అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు: మంత్రి లోకేష్.

0
96

అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు: మంత్రి లోకేష్

30-04-2026 Thu 22:42 | Andhra

Nara Lokesh talks about new courses what industry needed

విశ్వవిద్యాలయాలు పరిశోధన, ఆవిష్కరణ కేంద్రాలుగా మారాలని సీఎం చంద్రబాబు ఆదేశం

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కోర్సులను పునర్‌వ్యవస్థీకరించాలని అధికారులకు సూచన

20 లక్షల మందికి పూర్తి నైపుణ్యంతో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని స్పష్టీకరణ

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పాఠ్యాంశాలను రూపొందిస్తున్నామని తెలిపిన మంత్రి లోకేష్

ఉద్యోగ, ఉపాధి అవకాశాల సమాచారం కోసం సమీకృత పోర్టల్ ఏర్పాటు చేయాలని ఆదేశం

రాష్ట్రంలో పారిశ్రామిక, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యా కోర్సులను పునర్‌వ్యవస్థీకరిస్తున్నామని, విద్యార్థులకు ప్రపంచస్థాయి నైపుణ్యాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యాశాఖలో చేపడుతున్న సంస్కరణలను ముఖ్యమంత్రికి వివరించారు.

 

ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు పాఠ్యాంశాలను మార్పు చేయడంతో పాటు, విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు కూడా అందిస్తున్నామని లోకేష్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌సీఆర్టీ సహకారంతో ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా పాఠ్యాంశాలను తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. బోధనా పద్ధతులపై అధ్యయనం చేసేందుకు అత్యుత్తమ ఉపాధ్యాయులను ఫిన్‌లాండ్ వంటి దేశాలకు పంపుతున్నామని వివరించారు. 

 

'టీచర్-స్టూడెంట్-అవుట్‌కమ్' అనే విధానంలో విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామన్నారు. 'బడి కోసం' కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని, ఎన్‌రోల్‌మెంట్ పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాలేజీ పనివేళలు పెంచి, విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా శిక్షణ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.

 

విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు: సీఎం చంద్రబాబు

 

మంత్రి లోకేష్ వివరణ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. భవిష్యత్ అవసరాలను ముందుగా అంచనా వేసి, అందుకు తగిన కోర్సులను రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలు ఇచ్చే కేంద్రాలుగా కాకుండా పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్‌లకు కేంద్రాలుగా మారాలని ఆకాంక్షించారు. గేమ్ ఛేంజర్‌లుగా మారనున్న లాజిస్టిక్స్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో కొత్త కోర్సులు రావాల్సిన అవసరం ఉందన్నారు. క్వాంటం టెక్నాలజీపై రాష్ట్రంలో మొదటి కోర్సును ప్రారంభించినందుకు ఆంధ్రా యూనివర్సిటీని అభినందించారు.

 

ప్రపంచంలోని టాప్ 200 యూనివర్సిటీలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని, ప్రతి యూనివర్సిటీకి ఒక పారిశ్రామిక సంస్థ అనుసంధానమై ఉండాలని సీఎం స్పష్టం చేశారు. యూనివర్సిటీల్లో జర్మన్ సహా ఇతర విదేశీ భాషల్లో శిక్షణ కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

 

నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి

 

రాష్ట్రంలోని యువత నైపుణ్య స్థాయిని అంచనా వేసేందుకు 'ర్యాండమ్ స్కిల్ ఆడిట్' నిర్వహించాలని సీఎం ఆదేశించారు. యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందించేందుకు ప్రముఖ కంపెనీలతో అనుసంధానం కావాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి పూర్తి నైపుణ్యంతో కూడిన ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమన్నారు. గత 22 నెలల్లో వివిధ మార్గాల ద్వారా 7 లక్షల మందికి ఉపాధి లభించిందని, ఈ వివరాలన్నింటినీ 'నైపుణ్యం' అనే సమీకృత పోర్టల్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

 

పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించేలా మధ్యాహ్న భోజన మెనూను రూపొందించాలని, హాస్టళ్లలో కిచెన్ గార్డెన్లను ప్రోత్సహించాలని సూచించారు. 'లీప్' యాప్ ద్వారా విద్యార్థుల పురోగతిని తల్లిదండ్రులు తెలుసుకునేలా చూడాలన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు 'స్టూడెంట్స్ ఇన్నోవేషన్ కాంక్లేవ్' పేరుతో ఏఐ కాన్ఫరెన్స్ నిర్వహించాలని సూచించారు. పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షలో పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సహజ ప్రసవం ద్వారా 4.8 కేజీల శిశువు జననం
సహజ ప్రసవం ద్వారా 4.8 కేజీల శిశువు జననం!   -అనకాపల్లి జిల్లా ఆసుపత్రి వైద్య బృందం ఘనత - 4...
By Rajini Kumari 2025-12-31 09:53:49 0 211
Rajasthan
Rajasthan Expands Education and Skill Development
Rajasthan is strengthening its education system by improving school infrastructure, promoting...
By Fathima Safa 2026-06-30 12:19:29 0 61
SURAKSHA
Mukesh Kumar Meena, IAS: Champion of Good Governance
A Distinguished Administrator Driving Andhra Pradesh's Growth Through Visionary Leadership and...
By Lokeshwari Panthadi 2026-07-11 05:56:51 0 118
Andhra Pradesh
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
*విజయవాడ నగరపాలక సంస్థ*   *వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించండి*   *విజయవాడ నగరపాలక...
By Rajini Kumari 2025-12-30 10:37:21 0 335
Andhra Pradesh
Kanthamma: చిత్తూరు జిల్లాలో మహిళను బోల్తా కొట్టించిన మోసగాళ్లు
Kanthamma: చిత్తూరు జిల్లాలో మహిళను బోల్తా కొట్టించిన మోసగాళ్లు 07-04-2026 Tue 08:05 | Andhra...
By Pagadala Venkateswar 2026-04-07 04:10:44 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com