Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో భారీ ఊరట.

0
271

ఏకసభ్య కమిషన్ ఏర్పాటును సవాలు చేసిన సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ కొట్టివేత

కమిటీ విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసిన సుప్రీం ధర్మాసనం

సిట్, కమిటీ దర్యాప్తులు వేర్వేరని, ఒకదానిపై ఒకటి ప్రభావం చూపవని వెల్లడి

రిటైర్డ్ ఐఏఎస్ దినేశ్‌కుమార్‌ కమిటీ నివేదికకు మార్గం సుగమం

 

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం ఆరోపణలకు సంబంధించిన వివాదంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ విచారణను కొనసాగించవచ్చని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కమిషన్ నియామకాన్ని సవాలు చేస్తూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ ఇవాళ‌ కీలక తీర్పు వెలువరించింది.

 

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. తిరుమల నెయ్యి వ్యవహారంపై ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ సిట్ దర్యాప్తు చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం సమాంతరంగా మరో కమిటీని ఎలా ఏర్పాటు చేస్తుందని సుబ్రహ్మణ్యస్వామి తన పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సీఎం చంద్రబాబు, టీటీడీ, సీబీఐని ప్రతివాదులుగా చేర్చారు.

 

స్వామి వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం.. ఒక దర్యాప్తు సంస్థ విచారణ మరో కమిటీపై ప్రభావం చూపదని స్పష్టం చేసింది. "రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ పరిపాలనాపరమైన లోపాలను గుర్తించేందుకు ఏర్పాటు చేయబడింది. ఇది సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేస్తుందని మేము భావించడం లేదు. చట్ట ప్రకారం సిట్, ఏకసభ్య కమిటీ తమ తమ విధులను నిర్వర్తించవచ్చు" అని ధర్మాసనం పేర్కొంది. ఈ రెండు విచారణలు వేర్వేరని, ఒకదాని పరిధిలోకి మరొకటి రాదని (ఓవర్‌లాపింగ్ కాదని) తేల్చి చెప్పింది.

 

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం నెయ్యి కొనుగోలు టెండర్లు, నిబంధనల సడలింపులో లోపాలు జరిగాయని సీబీఐ సిట్ తన నివేదికలో ప్రభుత్వానికి వెల్లడించింది. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. ఈ సిట్ నివేదిక ఆధారంగా ఎవరిపై, ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫార్సు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్‌కుమార్‌ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 45 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఈ కమిటీని ఆదేశించింది.

 

తాజాగా సుప్రీంకోర్టు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో దినేశ్‌కుమార్ కమిటీ తన విచారణను ముందుకు తీసుకెళ్లేందుకు మార్గం సుగమమైంది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ. 32 లక్షలు
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు...
By Ratna Sekhar 2026-02-11 14:01:48 0 327
Andhra Pradesh
250 కి ఖాళీ స్థలంలో పిచ్చి మొక్కల తొలగింపు : కమిషనర్
కర్నూలు : కర్నూలు సిటీ :  • నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్• 250 కి పైగా ఖాళీ...
By Hari Krishna 2026-01-11 07:29:21 0 228
Telangana
నిజామాబాద్
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి తో కలిసి బీజేపీ...
By Sadaq Sadaq 2026-06-14 12:37:07 0 120
Andhra Pradesh
అసాంఘిక కార్యకలాపాల పై ఉక్కు పాదం
తాడిపత్రి మండలం నిత్యం డ్రోన్ కెమెరా తో అసాంఘిక కార్యక్రమాల పై నిఘా పెట్టిన పోలీసులు లకు విరపురం...
By Gitta Raju 2026-04-17 11:50:54 0 210
Andhra Pradesh
నవులూరు గ్రామంలో స్మశాన వాటికలో అభివృద్ధి పనులను ప్రారంభించిన నాయకులు
*నవులూరు గ్రామంలోని స్మశాన వాటికలలో అభివృద్ధి చేసిన పనులను ప్రారంభించిన నాయకులు*   *స్మశాన...
By Rajini Kumari 2026-01-10 13:22:59 0 177
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com