Kolusu Parthasarathy: 11 సీట్లకే పరిమితమైనా మీ 'తాచుపాము' బుద్ధి మారలేదు: మంత్రి పార్థసారథి.

0
191

ప్రజా రాజధాని అమరావతిపై వైసీపీ విషం చిమ్ముతోందని మంత్రి పార్థసారథి విమర్శ

నాడు అసెంబ్లీలో జై కొట్టి, అధికారంలోకి వచ్చాక జగన్ మాట మార్చారని ఆరోపణ

 

సొంత ప్యాలెస్‌లకు వేల కోట్లు ఖర్చుపెట్టారని, రాజధానికి మాత్రం అడ్డుపడుతున్నారని ఫైర్

అమరావతి పనులు వేగవంతం చేశాం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధే కూటమి లక్ష్యమని స్పష్టీకరణ

"2024 ఎన్నికల్లో ప్రజల ఆగ్రహానికి గురై కేవలం 11 సీట్లకే పరిమితమైనా వైసీపీ నేతల 'తాచుపాము' బుద్ధి మారకపోవడం రాష్ట్ర దౌర్భాగ్యం" అని రాష్ట్ర సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధిపై, ముఖ్యంగా ప్రజా రాజధాని అమరావతిపై వైసీపీ విషప్రచారం చేస్తోందంటూ మండిపడ్డారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయడమే లక్ష్యంగా వైసీపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు.

 

"హెల్దీ-హ్యాపీ-వెల్తీ స్టేట్ అనే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంటే, రాష్ట్రంలో కనిపిస్తున్న ఆశాజనక వాతావరణాన్ని దెబ్బతీయడమే వైసీపీ పనిగా పెట్టుకుంది. ఒకప్పుడు ఇదే అసెంబ్లీలో అమరావతికి మనస్ఫూర్తిగా 'జై' కొట్టిన జగన్మోహన్ రెడ్డి, అధికారం రాగానే 'నై' అని మాట మార్చి రాష్ట్ర ప్రజలను దారుణంగా వంచించారు. ఐదేళ్ల పాటు రాజధాని లేకుండా చేసి ప్రజల కలలను విధ్వంసం చేశారు" అని పార్థసారథి మండిపడ్డారు.

 

2019కి ముందు అమరావతే రాజధాని అని, తాను తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నానని నమ్మబలికిన జగన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక తుగ్లక్ పాలనను తలపించేలా మూడు రాజధానుల నాటకం ఆడారని విమర్శించారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలు త్యాగం చేసిన 29 వేల మంది రైతులను అవమానించారని, అమరావతిని ఎడారి, శ్మశానంతో పోల్చారని గుర్తుచేశారు. 

 

"సొంత అవసరాల కోసం వందల ఎకరాల్లో, వేల చదరపు అడుగుల ప్యాలెస్‌లు కట్టుకున్న నాయకులు, ఐదు కోట్ల ప్రజలకు రాజధాని అవసరమా అని ప్రశ్నించడం సిగ్గుచేటు. కులాల మధ్య చిచ్చు, ప్రాంతాల మధ్య విషం చిమ్ముతూ నీచ రాజకీయాలు చేయడం జగన్ రెడ్డికి అలవాటుగా మారింది" అని దుయ్యబట్టారు. అమరావతిపై ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ అసత్య ఆరోపణలు చేసి హైకోర్టు, సుప్రీంకోర్టుల చేత మొట్టికాయలు తిన్నా వైసీపీ నేతలకు బుద్ధి రాలేదని పార్థసారథి అన్నారు. 

 

"పీపీపీ విధానంలో రాష్ట్రానికి వచ్చే సంస్థలను 'మేం వస్తే అరెస్ట్ చేస్తాం' అని బెదిరించడం అత్యంత జుగుప్సాకరం. ఇది రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసే కుట్ర కాదా?" అని ప్రశ్నించారు. చంద్రబాబు సైబరాబాద్‌ను నిర్మించినప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయని, కానీ నేడు ఆ ప్రాంతం విలువ అందరికీ తెలుసని అన్నారు. అమరావతి పూర్తయితే వచ్చే లక్షల కోట్ల సంపదతోనే రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతిలో పనులు శరవేగంగా సాగుతున్నాయని, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నిధులతో మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయని తెలిపారు. విశాఖ, అనకాపల్లి ప్రాంతాల్లోనూ టీసీఎస్, రిలయన్స్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టాయని గుర్తుచేశారు. "రాజ్యాంగంపై గౌరవం లేని వైసీపీ, అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించే ధైర్యం లేక బయట కూర్చుని విషప్రచారం చేస్తోంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి పథంలో పయనిస్తోంది. ఈ నిజాన్ని ప్రజలు గ్రహించి, విధ్వంసకర శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి" అని మంత్రి పార్థసారథి పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Business & Finance
One Person Company Registration Secures Your Venture
One Person Company (OPC) Registration is an ideal choice for solo entrepreneurs who want limited...
By Navya Sree 2026-07-22 04:31:36 0 21
Andhra Pradesh
కడప జిల్లాలో కుక్కల దాడిలో చిరుత కూన మృతి.
వైఎస్సార్ కడప జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుక్కల గుంపు దాడిలో ఓ చిరుత పులి కూన మృతి...
By Pagadala Venkateswar 2026-04-08 06:00:46 0 153
Kerala
KAU Thejaswini: Kerala’s New High-Yield Green Chilli
The Kerala Agricultural University (KAU) has unveiled "KAU Thejaswini," a breakthrough green...
By Lokeshwari Panthadi 2026-06-29 05:45:28 0 46
SURAKSHA
Drone AI Surveillance Reduces Crime Rate In Amaravati City
Amaravati lo AP Police Drone + AI CCTV systems install chesaru. Traffic violations, illegal...
By Kalaga Sailaja 2026-07-01 04:59:12 0 99
Telangana
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా బాట....
ఈరోజు శనివారం నాడు దుగ్గొండి మండలంలోని బలవంతపురం గ్రామపంచాయతీ ప్రజా బాట కార్యక్రమం నిర్వహించారు...
By Gujile Ramu 2026-04-25 11:17:50 0 178
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com