గ్యాస్ సిలిండర్లు డోర్ డెలివరీ చేయలేం

0
230

*గ్యాస్ డోర్ డెలివరీ చేయలేం*

 

*డోర్ డెలివరీ చేసే క్రమంలో సిలిండర్లు మాయమైపోతున్నాయి.*

 

*పోయిన సిలిండర్లకు యాజమాన్యం మా వద్ద నగదు వసూలు చేస్తున్నారు*

 

*మాకు నెల జీతాలు కూడా ఇవ్వరు*

 

 *డెలివరీ బాయ్ ల ఆవేదన*

 

*మంగళగిరి:*

ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్లను డోర్ డెలివరీ చేయలేకపోతున్నామని, సిలిండర్లు డోర్ డెలివరీ చేసే సమయంలో ఆటోల వద్దకు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఫుల్ సిలిండర్ లను తీసుకువెళ్లిపోతున్నారని పలువురు డెలివరీ బాయ్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరిలో గ్యాస్ ఏజెన్సీల ఇష్టారాజ్యం పేరుతో నేటి దినపత్రిక సూర్య లో శనివారం కథనం ప్రచురితమైన విషయం 

విదితమే. ప్రభుత్వ నిబంధనల మేరకు వినియోగదారులకు డోర్ డెలివరీ చేయించాల్సిన ఏజెన్సీ నిర్వాహకులు పట్టీ పట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా మంగళగిరి నగరంలోని రాయల్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వినియోగదారులను నేటి వరకు ముప్పతిప్పలు పెడుతూనే ఉన్నారు. డెలివరీ బాయ్ ల చేత ఆటోల్లో సిలిండర్లను పంపించి చేతులు దులుపుకుంటున్నారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెంకు రెండు ఆటోల్లో గ్యాస్ సిలిండర్లు డోర్ డెలివరీ నిమిత్తం పంపారు. అయితే డెలివరీ బాయ్ లు డోర్ డెలివరీ చేయకుండా ఒక ఆటోను శ్రీనగర్ కాలనీ వాటర్ ట్యాంక్ వద్ద , మరొక ఆటోను శివాలయం వద్ద పార్కింగ్ చేశారు. గ్యాస్ బుకింగ్ చేసిన వినియోగదారులకు డెలివరీ బాయ్ లు ఫోన్ చేసి ఆటో నిలిపియున్న కూడలిని చెప్పి ఖాళీ సిలిండర్ తీసుకువస్తే నిండు సిలిండర్ ఇక్కడే ఇచ్చివేస్తామని చెప్పారు. దీంతో కొందరు వినియోగదారులు అక్కడకు ఖాళీ సిలిండర్ ను తీసుకువచ్చి ఫుల్ సిలిండర్లను తీసుకువెళ్లగా మరి కొందరు వినియోగదారులు తాము అక్కడకు రాలేమని, దయచేసి డోర్ డెలివరీ చేయాలని వేడుకున్నారు. డోర్ డెలివరీ చేస్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆటోల వద్దకు వచ్చి ఫుల్ సిలిండర్లను తీసుకువెళ్లిపోతున్నారని, కావున డోర్ డెలివరీ ఇవ్వలేకపోతున్నామని సమాధానం చెప్పారు. యాజమాన్యం పోయిన సిలిండర్లకు సైతం తమ వద్ద నుంచి నగదు వసూలు చేస్తుందని, పైగా తమకు జీతాలు కూడా ఇవ్వడం లేదని డెలివరీ బాయ్ లు ఆవేదన వ్యక్తం చేశారు. 

 

 *బెదిరిస్తున్నారంటూ ఏజెన్సీ నిర్వాహకునికి ఫోన్ చేసిన డెలివరీ బాయ్*

 

ప్రభుత్వ నిబంధనల ప్రకారం డోర్ డెలివరీ ఎందుకు చేయడం లేదని అడిగితే... ఎవరో వచ్చి తనను బెదిరిస్తున్నాడని ఓ డెలివరీ బాయ్ వెంటనే ఏజెన్సీ నిర్వాహకునికి ఫోన్ చేసి సమాచారం చెప్పడం కొసమెరుపు. కనీసం ఏజెన్సీ నిర్వాహకుడైనా వచ్చిన వినియోగదారునితో ఫోన్ లో మాట్లాడే ప్రయత్నం కూడా చేయకపోవడం వారి నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది.     

 

*డోర్ డెలివరీ బాయ్ తో ఫోన్ లో మాట్లాడిన పౌరసరఫరాల శాఖ అధికారి*

 

కాగా యర్రబాలెం లో గ్యాస్ డోర్ డెలివరీ చేయడం లేదనే సమాచారం తెలుసుకున్న పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనివాసరావు రాయల్ గ్యాస్ ఏజెన్సీకి చెందిన డెలివరీ బాయ్ తో ఫోన్ లో మాట్లాడారు. ఒకే చోట ఆటోను నిలిపి వినియోగదారులను అక్కడికి రప్పించి సిలిండర్లను ఇవ్వరాదని, కచ్చితంగా డోర్ డెలివరీ చేయాలని సూచించారు. దీంతో డెలివరీ బాయ్ అప్పటివరకు తీసుకున్న ఖాళీ సిలిండర్ లను ఆటోలో లోడ్ చేసుకొని... 26 ఫుల్ సిలిండర్లు తిరిగి ఏజెన్సీ వద్దకే తీసుకువస్తున్నానని నిర్వాహకులకు తెలిపాడు. వారు ఇబ్బంది ఏమిటని డెలివరీ బాయ్ ను ప్రశ్నించగా... డోర్ డెలివరీ ఇవ్వాలంట... డోర్ డెలివరీ ఇవ్వడం నావల్ల కాదు... అందుకే సిలిండర్లను తిరిగి తీసుకు వచ్చేస్తున్నాను అంటూ సమాధానం చెప్పాడు. ఈలోగా మరికొందరు వినియోగదారులు ఖాళీ సిలిండర్ లను ఆటో వద్దకు తీసుకురావడంతో చేసేది లేక నగదు తీసుకొని ఫుల్ సిలిండర్ లను పంపిణీ చేసి కొద్దిసేపు అనంతరం ఏజెన్సీ వద్దకు బయలుదేరి వెళ్ళిపోయాడు.

 

*నరకయాతన పడుతున్న వృద్దులు*

 

ఆటోల వద్దకు ఖాళీ సిలిండర్ లను తీసుకొచ్చే క్రమంలో ప్రధానంగా వృద్ధ వినియోగదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. కొందరు వృద్ధులు ఆటోలలో వస్తుండగా మరి కొందరు తమ ద్విచక్ర వాహనాలపై ఖాళీ సిలిండర్లను తీసుకువస్తున్నారు.

ఈ క్రమంలో ఓ వృద్ధ వినియోగదారుడు తన ద్విచక్ర వాహనంపై ఫుల్ సిలిండర్ ను తీసుకు వెళుతూ... ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డుపైనే పడిపోయాడు. గమనించిన తోటి వినియోగదారులు వెళ్లి వృద్ధ వినియోగదారుడిని పైకి లేపారు. అయితే ఈ ప్రమాదంలో వృద్ధునికి ఎటువంటి గాయాలు కాలేదు. డోర్ డెలివరీ చేస్తే తమకు ఇటువంటి ఇబ్బంది ఉండేది కాదని, ఇప్పటికైనా సీనియర్ సిటిజన్స్ ను సైతం దృష్టిలో పెట్టుకొని గ్యాస్ డోర్ డెలివరీ చేసేలా పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు వృద్ధులు కోరుతున్నారు

Like
1
Search
Categories
Read More
Telangana
ఆసిఫాబాద్ సందీప్ నగర్ కాలనీ సమస్యల పరిష్కారానికి కమిషనర్ హామీ
 🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 11వ...
By Chunarkar Jagadeesh 2026-06-30 16:49:25 0 191
Andhra Pradesh
విజయవాడ కొండపల్లి రైల్వే ట్రా క్ వెంబడి మురుగు సమస్య పరిష్కరించండి కేశినేని శివనాద్
*ప్రచురణార్థం* *22-01-2026*   కొండపల్లి–విజయవాడ రైల్వే ట్రాక్ వెంబడి మురుగు సమస్య...
By Rajini Kumari 2026-01-22 12:13:06 0 194
Business & Finance
Trademark Rectification Corrects Brand Record Errors
Trademark Rectification allows businesses to correct errors, remove inaccuracies, or update...
By Navya Sree 2026-07-22 05:35:58 0 21
Puducherry
Puducherry Strengthens Investment and Business Growth
Puducherry continues to promote investment and improve the ease of doing business through policy...
By Fathima Safa 2026-06-29 08:25:07 0 47
SURAKSHA
V. Venu IAS: Steering Kerala with Vision and Excellence
V. Venu, IAS – The Visionary Administrator Guiding Kerala's Future The Journey...
By Fathima Safa 2026-07-14 07:05:46 0 61
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com