నగర అభివృద్ధిని అడ్డుకున్న వైసిపి

0
134

*ప్ర‌చుర‌ణార్థం* *18-02-2026*

 

*న‌గ‌రాభివృద్ధిని అడ్డుకున్న వైసిపి కౌన్సిల్...త్వ‌ర‌లో పీడ విర‌గడ‌*

 

*రాబోయే కొత్త కౌన్సిల్ తో రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రామ్ వాటర్ స‌మ‌స్య‌ల‌కు పరిష్కారం : ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని)*

 

*గురునాన‌క్ కాల‌నీలో నూతన ఇన్‌ఫ్రారెడ్ రోడ్ రిపేరింగ్ మొబైల్ మిషన్ ప్రారంభం*

 

*జెండా ఊపి మొబైల్ మిష‌న్ ను ప్రారంభించిన ఎంపీకేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్*

 

విజ‌య‌వాడ : గత ఐదు సంవత్సరాలుగా విజయవాడ నగర అభివృద్ధిని అడ్డుకున్నవి.ఎం.సి వైసిపి కౌన్సిల్ స‌మ‌యం త్వ‌ర‌లో ముగియ‌నుండ‌టంతో న‌గ‌రానికి ప‌ట్టిన చెద‌, పీడ విర‌గ‌డ కానుంద‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు.

 

 నగర పాలక సంస్థకు కేంద్ర 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ ద్వారా రూ.1.48 కోట్ల వ్యయంతో అందుబాటులోకి వ‌చ్చిన అత్యాధునిక ఇన్‌ఫ్రారెడ్ రోడ్ రిపేరింగ్ మొబైల్ మిషన్ ను బుధ‌వారం గురునానక్ కాల‌నీలోని మెయిన్ రోడ్ లో ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్, వి.ఎం.సి అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. అనంత‌రం ఆ మొబైల్ మిష‌న్ పని తీరును గ‌మ‌నించారు.  

 

ఈ సంద‌ర్భంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ ఎన్‌క్యాప్ (ENCAP) ద్వారా మంజూరైన ఈ మిషన్‌ను నగర రోడ్ల అభివృద్ధి, కాలుష్య నియంత్రణలో విస్తృతంగా వినియోగించనున్నట్లు తెలిపారు. ఇక న‌గ‌రాభివృద్ధికి సంబంధించి ఏ ప్రతిపాదన వచ్చినా వైసిపి కౌన్సిల్ తిర‌స్క‌రిస్తోంద‌న్నారు. గ‌త ఐదేళ్లుగా వి.ఎం.సి కౌన్సిల్ లో టిడిపి నాయ‌కులు, కార్పొరేట‌ర్లు ఎన్నో ఇబ్బందులు ప‌డ్డారని తెలిపారు. ప్రజలకు మేలు చేసే ప్రాజెక్టులు రాజకీయ కారణాలతో నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

 

న‌గ‌రంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.600 కోట్ల నిధులు కేటాయిస్తే...ఆ ప్రతిపాద‌న‌ను కూడా వైసిపి కౌన్సిల్ రిజెక్ట్ చేసింద‌న్నారు....నగర అభివృద్ధికి అడ్డుగా వున్న ఈ వైసిపి కౌన్సిల్ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌టంతో, త్వ‌ర‌లో ర‌ద్దు కానుంద‌న్నారు. రాబోయే కొత్త కౌన్సిల్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రామ్ వాటర్ వ్యవస్థలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ఎంపీ కేశినేని శివ‌నాథ్ స్పష్టం చేశారు.విజయవాడను అమరావతి ప్రాంతంలో మోడల్ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎంపీ కేశినేని శివ‌నాథ్ తెలిపారు.

 

ఇక ఎన్‌క్యాప్ (ENCAP) ద్వారా మంజూరైన ఇన్‌ఫ్రారెడ్ రోడ్ రిపేరింగ్ మొబైల్ మిషన్ ను నగర రోడ్ల అభివృద్ధి, కాలుష్య నియంత్రణలో విస్తృతంగా వినియోగించనున్నట్లు ఎంపీ కేశినేని శివ‌నాథ్ పేర్కొన్నారు. నగరంలోని రోడ్లపై ఉన్న గుంతలు, ఎత్తుపల్లాలను అతి తక్కువ సమయంలో సరిచేసే సామర్థ్యం ఉండటం ఈ మిషన్ ప్రత్యేకత అని తెలిపారు. సాంప్రదాయ పద్ధతుల్లో తారు ను అధిక ఉష్ణోగ్రతకు కాల్చి రోడ్డు వేయాల్సి ఉండగా, ఈ ఇన్‌ఫ్రారెడ్ మిషన్‌లో అలాంటి కాలుష్యకర ప్రక్రియ అవసరం లేకుండా, పాత తారును అదే ఉష్ణోగ్రతలో రీసైక్లింగ్ చేసి కొత్త తారుతో సమానంగా ఉపయోగించుకోవచ్చున‌ని, దీంతో 98 శాతం వరకు కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయని తెలిపారు..

 

ప్రస్తుతం నగరానికి రూ.25 కోట్ల గ్రాంట్ మంజూరైనప్పటికీ, మొత్తం రూ.32 కోట్ల వరకు గ్రాంట్ కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. త్వరలోనే పూర్తి స్థాయిలో రూ.32 కోట్ల గ్రాంట్‌కు అవసరమైన యంత్ర సామగ్రి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు అందుతుందని ఎన్‌క్యాప్ అధికారులు హామీ ఇచ్చినట్లు చెప్పారు.ఇలాంటి ఆధునిక యంత్రాలు మరిన్ని నగరానికి రావాలని, తద్వారా రోడ్ల పరిస్థితి మెరుగుపడి పారిశుద్ధ్యం, కాలుష్య నియంత్రణ సాధ్యమవుతుందని ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు.

 

 

ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గ్రీన్ డెవలప్‌మెంట్ మిషన్లను ప్రోత్సహిస్తున్న ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ కి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వ నిధులను సమర్థంగా ఉపయోగించుకుని రాష్ట్ర ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు అమలు చేయడంలో అనుభవం కలిగిన నాయకుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు అంటూ ప్రశంసించారు. ఎన్‌క్యాప్ (ENCAP) ద్వారా రూ.1.48 కోట్ల విలువైన అత్యాధునిక పాత్‌హోల్ రిపేర్ మిషన్ వీఎంసీకి ఉచితంగా అందించడం జరిగిందని తెలిపారు. ఈ మిషన్ ద్వారా నగరంలోని ఎక్కడైనా గుంతలు ఏర్పడితే, కేవలం ఒకరు లేదా ఇద్దరు సిబ్బందితోనే అతి తక్కువ సమయంలో గోతులను పూడ్చవచ్చని, ఇన్‌ఫ్రారెడ్ రేడియేషన్ టెక్నాలజీ ద్వారా ఎలాంటి పొల్యూషన్ లేకుండా రోడ్ల మరమ్మత్తులు చేయవచ్చని వివరించారు.

 

ఈ విధానం పూర్తిగా నూతనమైన మార్పులకు నిదర్శనమని, గ్రీన్ టెక్నాలజీ ద్వారా నగరాల్లో కాలుష్యాన్ని నియంత్రించడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఇలాంటి ఆధునిక యంత్రాలు మరిన్ని వీఎంసీకి రాబోతున్నాయని, భవిష్యత్తులో విజయవాడలో చిన్న గుంత పడినా 15 నిమిషాల్లోనే మరమ్మత్తు జరిగేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

 

ఈ కార్య‌క్ర‌మంలో కార్పొరేట‌ర్లు దేవినేని అప‌ర్ణ‌, చెన్నుపాటి ఉషారాణి, ముమ్మ‌నేని ప్రసాద్, టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు ప‌రుచూరి ప్ర‌సాద్, టి.ఎన్.ఎస్.ఎఫ్ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చ‌ర‌ణ్ సాయి, అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ (ప్రాజెక్ట్) డాక్ట‌ర్ డి.చంద్ర‌శేఖ‌ర్, చీఫ్ ఇంజ‌నీర్ ఇంచార్జ్ పి.స‌త్య‌కుమారి, సూప‌రిండెంటింగ్ ఇంజ‌నీర్ (వ‌ర్క్స్) వి.చంద్ర‌శేఖ‌ర్, ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్ జి.సామ్రాజ్యం, డిప్యూటీ ఇంజ‌నీర్లు, అసిస్టెంట్ ఇంజ‌నీర్లు ల‌తో పాటు ఎన్.డి.యే కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అయ్యప్ప స్వామి దర్శించుకున్న జడ్పీ చైర్మన్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని ఎర్రాతివారి పల్లి కోటమలై అయ్యప్ప స్వామి...
By Kothuru Murali 2026-01-11 08:19:17 0 132
Manipur
Kuki-Zo Council Pushes for Union Territory Status in Manipur |
The Kuki-Zo Council (KZC) has called for a political solution involving separation from Manipur...
By Pooja Patil 2025-09-16 07:06:34 0 186
Andhra Pradesh
పుంగనూరులో సంబరాలు ఎందుకో తెలుసా..
అన్నమయ్య జిల్లా, పుంగనూరులో ఆదివారం కాంగ్రెస్, వామపక్ష పార్టీల నాయకులు టీవీకే అధినేత విజయ్...
By Kothuru Murali 2026-05-11 05:41:47 0 52
Telangana
ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఎందుకు ఈ మౌనం ?
ఏంటి Kalvakuntla Kavitha అక్కో  ‎తెలంగాణకి అమ్మ అవుతా అన్నావ్  ‎ఒక కూతురు...
By Ponnala Srinivasrao 2026-05-10 02:06:17 0 78
Telangana
రెండో విడత పోలింగ్ లో కాంగ్రెస్ హవా నా..?
మండలం లో రేపు పోలింగ్ నిర్వహించన్ను నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కి చెందిన పళ్ళు వర్గాలు మెజారిటీ...
By Krishna Balina 2025-12-13 12:56:41 0 259
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com