ఆసిఫాబాద్ రూ.200 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని అడ్డుకున్న రైతులు
భారత్ అవాజ్, కుమురం భీం ఆసిఫాబాద్ బ్యూరో:తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఆసిఫాబాద్ మండల పరిధిలోని అంకుసాపూర్ శివారులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మంజూరు చేసిన మోడల్ ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను స్థానిక రైతులు ఒక్కసారిగా అడ్డుకున్నారు. దాదాపు రూ. 200 కోట్ల భారీ వ్యయంతో ఈ విద్యా సంస్థ భవన సముదాయాన్ని నిర్మించేందుకు అధికారులు క్షేత్రస్థాయికి చేరుకోవడంతో వివాదం మొదలైంది. ప్రభుత్వం ఈ పాఠశాల నిర్మాణం కోసం 87 సర్వే నంబర్ పరిధిలోని స్థలాన్ని కేటాయించింది. అయితే, ఈ సర్వే నంబర్లోని భూమి ప్రభుత్వానిది కాదని, తాము తమ తాతల కాలం నుండి తరతరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పనుల నిమిత్తం అధికారులు అక్కడికి తీసుకువచ్చిన కంటైనర్ గదులను, ఇతర నిర్మాణ సామాగ్రిని ఏమాత్రం ఏర్పాటు చేయనివ్వకుండా రైతులు అడ్డుకుని నిరసనకు దిగారు. రైతుల ఆందోళనతో సమాచారం అందుకున్న స్థానిక తహసీల్దార్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్తూ ఒక రైతు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తమకున్న ఒకే ఒక్క జీవనాధారమైన సాగు భూమిని లాక్కోవద్దంటూ సదరు రైతు అక్కడికి వచ్చిన తహసీల్దార్ కాళ్లు పట్టుకుని, కన్నీరుమున్నీరుగా ప్రాధేయపడటం అక్కడున్న ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కలచివేసింది. తమ నోటి కూడు లాక్కోవద్దని, ప్రభుత్వం తమ సాగు భూములను కాపాడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో అంకుసాపూర్ శివారు ప్రాంతంలో ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz