సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఈటల, మల్లారెడ్డి.. కారణం ?

0
77

మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ డంపింగ్‌ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మే 15లోగా అధికారుల నివేదిక కోరిన ఆయన.. ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం నిర్వహించి నూతన డంపింగ్‌ యార్డులపై నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. వ్యర్థాల నిర్వహణపై విదేశీ పద్ధతుల అధ్యయనానికి అఖిలపక్ష బృందాలను పంపుతామని వెల్లడించారు. ఈ సమస్యపై బీజేపీ ఎంపీ ఈటల, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని కలవగా ఈ మేరకు హామీ ఇచ్చారు

‎మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే ఈ సమావేశంలో పొలిటికల్ అజెండాతో కూడినది కాదు. తమ నియోజకవర్గంలోని ఓ సమస్య పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జవహర్‌నగర్ డంపింగ్‌ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. దశాబ్దాలుగా స్థానిక ప్రజలను వేధిస్తున్న ఈ కాలుష్య కోరల నుండి విముక్తి కలిగిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలోనే జవహర్‌నగర్ డంపింగ్‌ జేఏసీ సభ్యులు, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ నేతృత్వంలో వీరు ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా డంపింగ్‌ యార్డ్ వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న నరకప్రాయమైన పరిస్థితులను వారు వివరించారు.

‎బాధిత జేఏసీ సభ్యుల మొర ఆలకించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు. ఈ నెల 15వ తేదీలోగా డంపింగ్‌ యార్డ్ సమస్యపై పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మే 15 తర్వాత అన్ని రాజకీయ పార్టీలతో కూడిన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. నూతనంగా ఏర్పాటు చేయబోయే డంపింగ్‌ యార్డుల స్థానాలు, చెత్త తరలింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమావేశంలో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోనున్నట్లు వెల్లడించారు

‎చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణలో ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న శాస్త్రీయ పద్ధతులను అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అవసరమైతే అధికారులతో పాటు అఖిలపక్ష పార్టీల కమిటీలను విదేశీ పర్యటనలకు పంపుతామని, అక్కడ అమలవుతున్న అధునాతన సాంకేతికతను మన రాష్ట్రంలోనూ ప్రవేశపెడతామని రేవంత్ రెడ్డి తెలిపారు. జవహర్‌నగర్ ప్రజలకు కాలుష్య రహిత వాతావరణాన్ని అందించటమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు.

‎సమావేశంలోనే ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఘటకేసర్ రైల్వే వంతెన నిర్మాణ జాప్యాన్ని వజ్రేష్ యాదవ్ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన రేవంత్ రెడ్డి.. అధికారులతో మాట్లాడి వంతెన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ భేటీలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఏళ్ల నాటి సమస్యకు పరిష్కారం చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వటంతో జవహర్‌నగర్ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా డంపింగ్ యార్డ్ సమస్యకు పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.

Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com