Chandrababu Naidu: స్కిల్ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చిన ఈడీ.

0
154

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఎం చంద్రబాబుకు కీలక ఊరట

అనుబంధ చార్జిషీట్‌లో నిందితుడిగా పేర్కొనని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

 

మనీలాండరింగ్ కార్యకలాపాల్లో చంద్రబాబు పాత్ర లేదని స్పష్టం చేసిన ఈడీ

ఇటీవలే కేసును మూసివేసిన ఏపీ సీఐడీ

ఇతర నిందితులపై కొనసాగనున్న విచారణ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి భారీ ఊరట లభించింది. ఈ కేసులో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), తాజాగా దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌లో ఆయన పేరును నిందితుడిగా చేర్చలేదు. నిధుల దుర్వినియోగం, మనీలాండరింగ్ కార్యకలాపాల్లో చంద్రబాబు పాత్ర ఉన్నట్లు తమ దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదని ఈడీ స్పష్టం చేసింది.

 

విశాఖపట్నంలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో ఈడీ ఈ సప్లిమెంటరీ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ చార్జిషీట్‌ను జనవరి 28న కోర్టు విచారణకు స్వీకరించింది. డిజైన్‌టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (DTSPL), దాని ఎండీ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్, సీమెన్స్ ఇండియా మాజీ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్ (సుమన్ బోస్) తదితరులను నిందితులుగా పేర్కొన్న ఈడీ, చంద్రబాబు ప్రమేయంపై సాక్ష్యాలు లేవని తేల్చి చెప్పింది. ఈడీ అధికారిక ప్రకటనతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

 

ఇదే కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేయడం, ఆయన 53 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉండటం తెలిసిందే. అయితే, గత నెలలోనే ఏపీ సీఐడీ ఈ కేసులో చంద్రబాబుపై ఆరోపణలు "వాస్తవ దోషం (Mistake of Fact)" అని పేర్కొంటూ విజయవాడ కోర్టులో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసింది. కోర్టు దానిని ఆమోదించడంతో సీఐడీ కేసు మూసివేతకు గురైంది. సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగానే దర్యాప్తు చేపట్టిన ఈడీ కూడా ఇప్పుడు చంద్రబాబు పాత్ర లేదని చెప్పడంతో ఆయనకు పూర్తిస్థాయిలో ఊరట లభించినట్లయింది.

 

ఈడీ తాజా నిర్ణయంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై స్పందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఇది చంద్రబాబు నిష్కళంక రాజకీయ జీవితానికి లభించిన "గొప్ప నైతిక విజయం" అని అభివర్ణించారు. సత్యం, న్యాయం వైపు నిలబడే నాయకుడు చంద్రబాబు అని ఈ తీర్పు మరోసారి నిరూపించిందని ఆయన అన్నారు. కాగా, ఈ కేసులో ఇతర నిందితులపై పీఎంఎల్‌ఏ కోర్టులో విచారణ కొనసాగనుంది. ఈ కేసులో ఇప్పటివరకు ఈడీ మొత్తం ₹54.74 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.

Search
Categories
Read More
Telangana
కాళేశ్వరంలో లక్ష కోట్లు తిన్నారు అనడానికి రేవంత్ రెడ్డికి బుద్ది ఉందా! ..బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్
కాళేశ్వరంలో లక్ష కోట్లు తిన్నారు అనడానికి రేవంత్ రెడ్డికి బుద్ది ఉందా!! ‎కాళేశ్వరం...
By Ponnala Srinivasrao 2026-07-10 09:02:22 0 108
SURAKSHA
AP పోలీసులు నేడు: బ్యాడ్జి లేని హృదయం ఉన్న హీరోలు
నేడు AP పోలీసులు బ్యాడ్జి లేకపోయినా హీరోలని నిరూపించారు. అనాథ పిల్లలకు సంరక్షకులుగా మారి చదువు,...
By Kalaga Sailaja 2026-07-04 09:37:28 0 52
Telangana
అంగన్వాడీ టీచర్స్ కి స్మార్ట్ ఫోన్స్ పంపిన చేసిన ఎంమ్మెల్యే గడ్డం వినోద్
బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అంగన్వాడి...
By Avunoori Mahesh 2026-04-11 17:42:18 0 167
Telangana
అకాల వర్షాలు కన్నీళ్లు పెడుతున్న రైతులు....
అకాల వర్షాలు.. అన్నదాతకు కన్నీళ్లు.... భారత్ అవాజ్ న్యూస్ :TG: రాష్ట్రంలో అకాల వర్షాలకు పంట...
By Gujile Ramu 2026-05-04 01:13:40 0 148
Andhra Pradesh
గంజాయి మత్తుతోనే అఘాయిత్యాలు: మాజీ ఎమ్మెల్యే.
ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి, కల్తీ మద్యం విచ్చలవిడిగా లభ్యమవుతుండటమే మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారి ఋషిక...
By Pagadala Venkateswar 2026-02-19 10:32:42 0 164
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com