TTD: టీటీడీ నెయ్యి టెండర్లపై వైసీపీ ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన టీటీడీ, హెరిటేజ్.

0
101

టీటీడీ నెయ్యి టెండర్లపై వైసీపీ అవినీతి ఆరోపణలు

ఆరోపణలను తీవ్రంగా ఖండించిన టీటీడీ, హెరిటేజ్ ఫుడ్స్

తప్పుడు ఆరోపణలపై బొత్సకు లీగల్ నోటీసు పంపిన హెరిటేజ్

నెయ్యి సరఫరాలో నందిని సంస్థకే అతిపెద్ద వాటా అని టీటీడీ వెల్లడి

నాణ్యత పెంచేందుకే సేకరణలో కొత్త సంస్కరణలు తెచ్చామన్న టీటీడీ

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం సేకరించే నెయ్యి టెండర్ల విషయంలో అవకతవకలు జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపాయి. హెరిటేజ్ ఫుడ్స్‌కు సంబంధించిన ఇందాపూర్ డెయిరీకి అధిక ధరలకు కాంట్రాక్టులు కట్టబెట్టారని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఈ ఆరోపణలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), హెరిటేజ్ ఫుడ్స్ సంస్థలు తీవ్రంగా ఖండించాయి. తప్పుడు ఆరోపణలు చేశారంటూ బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ ఫుడ్స్ లీగల్ నోటీసు జారీ చేసింది.

 

ఈ వివాదంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందిస్తూ, నెయ్యి సేకరణ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేశారు. 2024 తర్వాత భక్తుల నుంచి వచ్చిన సూచనల మేరకు నెయ్యి నాణ్యతను పెంచేందుకు పలు సంస్కరణలు చేపట్టామని తెలిపారు. గతంలో 1500 కిలోమీటర్ల దూరం నుంచి నెయ్యి సేకరించేవారని, నాణ్యతను దృష్టిలో ఉంచుకుని ఆ పరిధిని 800 కిలోమీటర్లకు తగ్గించామని వివరించారు. ట్యాంకర్లకు జీపీఎస్ లాకింగ్ వ్యవస్థ, MRL స్కోర్‌బోర్డు వంటి కఠినమైన నాణ్యతా ప్రమాణాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

 

2024-25 సంవత్సరానికి గాను 65 లక్షల కిలోల నెయ్యి కోసం ఏడు దశల్లో టెండర్లు పిలిచామని, ఇందులో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు చెందిన ‘నందిని’ సంస్థకే నాలుగు టెండర్లు దక్కాయని బీఆర్ నాయుడు తెలిపారు. మొత్తం సరఫరాలో సుమారు 62% వాటాతో (40 లక్షల కిలోలు) నందిని సంస్థే అతిపెద్ద సరఫరాదారుగా ఉందని వెల్లడించారు. ఇందాపూర్ డెయిరీ ఏడు టెండర్లలో కేవలం రెండింటిలో మాత్రమే అర్హత సాధించిందని, 10 లక్షల కిలోల నెయ్యి మాత్రమే సరఫరా చేసిందని వివరించారు.

 

మరోవైపు, ఇందాపూర్ డెయిరీతో తమకు ఎలాంటి యాజమాన్య సంబంధాలు లేవని హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇందాపూర్ డెయిరీ నుంచి చీజ్, పన్నీర్ వంటి ఇతర పాల ఉత్పత్తులను కాంట్రాక్ట్ పద్ధతిలో తయారు చేయించుకుంటున్నప్పటికీ, టీటీడీకి నెయ్యి సరఫరా విషయంలో ఆ సంస్థతో తమకు ఎలాంటి ఒప్పందం లేదని తేల్చి చెప్పింది. తమ సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా నిరాధార ఆరోపణలు చేసిన బొత్స సత్యనారాయణ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెరిటేజ్ తన లీగల్ నోటీసులో పేర్కొంది.

 

నెయ్యి ధరలు పెరగడంపై కూడా టీటీడీ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం పాల ధర రూ.42కు పెరిగిందని, పాల ధరలకు అనుగుణంగానే జాతీయ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (NDDB) నిపుణుల మార్గదర్శకాలతో నెయ్యి సేకరణ ధరలను నిర్ణయించామని టీటీడీ తెలిపింది. ఒకవైపు టీటీడీ తాము పారదర్శకంగా, నాణ్యతకే ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతుండగా, మరోవైపు హెరిటేజ్ న్యాయపరమైన చర్యలకు దిగడంతో ఈ వివాదం రాజకీయంగా మరింత వేడెక్కింది.

Search
Categories
Read More
Telangana
నివాస ప్రాంతాలలో వైన్స్ షాప్ లు వద్దు : ఎమ్మెల్యే కు వినతి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  బోయిన్ పల్లి ప్రాంతంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏరియాలో , మరియు...
By Sidhu Maroju 2025-11-27 10:59:09 0 141
Andhra Pradesh
పుంగనూరు:బోయకొండ ఆలయానికి హుండీ ద్వారా 35 లక్షల ఆదాయం: ఈవో
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు...
By Kothuru Murali 2026-03-27 14:26:54 0 82
Telangana
రెడ్డి శ్రీను ముదిరాజ్ గోకాఫసల్వాడ్
కోడంగల్ ను దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగ రోల్ మోడల్ గ తీర్చిదిద్దుతా   తెలంగాణలో 12,706...
By Vanmoj Suryamohan 2025-12-24 16:40:33 1 440
Andhra Pradesh
Chandrababu Naidu: నెయ్యి కల్తీపై ఏపీ కేబినెట్ సీరియస్.. మంత్రుల ప్రెస్ మీట్... వివరాలు ఇవిగో!
Chandrababu Naidu: నెయ్యి కల్తీపై ఏపీ కేబినెట్ సీరియస్.. మంత్రుల ప్రెస్ మీట్... వివరాలు ఇవిగో!...
By Pagadala Venkateswar 2026-02-03 13:15:27 0 87
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com