Pawan Kalyan: మోదీ, అశ్విని వైష్ణవ్, చంద్రబాబులకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్.

0
101

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ చేసిన కృషి ఫలించింది. చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన పిఠాపురం రైల్వే స్టేషన్‌కు మహర్దశ పట్టనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్' పరిధిలోకి పిఠాపురం స్టేషన్‌ను చేర్చుతూ రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. స్టేషన్ అభివృద్ధి, ఆధునికీకరణ పనుల కోసం రూ. 37.25 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిధులతో పిఠాపురం స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి.

 

కొద్ది నెలల క్రితం తన ఢిల్లీ పర్యటనలో భాగంగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి ఆవశ్యకతను ఆయనకు సమగ్రంగా వివరించారు. పురాణ ప్రాధాన్యం ఉన్న పిఠాపురం పట్టణానికి దేశంలోని సుదూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తుంటారని, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ నొక్కిచెప్పారు. అమృత్ భారత్ పథకం కింద స్టేషన్‌ను అభివృద్ధి చేస్తే యాత్రికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఆయన విజ్ఞప్తి చేశారు.

 

నిజానికి, పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధిపై పవన్ కల్యాణ్ మొదటి నుంచి ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో పిఠాపురంలో పర్యటించినప్పుడు ఆయన క్షేత్రస్థాయిలో స్టేషన్‌ను పరిశీలించారు. ఆ సమయంలో స్టేషన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, దుర్గంధం వెదజల్లడం గమనించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే పరిసరాలను శుభ్రం చేయాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. ఆనాడే స్టేషన్ రూపురేఖలు మార్చాలని ఆయన నిశ్చయించుకున్నారు.

 

పవన్ కల్యాణ్ అభ్యర్థన పట్ల కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేయడంతో, ఇక పిఠాపురం స్టేషన్ సర్వాంగ సుందరంగా ముస్తాబు కానుంది. ఈ నిధులతో స్టేషన్ ప్రధాన భవనం, ముఖద్వారం నిర్మాణం, ప్లాట్‌ఫారమ్‌ల అభివృద్ధి, కొత్త షెల్టర్ల ఏర్పాటు వంటి పనులు చేపట్టనున్నారు. వీటితో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలతో కూడిన విశ్రాంతి గది, అత్యాధునిక టాయిలెట్లు, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, కేబులింగ్ పనులను కూడా పూర్తి చేయనున్నారు.

 

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. తాను అడిగిన వెంటనే పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఆమోదం తెలిపి, నిధులు మంజూరు చేసినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, తక్షణం స్పందించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం మద్దతు ఇస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు కూడా పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలియజేశారు

Search
Categories
Read More
Andhra Pradesh
తిరుమల అన్నప్రసాద సేవపై విదేశీయుడి భక్తుడి ప్రశంసలు
తిరుమల శ్రీవారి అన్నప్రసాద వితరణను చూసి ఓ విదేశీయుడు ఆశ్చర్యపోయాడు. రోజూ లక్ష మందికి పైగా...
By Pagadala Venkateswar 2026-01-13 07:21:39 0 145
Andhra Pradesh
పుంగనూరులో పర్యటించిన స్పెషల్ ఆఫీసర్
అన్నమయ్య సబ్ కలెక్టర్, పుంగనూరు స్పెషల్ ఆఫీసర్ కళ్యాణి మంగళవారం పుంగనూరు పట్టణంలో పర్యటించారు. ఈ...
By Kothuru Murali 2026-05-13 18:42:30 0 49
Telangana
"మహిళలపై నేరాలకు 'మత్తే' కారణం: సీఎం రేవంత్ రెడ్డి సంచలన విశ్లేషణ.|
హైదరాబాద్ : తెలంగాణలో మాదకద్రవ్యాల విక్రయాలు మరియు వాడకం పెరిగిపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By Sidhu Maroju 2026-04-27 17:24:01 0 237
Telangana
"డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. బయటపడిన వందల కోట్ల ఆస్తులు!”
హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ నివాసాలు, కార్యాలయాలకు...
By Sidhu Maroju 2026-05-22 11:25:20 0 65
Telangana
గృహజ్యోతికి దరఖాస్తు చేసుకోవాలి: కడెం ఏఈ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విద్యుత్ గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని...
By Mittapelli Saketh 2026-01-10 04:21:05 0 386
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com