రసాయనాలతో తిరుమల లడ్డు ప్రసాదం తయారు చేసి వైసిపి మహాపరాధం చేసింది

0
152

రసాయనాలతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారు చేసి వైసీపీ మహాపరాధం చేసింది

 

• సిట్ నివేదికలో అంశాలను కప్పిపుచ్చి వైసీపీ విష ప్రచారం

• జంతు కొవ్వు లేదు అని ఆ నివేదికలో ఎక్కడా పేర్కొనలేదు 

• లడ్డూలో వినియోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదు

• ⁠రూ.400కి కిలో నువ్వుల నూనె దొరకదు… అలాంటిది ఆవు నెయ్యి ఎలా ఇచ్చారు?

• ఈ వాస్తవాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది

• వైసీపీ నేతల విద్వేషపూరిత వ్యాఖ్యలే దాడులకు కారణం

• జనసేన పార్టీ కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యం 

• మార్చి 14 ఆవిర్భావ దినోత్సవం... జెన్ జి డే 

• జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

 

‘వైసీపీ పాలనలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదని సిట్ తేల్చింది. రసాయనాలు, పామాయిల్ ఉపయోగించి తయారు చేసిన నూనెతో లడ్డూలు తయారు చేసి శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు’ అని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని జంతువుల కొవ్వు కలిసిందా? లేదా? అనే విషయాన్ని సిట్ బహిర్గతం చేయలేదనీ, లడ్డూ విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న గోబెల్స్ ప్రచారం ఆగాలంటే వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలన్నారు. సోమవారం సాయంత్రం మంగళగిరిలో జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ కార్యవర్గ సభ్యులు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, వీర మహిళ ప్రాంతీయ సమన్వయకర్తలు, అధికార ప్రతినిధులు, విభాగాల చైర్మన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రారంభోపన్యాసం చేశారు. 

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “కాసులకు కక్కుర్తిపడి వైసీపీ నాయకులు తిరుమలలో అపచారం చేశారు. నిబంధనలు అడ్డగోలుగా మార్చేసి టన్నుల కొద్ది కల్తీ నెయ్యి కొనుగోలు చేసి ప్రసాదాల్లో కలిపేశారు. రూ.400కి కిలో నాణ్యమైన నువ్వుల నూనె దొరకదు. అలాంటింది నెయ్యి ఎక్కడ నుంచి దొరుకుతుంది. అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిందంతా చేసి ఇప్పుడు బొంకు మాటలు మాట్లాడుతున్నారు. తమకేమీ తెలియదన్నట్లు అబద్ధాలు, బుకాయింపులతో తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ చేసిన అపరాచాలను ప్రజల్లోకి మనం బలంగా తీసుకెళ్లాలి. 

• అదుపు తప్పిన మాటలే దాడులు చేసేలా చేస్తున్నాయి  

వైసీపీ నాయకులంటే నాకు వ్యక్తిగత ద్వేషం, వైరం లేదు. వాళ్ల భాష, క్రిమినాలిటీతోనే సమస్య. ఇళ్లల్లోకి వస్తాం... దాడులు చేస్తాం... నరికేస్తాం అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడతారు. వాళ్ల భాష సరిగా లేని కారణంగానే ఈ రోజు దాడులు జరుగుతున్నాయి. దాడులను, హింసను ఏ రాజకీయ పార్టీ సమర్థించదు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదని పదేపదే చెబుతున్నారు. అలా జరిగితే సమాజానికి, ప్రజాస్వామ్యానికి మంచిది కాదనీ హెచ్చరించారు. మనం ప్రజలకు చెప్పే మంచి వెళ్లే లోపు వైసీపీ నాయకులు జనాల్లో భయం క్రియేట్ చేస్తున్నారు. మళ్లీ మేము వస్తే అంటూ రకరకాలుగా బెదిరింపు కామెంట్లు చేస్తున్నారు. గతంలో ఇలాంటి కామెంట్లు చేసే ఆ పార్టీ 151 నుంచి 11కి పడిపోయింది. అయినా వాళ్ల ప్రవర్తనలో మార్పు రాలేదు. స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. మరో 15 ఏళ్లు కూటమి అధికారానికి ఢోకా లేదు. ప్రజలు చాలా తెలివైనోళ్లు. వాళ్లు ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.

• జనసేన ఒక కులానికి, కుటుంబానికి చెందిన పార్టీ కాదు

జనసేన పార్టీ ఒక కులానికో, కుటుంబానికో చెందిన పార్టీ కాదు. ఒక కులం మీద ఆధారపడి పుట్టిన పార్టీలు ఎక్కువ కాలం నిలబడవు. అందుకు ఉత్తరప్రదేశ్ ఒక ఉదాహరణ. అక్కడ కులం మీద పుట్టిన పార్టీలు కనుమరుగయ్యే స్థితికి వచ్చాయి. కులాలకు అతీతంగా పార్టీ బలోపేతంపై అంతా దృష్టి సారించాలి. ఎన్నికల సమయంలో ఎలా అయితే ప్రజల్ని కలిసి అందుబాటులో ఉన్నామో ఇప్పుడూ అలానే ఉండాలి. 

వీర మహిళలు, జనసైనికుల త్యాగాలతో జనసేన నిలదొక్కుకుంది. వారి త్యాగాలను విస్మరించకూడదు. పార్టీ నాయకత్వంలో వారికి ప్రాధాన్యమివ్వాలి. నియోజవర్గాల్లో పార్టీ పదవులకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించాము. పైలెట్ ప్రాజెక్ట్ గా పిఠాపురం నియోజకవర్గంలో ఆ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. అన్ని నియోజకవర్గాల్లో ఇదే విధానం అమలవుతుంది. మనకున్న 26 జిల్లాలను జోన్లుగా విభజించుకొని మెంబర్షిప్ డ్రైవ్ చేపట్టాలి. ఈ మెంబర్షిప్ డ్రైవ్ లో ప్రతీ నాయకుడు పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించాలి. పార్టీ ఆవిర్భావ దినం మార్చి 14న జెన్ జి డే ఏర్పాట్లపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి. 

• సోషల్ మీడియా గెలుపు ఓటముల్ని ప్రభావితం చేసే ఆయుధం కాదు

సోషల్ మీడియా నిజంగా గెలుపు ఓటములను నిర్ణయించే ఆయుధం అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి గెలిచేవాడు కాదు. ఆయన మీద వచ్చిన ట్రోలింగ్స్ ప్రపంచంలో ఎవరి మీదా రాలేదు. సోషల్ మీడియా గెలుపు ఓటములను నిర్ణయించదు. అది గెలుపుకి ఒక కారణం మాత్రమే అవుతుంది. మన పార్టీపై వచ్చిన నెగిటివ్ న్యూస్ మనమే వైరల్ చేయడం వల్ల దానికి బలం చేకూరుతుంది. మనం ఆ పద్దతి మార్చుకోవాలి.

• 32 మందితో క్రమశిక్షణ కమిటీ

సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా 32 మంది సభ్యులతో ఒక క్రమశిక్షణ కమిటీని నియమిస్తున్నాం. ప్రారంభంలో ఈ కమిటీకి నేనే అధ్యక్షత వహిస్తాను. కమిటీలో ఉండే ప్రతి ఒక్కరు జవాబుదారీతనంతో వ్యవహరించేలా చర్యలు తీసుకుంటాం. ఈ కమిటీలో మూడో వంతు మారుస్తూ ఉంటాం. పార్టీ కమిటీల్లో మహిళకు ప్రాధాన్యమివ్వాలి. పార్లమెంటులో మహిళలకు 33 శాతం అవకాశం కల్పిస్తూ చట్టం చేశారు. మన పార్టీలోనూ మహిళా నాయకత్వం పెరగాలి. పదవుల్లో వారికి కొంత భాగం ఇచ్చేలా చర్యలు తీసుకోవాల”న్నారు.

• రెండు తీర్మానాలకు ఆమోదం 

వైసీపీ హయాంలో రసాయనాలతో సింథటిక్ నెయ్యి తయారు చేసి, దాన్నే తిరుమల లడ్డూ ప్రసాదానికి సరఫరా చేసిన మహాపచారం చేసిన విషయంపై శాసన సభలో చర్చించాలని, సిట్ నివేదికలోని వాస్తవాలను తెలియచెప్పే కార్యక్రమాన్ని జనసేన పక్షాన చేపట్టాలని తీర్మానం ప్రవేశపెట్టారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్ రూపుదిద్దుకొందనీ, మన దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యే విధంగా ఈ బడ్జెట్ ఉందని, భారత భవిష్యత్ శక్తిని ఆవిష్కరించే విధంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖామాత్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి, దేశాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా పయనింపచేస్తూ, శక్తిమంతంగా తీర్చిదిద్దుతున్న గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి అభినందనలు తెలియచేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ రెండు తీర్మానాలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.

Search
Categories
Read More
Media Academy
The Power Of Truth In An Age Of Misinformation
The Power Of Truth In An Age Of Misinformation In An Era Of Information Overload And...
By Media Academy 2025-04-28 18:35:58 0 3K
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం లో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు
పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు, ఉప్పరపల్లి, పులిచెర్ల, రొంపిచర్ల మండలాలలో ఆదివారం దివంగత నేత...
By Kothuru Murali 2026-01-19 12:32:53 0 120
Andhra Pradesh
బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో
ఎమ్మిగనూరు పట్టణంలోని 8వ వార్డు నుండి 50 కుటుంబాలకు పైగా సుమారు 200 మంది కర్నూల్ పార్లమెంట్ వైస్...
By Boya Dasthagiri 2026-03-31 11:36:31 0 117
Andhra Pradesh
సింగిల్ నంబర్ ఆట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న టాస్క్ పోలీసులు.
📍గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో చట్ట వ్యతిరేక...
By John Baji 2026-01-03 02:09:22 0 156
Andhra Pradesh
బాపట్ల కు చెందిన దంపతులు శ్రీశైలం మల్లన్నకు బంగారు రుద్రాక్ష మాల హారం విరాళం
*బాపట్ల కి చెందిన దంపతులు.. శ్రీశైలం మల్లన్న ఆలయానికి బంగారు రుద్రాక్ష మాల, హారం విరాళం*  ...
By Rajini Kumari 2026-02-28 11:28:21 0 93
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com