ఆర్డీటీ మనందరి సంస్థ.. రాజకీయాలకు అతీతంగా అండగా నిలుద్దాం: మంత్రి నారా లోకేష్.

0
103

 

 

ఆర్డీటీ మనందరి సంస్థ.. రాజకీయాలకు అతీతంగా అండగా నిలుద్దాం: మంత్రి నారా లోకేష్

 Andhra

Nara Lokesh Pledges Support to RDT Organization

ఆర్డీటీ సంస్థకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ భరోసా

ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా ఆర్డీటీకి మద్దతివ్వాలని ప్రజలకు పిలుపు

ఆర్డీటీ సేవలను ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తరించాలని కోరిన మంత్రి లోకేష్

యువగళం హామీని నిలబెట్టుకుంటూ ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులు వచ్చేలా కృషి

మంత్రి హోదాలో తొలిసారి బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిని సందర్శించిన లోకేష్

"ఆర్డీటీ సంస్థకు నా వంతు సహాయం చేయగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది మనందరి సంస్థ. ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ ఆర్డీటీకి మద్దతుగా నిలవాలి. ఈ సంస్థ సేవలు ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తరించాలి, అందుకు మా ప్రభుత్వం అండగా నిలబడుతుంది," అని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆసుపత్రిని సందర్శించిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

 

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, "నా యువగళం పాదయాత్రకు ముందు ఆర్డీటీ గురించి విన్నాను. కానీ పాదయాత్రలో వారు చేస్తున్న అద్భుతమైన కార్యక్రమాలను కళ్లారా చూశాను. ఇంట్లో వికలాంగులుగా పుట్టిన పిల్లలను కొందరు తల్లిదండ్రులు బాధతో వదిలేస్తే, అలాంటి పిల్లలను సొంత బిడ్డల కన్నా గొప్పగా చూసుకుంటున్న ఆర్డీటీ పాఠశాలను చూసి చలించిపోయాను. అనంతపురం పాదయాత్రలో మొదటిసారి మాంచో ఫెర్రర్ గారిని కలిశాను. ఆర్డీటీ కేవలం ఒక సంస్థ కాదు, అదొక ఉద్యమం. 57 ఏళ్లుగా పాఠశాలలు, ఆసుపత్రులు, క్రీడలు, పేదలకు ఇళ్ల నిర్మాణం వంటి ఎన్నో సేవలు అందిస్తున్న తీరు నన్ను కదిలించింది. పాదయాత్ర ఇతర జిల్లాలకు వెళ్లినా, నా ప్రసంగాల్లో ఆర్డీటీ గురించి పదేపదే ప్రస్తావించాను," అని గుర్తు చేసుకున్నారు.

 

ఆర్డీటీకి అండగా నిలబడతాం

 

"సమాజానికి మంచి చేస్తున్న ఏ సంస్థకైనా ప్రభుత్వం అండగా నిలబడాల్సిన బాధ్యత ఉంది. గతంలో ఆర్డీటీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు, నేను వ్యక్తిగతంగా మాంచో గారితో మాట్లాడి, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి కొన్ని అపోహలను తొలగించి, ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్ వచ్చేలా చూశాం. వెనుకబడిన జిల్లాను దత్తత తీసుకుని, ఇక్కడి ప్రజలను ప్రేమతో చూస్తున్న ఈ వ్యవస్థకు అండగా నిలబడటం మన బాధ్యత. మున్ముందు కూడా అండగా ఉంటాం. మాంచో గారు తెలుగులో మాట్లాడుతుంటే నేను ఆశ్చర్యపోయాను. తాను పుట్టి పెరిగింది ఇక్కడేనని, 13 ఏళ్ల వరకు తనకు ఇంగ్లీష్ రాదని ఆయన చెప్పడం వారికున్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది," అని లోకేష్ వివరించారు.

 

సేవలో 0.001 శాతం సాయం నా అదృష్టం

 

"ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే పాదయాత్ర చేశాను. ఈ క్రమంలోనే ఆర్డీటీ వంటి పవిత్ర సంస్థలకు జీవితాంతం అండగా నిలబడాలని నిర్ణయించుకున్నాను. వారి సేవలో నా వంతు 0.001 శాతం సహాయం చేయగలిగినా అది నా అదృష్టం. ఇక్కడి పీడియాట్రిక్ వార్డులో ఒక తండ్రి తన బిడ్డకు గుండె ఆపరేషన్‌ను ఆర్డీటీ ఉచితంగా చేసిందని చెప్పినప్పుడు, నాపై బాధ్యత మరింత పెరిగింది. అందుకే ముఖ్యమంత్రి గారు కూడా ఇది నా బాధ్యత అని చెప్పారు. తెలుగుజాతి మొత్తం ఆర్డీటీకి అండగా నిలబడాలి. కేవలం రాయలసీమకే పరిమితం కాకుండా, మీ సేవలను రాష్ట్రమంతా విస్తరించండి, మేం అండగా ఉంటామని మాంచో గారిని కోరుతున్నాను," అని లోకేష్ పిలుపునిచ్చారు.

 

కష్టకాలంలో ఓర్పుతో ప్రజలకు సేవ చేసినందుకు మాంచో ఫెర్రర్‌కు లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. దీనిపై స్పందించిన ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్, "మొదటిసారి మా ఆసుపత్రికి వచ్చిన లోకేష్ గారికి అభినందనలు. ఏడాదిగా మేము ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన మాకు అండగా నిలిచారు. ఆయన సహకారానికి నా కృతజ్ఞతలు," అని అన్నారు.

 

లోకేష్‌కు ఘన స్వాగతం.. నెరవేరిన యువగళం హామీ

 

మంత్రి హోదాలో తొలిసారిగా బత్తలపల్లి వచ్చిన నారా లోకేష్‌కు ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్, ఆసుపత్రి హెడ్ డాక్టర్ పి. లలితా దేవి, సిబ్బంది, స్థానికులు ఘన స్వాగతం పలికారు. విదేశీ విరాళాలు నిలిచిపోవడంతో ఆర్డీటీ సేవలకు ఆటంకం ఏర్పడినప్పుడు, యువగళం పాదయాత్రలో లోకేష్ ఆ సంస్థకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం, ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక కేంద్రంతో సంప్రదించి ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులు మంజూరు చేయించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే ఆయన పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

 

పర్యటనలో భాగంగా లోకేష్ మొదట ఆర్డీటీ వ్యవస్థాపకుడు విన్సెంట్ ఫెర్రర్ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం, మాంచో ఫెర్రర్ మాతృమూర్తి అన్నే ఫెర్రర్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆసుపత్రిలోని చిన్నపిల్లల వార్డును సందర్శించి, తలసేమియాతో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. సింధూర, గురు లోకేష్ వంటి పిల్లలతో సరదాగా సంభాషిస్తూ వారిలో ధైర్యం నింపారు. చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, ఎస్. సవిత, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

 

Search
Categories
Read More
Telangana
రైల్వే స్టేషన్‌లో గంజాయి పట్టివేత.|
"ఒడిశా నుంచి నాగ్‌పూర్‌కు తరలిస్తున్న రూ.20.56 లక్షల విలువైన గంజాయి స్వాధీనం.. ఇద్దరు...
By Sidhu Maroju 2026-07-06 10:28:07 0 74
Telangana
పెద్దపల్లి : ఓదుల మల్లన్న స్వామి ఆలయంలో తేనె తీగల బీభత్సం...!
ఓదెల శ్రీ మల్లన్న స్వామి దేవస్థానంలో బుధవారం దర్శనానికి వచ్చిన భక్తులపై తేనెతీగల గుంపు ఒకసారిగా...
By Sunka Santhosh 2026-07-01 19:03:13 0 121
Telangana
"మారేడ్‌పల్లి పీఎస్‌లో ‘Arrive Alive’.. డీసీపీ శ్రీధర్ గోల్డెన్ అవర్ ప్రాధాన్యం”
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడటంలో ‘గోల్డెన్ అవర్’...
By Sidhu Maroju 2026-04-17 09:00:40 0 232
Telangana
ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయం శంకుస్థాపన . |
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : కూకట్పల్లిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్...
By Sidhu Maroju 2026-01-12 06:24:55 0 236
Andhra Pradesh
సారస్ జాతీయ స్థాయి కార్యక్రమం
 సారస్ (SARAS) జాతీయ స్థాయి ప్రదర్శన జనవరి 6 నుంచి 18 వరకు గుంటూరులో జరుగుతుందని జిల్లా...
By John Baji 2026-01-02 08:35:33 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com