Chandrababu Naidu: విపక్షం లేకున్నా ఐదు కోట్ల ప్రజల కోసమే చర్చలు: సీఎం చంద్రబాబు.

0
112

15 రోజుల పాటు అసెంబ్లీలో చర్చలు జరిపినట్టు చంద్రబాబు వెల్లడి

గత పాలకుల విధ్వంసం నుంచి ఏపీ పునర్నిర్మాణం జరుగుతోందని ఉద్ఘాటన

సభలో లేకుండా పారిపోయిన పార్టీ ప్రతిపక్షం హోదా కోసం డిమాండ్ చేస్తోందని ఎద్దేవా

ఆర్ధిక ఇబ్బందులున్నా సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశామన్న సీఎం

గడచిన పదిహేను రోజులుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా కేవలం చట్టాలు చేయడం మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా అర్థవంతమైన చర్చలు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా సభలో ఆయన ప్రసంగిస్తూ.. ప్రత్యర్థి పార్టీ సభకు గైర్హాజరై ప్రజా సమస్యలను గాలికొదిలేసినప్పటికీ, తాము మాత్రం ప్రజల ఆకాంక్షలే అజెండాగా ముందుకు సాగామని తెలిపారు. భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు.

 

రాష్ట్ర విభజన కష్టాలకు తోడు, గత పాలకుల విధ్వంస పాలన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఇప్పుడు ఇటుక ఇటుక పేర్చి పునర్నిర్మాణం చేసుకోవాల్సి వస్తోందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పక్షాలన్నీ పూర్తి సఖ్యతతో ఉన్నాయని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ సంపూర్ణ సహకారంతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని వివరించారు. గత ఎన్నికల్లో కూటమి నిలబెట్టిన అభ్యర్థుల్లో 94 శాతం మందిని ప్రజలు గెలిపించారని, ఇది తమపై జనం పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.3.32 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, అభివృద్ధి, సంక్షేమాలను సమన్వయం చేస్తున్నామన్నారు.

 

ప్రతిపక్షం తీరుపై సీఎం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రజలు ఓట్లు వేస్తేనే అధికారం లేదా ప్రతిపక్ష హోదా వస్తాయని హితవు పలికారు. బాధ్యత గల పార్టీగా సభకు వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడకుండా తప్పించుకు తిరుగుతున్నారని విమర్శించారు. గడచిన 20 నెలల పాలనలో ఎన్నో కష్టాలను అధిగమించామని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 'సూపర్ సిక్స్' హామీలను అమలు చేసి సూపర్ హిట్ చేశామని సగర్వంగా ప్రకటించారు. రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు, విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నామన్నారు.

 

గత ప్రభుత్వం కేంద్ర నిధులను, పథకాలను నిర్వీర్యం చేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. 92 కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 85 పథకాలు నిధుల మళ్లింపు వల్ల నిర్వీర్యం అయిపోయాయని గణాంకాలతో సహా వివరించారు. ముఖ్యంగా 'జల్ జీవన్ మిషన్' కింద రాష్ట్రానికి రూ.85 వేల కోట్లు రావాల్సి ఉండగా, గత పాలకులు కేవలం రూ.25 వేల కోట్లకే ప్రతిపాదనలు పంపి, చివరకు రూ.2500 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పథకానికి జీవం పోశామని, ఇంటింటికీ కుళాయి ద్వారా నీరందించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీసుకుంటున్న చొరవ అభినందనీయమని కొనియాడారు. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మారిషస్ అధ్యక్షునికి ఘన స్వాగతం పలికిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు.
గుంటూరు, లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మిడాల నగర్ శ్రీ సత్య సాయి స్పిరిట్యుయల్ సిటీలో...
By John Baji 2026-01-03 15:29:58 0 181
Andhra Pradesh
బైక్ అదుపుతప్పి ఇటుకల బట్టీ కార్మికుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలం సీటీఎంలో ఇటుకల బట్టీ కార్మికుడిగా పనిచేస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన శివయ్య,...
By Pagadala Venkateswar 2026-02-25 08:31:00 0 152
Telangana
కుషాయిగూడ, అల్వాల్ పి.హెచ్. సి.లకు క్యాన్సర్ పరీక్ష పరికరాలు మహతి ఫౌండేషన్ సహకారంతో అందించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.
  అల్వాల్ ల్లో జరిగిన ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2025-06-03 14:06:11 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com