చందిప్ప గ్రామ రైతుకు ఉత్తమ రైతు అవార్డు
శంకర్పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామానికి చెందిన ప్రగతిశీల రైతు దోసాడ శేఖర్ రెడ్డి గారికి ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ సిల్క్ బోర్డు ఉత్తమ రైతు అవార్డు లభించింది. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఎంపికైన ముగ్గురు రైతుల్లో ఒకరుగా నిలిచిన శేఖర్ రెడ్డి గారు జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.
గత తొమ్మిది సంవత్సరాలుగా పట్టు పురుగుల పెంపకం (సెరికల్చర్) రంగంలో నిరంతర కృషి చేస్తూ, సొంతంగా చాకి నిర్వహిస్తూ మంచి దిగుబడులు సాధిస్తూ ఆదర్శ రైతుగా నిలుస్తున్నారు. ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ, నాణ్యమైన మల్బరి ఆకులను ఉత్పత్తి చేసి పట్టు పురుగుల పెంపకంలో ఉన్నత ఫలితాలు సాధిస్తున్నారు. ఈ కృషి ద్వారా స్థిరమైన ఆదాయం పొందడమే కాకుండా, ఇతర రైతులకు మార్గదర్శకుడిగా నిలుస్తున్నారు.
శేఖర్ రెడ్డి గారి కృషిని గుర్తించిన సెంట్రల్ సిల్క్ బోర్డు సభ్యులు డా. వినోద్ కుమార్, డా. రాఘవేందర్లు ఈ అవార్డును అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి, భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
అంతేకాకుండా, పరిగి, కొండంగల్, వికారాబాద్ ప్రాంతాల నుండి కొత్తగా పట్టు పురుగుల పెంపకం ప్రారంభించిన రైతులకు శేఖర్ రెడ్డి గారు మల్బరి సాగు, పురుగుల సంరక్షణ, వ్యాధి నివారణ వంటి అంశాలపై విలువైన సూచనలు, సలహాలు అందిస్తున్నారు. ఆయన అనుభవం కొత్త రైతులకు ఎంతో ఉపయోగపడుతోంది.
ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ అవార్డు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. రైతులకు, ముఖ్యంగా యువతకు ఇది ప్రేరణగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా, స్వయం ఉపాధి రంగంలో కూడా అనేక అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా పట్టు పురుగుల పెంపకం వంటి రంగాలలో మంచి ఆదాయం సాధించవచ్చని సూచించారు. మన మండలంలో చేనేతకు సంబంధించిన యువకులు, రైతులు ఈ రంగాన్ని నేర్చుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
చివరిగా, ఈ విజయాన్ని సాధించడంలో ఏడి ముత్యాలు గారు మరియు నాగరత్నం మేడం అందించిన సహకారం ఎంతో కీలకమని శేఖర్ రెడ్డి గారు తెలిపారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz