రైతుల భూ హక్కులకు పటిష్ట రక్షణే లక్ష్యం – మంత్రి ఆనం రామనారాయణరెడ్డి యనమదలలో నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

0
319

చేజర్ల: రైతుల భూములకు చట్టబద్ధమైన రక్షణ కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం యనమదల గ్రామంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.

“మీ భూమి – మీ హక్కు” నినాదంతో ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ఈ పాస్ పుస్తకాలు ఆధునిక సాంకేతికతతో రూపొందించబడ్డాయని మంత్రి తెలిపారు. పాస్ పుస్తకాలపై ఉన్న క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే భూ యజమానికి సంబంధించిన పూర్తి వివరాలు వెంటనే తెలుసుకునే విధంగా వాటిని రూపొందించామని చెప్పారు. రైతుల భూ హక్కులకు పూర్తి భద్రత కల్పించే దిశగా ఈ చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.

గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావిడిగా సుమారు 30 లక్షల పాస్ పుస్తకాలను ముద్రించి రైతులకు పంపిణీ చేసిందని, అవి చెల్లని నోట్ల మాదిరిగా ఉపయోగం లేకుండా పోయాయని మంత్రి విమర్శించారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం అందిస్తున్న పాస్ పుస్తకాలు రిజర్వ్ బ్యాంక్ జారీ చేసే కరెన్సీ నోట్ల మాదిరిగా చట్టబద్ధతతో కూడిన భద్రత కలిగినవని తెలిపారు. 2026 డిసెంబర్ నాటికి రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లోపాలను పూర్తిగా సరిచేసి రైతులకు మరింత భరోసా కల్పిస్తామని స్పష్టం చేశారు.

సూపర్ సిక్స్ పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఆర్థిక సహాయం అందిస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం స్త్రీనిధి పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు తక్కువ ధరలో భోజనం అందిస్తున్నామని, పింఛన్లను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని చెప్పారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు మద్దతు అందిస్తున్నామని, ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం ప్రభుత్వం గ్యాస్ సంస్థలకు నిధులు చెల్లిస్తోందని వివరించారు.

ఈ సందర్భంగా యనమదల గ్రామపంచాయతీలో రూ.18 లక్షలతో నిర్మించిన సిమెంటు రోడ్డును మంత్రి ప్రారంభించారు. గోకులం షెడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయడంతో పాటు దేవాదాయ శాఖ నిధులు రూ.5 లక్షలతో నిర్మించనున్న శ్రీ గంగమ్మతల్లి దేవస్థానం ప్రహరీ గోడకు భూమిపూజ చేశారు. ఆలయానికి అనుబంధంగా ముఖ మండపం, భజన మందిర నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేస్తామని తెలిపారు. గ్రామ నేతల అభ్యర్థన మేరకు చేజర్ల మండల కేంద్రంలో షాది మంజిల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

గ్రామస్తులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు తాళ్లూరి గిరినాయుడు, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ అధికారి బి.పావని, డీఎస్పీ వేణుగోపాల్, డీఎల్పీఓ రమణయ్య, సంఘం సీఐ శ్రీనివాసులు రెడ్డి, చేజర్ల–సంగం ఎస్సైలు తిరుమలరావు, రాజేష్ తదితర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com