2022లో సీఎఫ్టీఆర్ఐ (CFTRI) ఇచ్చిన నివేదికలో నెయ్యి కల్తీ జరుగుతోందని చాలా స్పష్టంగా ఉంది. కానీ, ఆ నివేదికను వాళ్లు ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టారు. యథేచ్ఛగా కల్తీ నెయ్యి సరఫరాను కొనసాగించారు" అని ఆయన ఆరోపించారు. ఇప్పుడు ఏర్పాటైన సిట్ విచారణలో మరింత భయంకరమైన నిజాలు బయటపడ్డాయని, నెయ్యి తయారీలో పామాయిల్, ప్రమాదకర రసాయనాలు, చివరికి జంతువుల కొవ్వు (యానిమల్ ఫ్యాట్) కూడా వాడుతున్నట్లు తేలిందని ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

 

గత ఐదేళ్లలో హిందూమతంపై దాడి

 

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో హిందూ దేవాలయాలు, సంప్రదాయాలపై దాడులు పరాకాష్టకు చేరాయని చంద్రబాబు విమర్శించారు. "ఒకప్పుడు ఇదే అసెంబ్లీలో తిరుమల రెండు కొండలే, ఏడు కొండలు కాదని మాట్లాడినప్పుడు మేం వ్యతిరేకించాం. విజయనగరంలో రాముడి విగ్రహం తల నరికివేస్తే, అక్కడికి వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలనుకున్న నాపైనే కేసు పెట్టారు. అంతర్వేదిలో రథం తగలబడితే ఎలుకలు కొరికాయని చెప్పారు. ఆంజనేయుడి విగ్రహాన్ని పగలగొడితే 'అదో బొమ్మే కదా, ఇంకోటి పెట్టుకోండి' అని అప్పటి పాలకులు ఎంతో గర్వంగా మాట్లాడారు. ఇవన్నీ చేస్తూ, తిరిగి మాపైనే నిందలు వేశారు" అని ఆయన మండిపడ్డారు.

Search
Categories
Read More
Telangana
చేప ప్రసాదం పంపిణీ
రాష్ట్ర ప్రజలందరికి మృగశిర కార్తె శుభాకాంక్షలు. నేడు,రేపు చేప ప్రసాదం పంపిణీ-పటిష్ట ఏర్పాట్లు...
By Vadla Egonda 2025-06-08 02:05:43 0 2K
Odisha
🛕 పూరీ జగన్నాథ రథయాత్రకు భక్తుల పోటెత్తు – భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా
ఒడిశా, పూరీ: జగన్నాథ స్వామి వార్షిక రథయాత్ర మహోత్సవం ఇవాళ ఘనంగా ప్రారంభమైంది. వేల ఏళ్లుగా...
By Bharat Aawaz 2025-06-27 07:58:21 0 2K
Bharat Aawaz
THE VOICE OF THE UNHEARD
Bharat Aawaz! THE VOICE OF THE UNHEARD This is the story of a movement. A movement to find,...
By Bharat Aawaz 2025-07-08 18:39:42 0 1K
Uttarkhand
Uttarakhand Goes Green: Cabinet Mandates "No Vehicle Day"
In a bold move to combat the global energy crisis, Chief Minister Pushkar Singh Dhami’s...
By Dunna Jessicaruth 2026-05-14 09:01:52 0 44
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com