Chandrababu Naidu: ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు హాజరైన సీఎం చంద్రబాబు... దిగ్గజ సంస్థలతో 7 కీలక ఒప్పందాలు.

0
89

Chandrababu Naidu: ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు హాజరైన సీఎం చంద్రబాబు... దిగ్గజ సంస్థలతో 7 కీలక ఒప్పందం   ఆంధ్ర.

 

Chandrababu Naidu Attends AI Impact Summit in Delhi Secures 7 Key Agreements

ఢిల్లీ ఏఐ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు 

ఏపీని ఏఐ-క్వాంటం హబ్‌గా మార్చే దిశగా ప్రణాళికలు

ఐబీఎం, ఐఐటీ మద్రాస్ సహా ఏడు ప్రపంచ స్థాయి సంస్థలతో కీలక ఒప్పందాలు

లక్షల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి, శిక్షణకు మార్గం

అమరావతిలో క్వాంటం వ్యాలీ, ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు

ఆంధ్రప్రదేశ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌గా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ ముందడుగు వేసింది. భవిష్యత్ సాంకేతికతను అందిపుచ్చుకుని, యువతకు ఉజ్వల అవకాశాలు కల్పించడంతో పాటు, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తోంది. 

 

ఇందులో భాగంగా ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరిగిన 'ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ - 2026'లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సదస్సులో ఐబీఎం, ఐఐటీ మద్రాస్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలతో ఏడు కీలక అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకున్నారు. అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేసి, దానికి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే ఈ ఒప్పందాల ప్రధాన ఉద్దేశం.

 

ఈ ఒప్పందాలు రాష్ట్రంలో ఏఐ, క్వాంటం రంగాల్లో నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు మార్గం సుగమం చేయనున్నాయి. విద్యార్థులు, యువతకు అత్యాధునిక సాంకేతికతలో శిక్షణ ఇవ్వడం, ప్రభుత్వ శాఖల్లో ఏఐ వినియోగాన్ని పెంచడం, తద్వారా పాలనను సులభతరం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

 

ఒప్పందం - 1: యూఎన్ఐసీసీతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్

ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్ (యూఎన్ఐసీసీ)తో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం అమరావతి క్వాంటం వ్యాలీలో ఈ ఏడాది చివరి నాటికి ఒక ఏఐ క్వాంటం నైపుణ్య కేంద్రం (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) ఏర్పాటు కానుంది. దీనిని ఒక ఏఐ-క్వాంటం డిజిటల్ ఎంబసీగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో యూఎన్ఐసీసీ డైరెక్టర్ సమీర్ చౌహాన్ పాల్గొన్నారు.

 

ఒప్పందం - 2: ఐబీఎంతో లక్ష మందికి శిక్షణ

ప్రపంచ టెక్ దిగ్గజం ఐబీఎంతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని లక్ష మంది యువతకు క్వాంటం, ఏఐ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఐబీఎం గ్లోబల్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫాం ద్వారా పరిశ్రమ అవసరాలకు తగ్గ నైపుణ్యాలను అందించనున్నారు. ఐబీఎం ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్, ఇతర ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

ఒప్పందం - 3: నీలిట్‌తో ఏఐ, క్వాంటం యూనివర్సిటీకి ఎంవోయూ

దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి ఏఐ, క్వాంటం డీమ్డ్ యూనివర్సిటీని ఏపీలో ఏర్పాటు చేసేందుకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ (నీలిట్)తో ఒప్పందం కుదిరింది. ఈ యూనివర్సిటీకి కేంద్రం నిధులు సమకూర్చనుండగా, రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించనుంది. అమరావతిని క్వాంటం కంప్యూటింగ్‌లో జాతీయ హబ్‌గా మార్చడం దీని లక్ష్యం. నీలిట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మదన్ మోహన్ త్రిపాఠి ఒప్పందంపై సంతకం చేశారు.

 

ఒప్పందం - 4: స్వదేశీ ఏఐ స్టాక్ నిర్మాణం

రాష్ట్ర స్థాయిలో ఐదు అంచెల స్వదేశీ ఏఐ స్టాక్‌ను నిర్మించేందుకు భారత్ జెన్-నెక్స్ జెన్‌-ఐబీఎంలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇది ప్రభుత్వ సంస్థలకు సేవలు అందించడంతో పాటు, 22 భారతీయ భాషలను అనుసంధానించే వేదికగా పనిచేస్తుంది.

 

ఒప్పందం - 5: కాలిబో ఏఐతో నైపుణ్య బలోపేతం

రాష్ట్రంలోని 50 ఉన్నత విద్యాసంస్థల్లో ఏఐ, క్వాంటం టెక్నాలజీని బలోపేతం చేసేందుకు కాలిబో ఏఐ సంస్థ ముందుకు వచ్చింది. ఏఐ అకాడెమీ, ఏఐ శాండ్‌బాక్స్, ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు, ఫ్యాకల్టీకి శిక్షణ ఇవ్వనున్నారు. ఏఐ ఆధారిత కరిక్యులమ్ రూపకల్పనపై కూడా ఈ ఒప్పందంలో దృష్టి సారించారు.

 

ఒప్పందం - 6: వైజర్ సంస్థతో మరో నైపుణ్య కేంద్రం

అమరావతి క్వాంటం వ్యాలీలో మరో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు వైజర్ సంస్థతో ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది చివరి నాటికి మూడున్నర లక్షల మందికి, 2027 నాటికి ఆరు లక్షల మందికి ఏఐ-క్వాంటం రంగాల్లో శిక్షణ ఇవ్వాలని వైజర్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

 

ఒప్పందం - 7: ఐఐటీ మద్రాస్‌తో ఏఐ ట్యూటర్

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ట్యూటర్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి ఐఐటీ మద్రాస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఒప్పందాలతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ టెక్నాలజీకి చిరునామాగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ అక్రమ గంజాయి పట్టివేత
గుంటూరు జిల్లా పోలీస్...* *నగరం పాలెం పోలీస్ స్టేషన్.* *తేది : 22.12.2025* _*//గంజాయి కేసులో...
By KOTESWARARAO KVSR 2025-12-23 13:59:12 0 147
Andhra Pradesh
గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV టీకా: పోస్టర్ విడుదల.
మంగళవారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి (DRO) మధుసూదన్ రావు HPV టీకా...
By Pagadala Venkateswar 2026-03-10 12:52:57 0 93
Andhra Pradesh
నేర చరితను మరిచిపోవాలి !!!
కర్నూలు జిల్లా...* నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని  రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న...
By Hari Krishna 2025-12-21 09:21:45 0 165
Andhra Pradesh
Ambati Rambabu: హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు అర్ధాంగి విజయలక్ష్మి.
హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసిన అంబటి రాంబాబు భార్య తనతో పాటు 60 మందిని పోలీసులు అక్రమంగా...
By Pagadala Venkateswar 2026-02-01 08:43:10 0 88
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com