యువనేత లోకేష్ సారధ్యంలో విప్లవాత్మక సంస్కరణలు

0
213

*యువనేత లోకేష్ సారథ్యంలో విప్లవాత్మక సంస్కరణలు*

 

*ఏపీలో విద్యావ్యవస్థను నెం.1గా తీర్చిదిద్దడమే లక్ష్యం*

 

*మెగా డీఎస్సీ నుంచి టీచర్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ వరకూ...*

 

*పైరవీలకు తావులేకుండా పారదర్శక విధానాల అమలు*

 

*రాష్ట్రంలో విద్యాసంస్కరణలపై కేంద్రమంత్రి ప్రశంస*

 

*అమరావతి:*

రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ఈ ఏడాది విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారు. సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెరిగాయి. అంతర్జాతీయంగా విద్యారంగంలో వస్తున్న మార్పులకు ధీటుగా ఏపీలో విద్యావ్యవస్థను తయారు చేయాలన్న ధ్యేయంతో ముందుకు సాగుతున్నారు. విద్యారంగ సంస్కరణల ద్వారా గుణాత్మక విద్యకు శ్రీకారం చుట్టారు. ఏపీ విద్యావ్యవస్థను దేశంలోనే నెం.1గా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో యువమంత్రి లోకేష్ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ఐదేళ్ల తర్వాత తొలిసారిగా మెగా డీఎస్సీని విజయవంతంగా నిర్వహించి 16,347 టీచర్ పోస్టులను భర్తీచేశారు. కొందరు రాజకీయ ప్రత్యర్థులు కుట్రతో 200కు పైగా కేసులు వేసినప్పటికీ వాటన్నింటినీ చాకచక్యంగా పరిష్కరించి, కేవలం 150రోజుల వ్యవధిలో డీఎస్సీని విజయవంతంగా నిర్వహించి రికార్డు సృష్టించారు. టీచర్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ ద్వారా ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టారు. దీనివల్ల ప్రభుత్వ&స్థానిక సంస్థల పాఠశాలల్లో టీచర్ల బదిలీలకు చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటైంది. వెబ్-ఆధారిత కౌన్సిలింగ్‌ ద్వారా గతంలో మాన్యువల్ విధానంలో సమస్యలకు చరమగీతం పాడారు. వివిధ కేడర్ లలో 4వేల మందికి పైగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు సైతం లభించాయి. దేశంలోనే తొలిసారిగా కడప జిల్లాలో సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ విధానాన్ని అమలు చేస్తున్నారు.

 

విద్యార్థుల్లో మానసిక వికాసం కోసం ప్రతి శనివారాన్ని నో బ్యాగ్ డేగా ప్రకటించారు. దీనిద్వారా సహ-పాఠ్య, సమృద్ధి కార్యక్రమాలు, క్రీడలు, దృశ్య-ప్రదర్శన కళలు, జీవన నైపుణ్యాల ఆధారిత శిక్షణ ఇస్తూ విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా చర్యలు చేపట్టారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు శిరోభారంగా పరిణమించిన సుమారు 45 యాప్ ల భారాన్ని తగ్గించి, కేవలం ఒకే యాప్ కిందకు తెచ్చారు. సింగిల్ ఇంటర్ ఫేస్ ద్వారా ప్రతివిద్యార్థి పనితీరుకు సంబంధించిన డేటాను రియల్ టైమ్ క్లాస్ రూమ్/తల్లిదండ్రుల భాగస్వామ్యంతో అనుసంధానించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ ఏడాది క్రీమ్ & ఆలివ్-గ్రీన్ యూనిఫామ్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాజకీయరహిత, పార్టీరహిత, నిష్పక్షపాత రంగులతో అత్యంత ఆకర్షణీయంగా ఈ యూనిఫాంను డిజైన్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా NCERT-అనుగుణ కరిక్యులమ్ కు రూపకల్పన చేశారు. పాఠశాల విద్యలో ఫౌండేషన్ లిటరసీ-న్యూమరసీ (FLN), డిజిటల్ లిటరసీ, సామర్థ్య-ఆధారిత బోధనను మరింత విస్తృత పర్చడానికి వీలుగా... క్యూఆర్ కోడ్ కంటెంట్ తో బైలింగ్వువల్ సిలబస్‌ను తీసుకువచ్చారు. ఏఐ ఆధారిత ఎసెస్ మెంట్, డిజిటల్ లెర్నింగ్, ప్లేబేస్డ్, సామర్థ్య కేంద్రీకృత విధానాల సమ్మిళితంతో లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (LEAP) పేరిట సమగ్ర సంస్కరణ మోడల్ విద్యకు శ్రీకారం చుట్టారు. ఈ విధానంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ కు ధీటుగా తీర్చిదిద్దనున్నారు. లీప్ కార్యక్రమం కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 175 స్కూళ్లను అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయనున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రు జడ్పీ ఉన్నత పాఠశాలను ఎంపిక చేశారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు 9,600 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటుచేసి ఒకే తరగతి, ఒకే టీచర్ విధానాన్ని ప్రవేశపెట్టారు.

 

రాజకీయ నేతల పేర్లు, బొమ్మలకు ఆస్కారం లేకుండా 2025-26 విద్యాసంవత్సరంలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర విద్యా కిట్లు & అసెస్‌మెంట్ పుస్తకాలను రాష్ట్రవ్యాప్తంగా 35.94లక్షల మందికి అందజేశారు. ఫార్మేటివ్/సమ్మేటివ్ అసెస్‌మెంట్లను క్రోడీకరించి, డాక్యుమెంట్ చేయడానికి వీలుగా అసెస్‌మెంట్ బుక్‌లెట్లను అందించారు. రాష్ట్రంలో నూరుశాతం అక్షరాస్యత సాధనే లక్ష్యంగా మిషన్ “అక్షర ఆంధ్ర” ప్రకటించారు. అన్ని గ్రూపుల వయోజనులను అక్షరాస్యులుగా మార్చే లక్ష్యంతో స్టేట్ లిటరసీ మిషన్ ను బలోపేతం చేశారు. యోగవిద్యపై విద్యార్థుల్లో చైతన్యాన్ని నింపేందుకు యోగాంధ్ర – 2025 పేరిట రాష్ట్రవ్యాప్త పాఠశాల-సంబంధిత యోగా కార్యక్రమాన్ని చేపట్టారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21 నుంచి జూలై 2025 వరకు నెలరోజులపాటు చేపట్టిన ఈ కార్యక్రమంలో లక్షలాది విద్యార్థులు, ఉపాధ్యాయులు సమకాలీన యోగా అభ్యాసకులు భాగస్వాములయ్యారు. ఈ ఏడాది జులై, డిసెంబర్ నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్ –టీచర్ మీటింగ్ (మెగా పిటిఎం)ను విజయవంతంగా నిర్వహించారు. 61వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఒకేసారి ఈ కార్యక్రమాన్ని చేపట్టగా, 53.4 లక్షలకు పైగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భాగస్వాములయ్యారు. జులై 10న నిర్వహించిన మెగా పిటిఎంలో మొత్తంగా 1.5 కోట్లు (15 మిలియన్లు) మించిందని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ధృవీకరించింది. విద్యార్థుల్లో పర్యావరణపై అవగాహన కోసం గ్రీన్ పాస్ పోర్టును ప్రవేశపెట్టారు. ఎకో-సిటిజన్‌షిప్, చెట్లు నాటడం, సస్టైనబిలిటీ పద్ధతులను పెంపొందించడం ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. అత్యున్నత ప్రమాణాలతో పారదర్శకంగా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికను చేపట్టారు. ఏటా ఉపాధ్యాయుల దినోత్సవం రోజున వారిని ఘనంగా సత్కరిస్తున్నారు. రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను అధునాతన విద్యావిధానాలపై అధ్యయనం కోసం విదేశాలకు పంపిస్తున్నారు. అక్కడి బోధనా పద్ధతులు, తరగతి గదుల్లో వినియోగిస్తున్న ఆధునిక సాంకేతికత, పాఠశాల వాతావరణం వంటి అంశాలపై వారు సమగ్రంగా అధ్యయనం చేయనున్నారు.

 

రాష్ట్రప్రభుత్వం, సైయెంట్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో విశాఖపట్నం జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు రూ.8కోట్ల వ్యయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, STEM, రోబోటిక్స్ ల్యాబ్‌లను ఏర్పాటుచేశారు. మధ్యస్థ & ఉన్నత పాఠశాల విద్యార్థులకు హ్యాండ్స్-ఆన్ టెక్నాలజీ విద్య, కోడింగ్ లిటరసీ, ఇన్‌క్వైరీ-ఆధారిత లెర్నింగ్‌ను బలోపేతం చేయడానికి ఈ ల్యాబ్‌లు ఏర్పాటుచేశారు. ఏపీ టెట్ నిర్వహణ కోసం అక్టోబర్ -2025 నోటిఫికేషన్ ప్రకటించారు. ఉపాధ్యాయ అర్హత & సర్టిఫికేషన్ టెస్టింగ్ కోసం ఆన్‌లైన్ అప్లికేషన్ విండో (అక్టోబర్ చివరి నుంచి) ఓపెన్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీలను అంచనా వేయడానికి ఈ ఏడాది నవంబర్ 24నుంచి డిసెంబర్ 6వరకు 14లక్షలమంది ప్రాధమిక విద్యార్థులను కవర్ చేస్తూ ఎఫ్ఎల్ఎన్ బేస్ లైన్ సర్వే నిర్వహించారు. బేస్ లైన్ సర్వే ఆధారంగా ఎఫ్ఎల్ఎన్ పై రాష్ట్రవ్యాప్తంగా క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. ప్రాథమిక విద్యార్థులకు చదువు, భాషా అవగాహన, సంఖ్యాపాటవాన్ని మెరుగుపరచడానికి డిఫరెన్షియేటెడ్ లెర్నింగ్ గ్రూపింగ్‌లు & రోజువారీ కార్యకలాపాల ప్రణాళిక అమలు చేశారు.

 

పాఠశాల విద్యార్థుల్లో నైతిక విలువలపై అవగాహన కోసం విజయవాడలో విలువల విద్యాసదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రప్రభుత్వ సలహాదారు, ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. విద్యార్థుల్లో నైతికత, వ్యక్తిగత క్రమశిక్షణ, జీవిత విలువలపై దృష్టి సారించిన ప్రభుత్వం.. ప్రత్యేక పాఠ్యాంశాలను సైతం ఏర్పాటుచేసింది. విలువలు & ప్రేరణాత్మక మార్గదర్శకత్వాన్ని పాఠశాల విద్యా ఫ్రేమ్‌వర్క్‌లో భాగస్వామ్యం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. రాజ్యాంగ దినోత్సవం (నవంబర్ 26, 2025) సందర్భంగా పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యాన విద్యార్థులకు చట్టసభలపై అవగాహన కల్పించేందుకు మాక్ అసెంబ్లీని అమరావతి శాసనసభ ప్రాంగణంలో ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించారు. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రితోపాటు స్పీకర్, మంత్రులు, సభ్యుల పాత్రల ద్వారా డెమోక్రటిక్ ప్రాసెస్‌ల సిమ్యులేషన్ అందించి, నిర్మాణాత్మక చర్చలతో విద్యార్థులు రాష్ట్రప్రజలను ఆకర్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాలల భారత రాజ్యాంగాన్ని విడుదల చేశారు. పదోతరగతి విద్యార్థుల్లో ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు ఎస్ఎస్ సి విద్యార్థులకు వందరోజుల యాక్షన్ ప్లాన్ ప్రారంభమైంది. వార్షిక పరీక్షలకు ముందు పాఠ్యాంశాల సమన్వయం, రివిజన్ సైకిల్స్, పెర్ఫార్మెన్స్ ట్రాకింగ్, సన్నద్ధత సపోర్ట్‌పై దృష్టి సారించేలా ఈ యాక్షన్ ప్లాన్ చేపట్టారు. పాఠశాలల్లో విద్యార్థులకు క్రమశిక్షణ, వ్యక్తిగత శుభ్రత, డ్రెస్సింగ్, చేతులు శుభ్రపరచడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నాయకత్వ పద్ధతులపై అవగాహన కోసం డిసెంబర్ 20న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ & ప్రైవేట్ పాఠశాలల్లో విద్యనభ్యసించే 75లక్షలమంది విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలో మంత్రి లోకేష్ సారథ్యంలో అమలు చేస్తున్న విద్యాసంస్కరణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ సైతం ఇటీవల ప్రశంసల వర్షం కురిపించారు.

*****

Search
Categories
Read More
Telangana
నాగేటి సాల్లల్ల నా తెలంగాణ....'అంటూ తెలంగాణ ఆత్మను పలికించిన అక్షర యోధుడు,
నాగేటి సాల్లల్ల నా తెలంగాణ....' అంటూ తెలంగాణ ఆత్మను పలికించిన అక్షర యోధుడు, మన నందిని సిధారెడ్డి...
By Ponnala Srinivasrao 2026-03-16 11:07:20 0 254
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ: గుండెపోటుతో తండ్రి మృతి అనాధలైన.
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, పెద్ద కొండ మర్రి గ్రామానికి చెందిన వై. శ్రీనివాసులు (38)...
By Kothuru Murali 2026-01-18 09:09:53 0 149
Andhra Pradesh
నల్ల వీర గంగభవాని జాతర: భక్తులకు సర్పంచ్ పిలుపు.
మదనపల్లె సి.టి.యం గ్రామంలో ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు జరగనున్న శ్రీ నల్ల వీర గంగభవాని జాతరను...
By Pagadala Venkateswar 2026-02-01 07:58:32 0 151
Andhra Pradesh
ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం చేయరాదు: జిల్లా ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను చట్టపరిధిలో తక్షణమే పరిష్కరించి న్యాయం...
By Pagadala Venkateswar 2026-03-16 10:06:23 0 159
Bharat Aawaz
Telangana Announces 2025 SSC Supplementary Results
Hyderabad, June 27, 2025: The Telangana Board of Secondary Education (BSE Telangana) has declared...
By Bharat Aawaz 2025-06-27 11:11:22 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com