అక్రమాలకు నిలయంగా మారిన నల్లచెరువు

0
183

*అక్రమాలకు నిలయంగా నల్లచెరువు అభివృద్ధి కమిటీ*

 

*-దశాబ్దాలుగా కమిటీలు మారుతున్నా అభివృద్ధికి నోచుకోని చెరువు* 

 

*-ఎవరికివారే సొంత పెత్తనాలు*

 

*-చెరువులో చేపలు పెంచుకునే హక్కు కు బహిరంగ వేలం పాటల ద్వారా లక్షల్లో ఆదాయం* 

 

*-దుకాణ సముదాయం ద్వారా ప్రతి నెలా రూ. 17 వేల అద్దెల వసూళ్లు*

 

*-చెరువును ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేసేలా మంత్రి లోకేష్ చర్యలు తీసుకోవాలి* 

 

*-పలువురు స్థానిక ప్రజల వినతి*

 

 

*యర్రబాలెం:*

మంగళగిరి - తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెం నల్ల చెరువు అభివృద్ధి కమిటీ అవినీతి, అక్రమాలకు నిలయంగా మారింది. దశాబ్దాలుగా కమిటీలు మారుతున్నాయే తప్ప వారి వారి హయాం లో చెరువు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఎవరి హయాంలో వారు తమ సొంత పెత్తనాలతో సరిపెడుతూ కాలయాపన చేస్తున్నారు. సుమారు 16 ఎకరాల విస్తీర్ణం కలిగిన చెరువులో చేపలు పెంచుకునే హక్కుకు ప్రతి రెండేళ్లకు ఒకసారి బహిరంగ వేలం పాటలు నిర్వహించి లక్షల్లో ఆదాయం 

ఒనగూర్చుకుంటున్నారు. వచ్చిన ఆదాయాన్ని పండుగలు, స్వామి వార్ల ఉత్సవాలు పేరుతో మొక్కుబడిగా ఖర్చు పెడుతూ అందిన కాడికి దండుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు. గత కొన్ని దశాబ్దాలుగా ఈ తంతు యదేచ్చగా కొనసాగుతూనే ఉందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.

 

*పాత పంచాయితీ భవనాన్ని కూల్చి దుకాణ సముదాయం*

 

యర్రబాలెంలోని పాత పంచాయితీ భవనాన్ని గత కొన్ని దశాబ్దాల క్రితం ఆనాటి నల్లచెరువు కమిటీ పాలకవర్గం కూల్చి వేసి అనంతరం ఆ స్థలంలో దుకాణ సముదాయాన్ని నిర్మించారు. ఆపై దుకాణాలకు బహిరంగ వేలం పాటలు నిర్వహించి ప్రతి నెలా వేలాది రూపాయల అద్దెలను వసూలు చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతానికి దుకాణ సముదాయానికి సంబంధించి ప్రతి నెలా రూ. 17 వేల చొప్పున అద్దెలు వసూలు చేస్తున్నారు.

 

*కలగానే మిగిలిన గ్రంథాలయ నిర్మాణం*

 

శిధిలమైన పాత పంచాయితీ భవనాన్ని కూల్చి గ్రంథాలయాన్ని నిర్మిస్తామని ఆనాటి పాలకవర్గం గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే పాత పంచాయితీ స్థలంలో గ్రంథాలయాన్ని నిర్మించకుండా దుకాణ సముదాయాలను నిర్మించి అద్దెలకి ఇచ్చి ఆదాయాన్ని రాబట్టుకుంటున్నారు. అదేమని గ్రామస్తులు అడిగితే... రెండవ అంతస్తు నిర్మించి అందులో గ్రంధాలయాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే నేటి వరకు నల్లచెరువు అభివృద్ధి కమిటీ గ్రంథాలయ నిర్మాణం మాత్రం చేపట్టలేదు. 

 

*విద్యుత్ షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుకు బహిరంగ వేలం*

 

చెరువు స్థలంలో విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేసినందుకు ఆనాటి నల్లచెరువు కమిటీ షిఫ్ట్ ఆపరేటర్ పోస్టును తమ గ్రామానికి చెందిన వారికి కేటాయించాలని కోరింది. అంతవరకు బాగానే ఉంది. అయితే... ఆ షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుకు బహిరంగ వేలం పాట నిర్వహించి సుమారు రూ.5.50 లక్షలను వసూలు చేసింది. గ్రామంలో అర్హుడైన నిరుపేదకు షిఫ్ట్ ఆపరేటర్ పోస్టును ఇప్పించాల్సిన నల్లచెరువు కమిటీ ఇలా ఆ పోస్టుకు బహిరంగ వేలం పాట నిర్వహించి ఆదాయాన్ని పొందడం అప్పట్లోనే పలు విమర్శలకు దారితీసింది.

 

*చెరువు రక్షణకు తీసుకున్న చర్యలు శూన్యం*

 

దశాబ్దాలుగా నల్లచెరువు అభివృద్ధి కమిటీ పాలకవర్గాలు మారుతున్నా చెరువు రక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఫలితంగా కాలక్రమంలో ఎంతో మంది తమ విలువైన ప్రాణాలను కోల్పోయారు. గత కొన్నేళ్ల క్రితం ఏపీ సచివాలయం వైపు నుండి వస్తున్న కారు మలుపు వద్ద అదుపుతప్పి ప్రమాదవశాత్తు చెరువులోకి దూసుకుపోయింది. కారు నీటిలో పూర్తిగా మునిగిపోవడంతో అందులో ఉన్న నలుగురు యువకులు బయటకు రాలేక, ఊపిరాడక మృతి చెందారు. మరో కొన్ని రోజుల తర్వాత ఓ పోస్టల్ శాఖ ఉద్యోగి ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెరువులోకి దూసుకుపోవడంతో వాహనంతో సహా నీటిలో మునిగి మృత్యువాత పడ్డాడు. ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను నల్లచెరువు అభివృద్ధి కమిటీ కనీసం పరామర్శించి ఎక్స్గ్రేషియా కూడా చెల్లించక పోవడం బాధాకరం. వాహనదారులు ప్రమాదవశాత్తు చెరువులోకి దూసుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నా చెరువు చుట్టూ తగు రక్షణా చర్యలు తీసుకోవాల్సిన నల్లచెరువు అభివృద్ధి కమిటీ సభ్యులు మీనమేషాలు లెక్కిస్తూ మిన్న కుండిపోయారు. 

 

*మంత్రి నారా లోకేష్ చొరవతో చెరువు కు రక్షణ వలయం*

 

చెరువుకు రక్షణా వలయం లేకపోవడంతో వాహనదారులు ప్రమాదవశాత్తు దూసుకుపోయి చెరువులో పడి మృత్యువాత పడుతున్న విషయం విదితమే. ఈ విషయాన్ని గ్రామ పార్టీ నేతలు, స్థానిక ప్రజలు నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన మంత్రి లోకేష్ సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి ఏపీ సచివాలయం రహదారి వెంబడి ఉన్న చెరువు కు సుమారు రూ.20 లక్షలతో ఇనుప రైలింగ్ వేయించారు. కాగా గత కొంతకాలం క్రితం చెరువు స్థలాన్ని మంగళగిరి - తాడేపల్లి నగర పాలక సంస్థ స్వాధీనం చేసుకోవాలని కోరుతూ నల్ల చెరువు అభివృద్ధి కమిటీ పెద్దలు కొందరు కమిషనర్ అలీమ్ బాషా ను కలసి వినతి పత్రం అందజేయడం కొసమెరుపు. ఏది ఏమైనా చెరువు స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మించడంతోపాటు, మిగిలిన స్థలంలో గ్రామ ప్రజల సామాజిక అవసరాల కోసం అవసరమైన నిర్మాణాలు చేపట్టేలా తగు చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ ను స్థానిక ప్రజలు కోరుతున్నారు. నల్లచెరువు అభివృద్ధి కమిటీ పేరుతో గత కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న అవినీతి, అక్రమాలపై సైతం విచారణ చేపట్టి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని పలువురు గ్రామ ప్రజలు కోరుతున్నారు. 

 

Search
Categories
Read More
Andhra Pradesh
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం పై దాడి యత్నం దుర్మార్గం సుగవాసి ప్రసాద్ బాబు
హైదరాబాదులోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం పై వైసీపీ శ్రేణులు దాడికి యత్నించడం తీవ్రంగా...
By Benguluri Madhubabu 2026-04-07 12:48:40 0 203
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు మండలంలో జీవో నెంబర్ 188 అమలుకు కమిటీ.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలంలో పంచాయతీ ఆస్తుల పరిరక్షణ కోసం జీవో నెంబర్ 188 అమలు చేయనున్నారు....
By Kothuru Murali 2026-01-14 08:54:40 0 178
SURAKSHA
సైబర్ నేరాల బారిన పడకండి.-- జిల్లా ఎస్పీ శ్రీ ఆర్.గంగాధరరావు, ఐపిఎస్. |
🚨 కృష్ణాజిల్లా ప్రజలందరికీ పోలీసు వారి ముఖ్యమైన హెచ్చరిక 🚨 సాంకేతికత అందరికీ అందుబాటులోకి ఎంత...
By Bharat Aawaz 2025-09-09 05:19:13 0 1K
Telangana
పాఠశాల స్థల విస్తీర్ణం సరిహద్దుల నిర్ధారణ - సంబంధిత అధికారుల సర్వే.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం డివిజన్ లో గల కౌకూర్...
By Sidhu Maroju 2025-12-19 14:20:11 0 275
Andhra Pradesh
పుంగనూరు: ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో వ్యక్తిపై దాడి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, మోదుగులపల్లి గ్రామానికి చెందిన నాగరాజు, చౌడేపల్లి మండలం కు...
By Kothuru Murali 2026-04-10 04:45:30 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com