పవన్ కల్యాణ్‌తో నేను బాగానే ఉన్నా.. అతిగా ప్రవర్తిస్తే సహించేదిలేదు: టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్.

0
59

పవన్ కల్యాణ్‌తో నేను బాగానే ఉన్నా.. అతిగా ప్రవర్తిస్తే సహించేదిలేదు: టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్

29-04-2026 Wed 12:51 | Andhra

CM Chandrababu Naidu Warns TDP Leaders 

అధికారం ఉందని ఇగోలకు పోవద్దు.. సొంత పార్టీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక

సొంత బాబాయిని చంపి నెపం మనపై నెట్టారని వైసీపీపై తీవ్ర విమర్శలు

జనసేన, బీజేపీతో సమన్వయం అవసరం.. కేంద్రంతో గ్యాప్ రాకూడదని స్పష్టీకరణ

ఫ్లెక్సీలు, కుర్చీల కోసం గొడవలు పడొద్దని కార్యకర్తలకు హితవు

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం

టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు సొంత పార్టీ నేతలకు, కార్యకర్తలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అధికారం వచ్చిందన్న అహంతో ఎవరూ ఇగోలకు పోవద్దని, క్రమశిక్షణ తప్పితే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. పార్టీ నేతలు, కార్యకర్తల ప్రవర్తనపై కీలక సూచనలు చేస్తూనే, మరోవైపు వైసీపీపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

 

అతిగా ప్రవర్తిస్తే ప్రజలు హర్షించరు

"ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు నన్ను తీవ్ర మనస్తాపానికి గురి చేశాయి. మనం సుపరిపాలన అనే యజ్ఞం చేస్తుంటే, మన నేతలే సరిగా వ్యవహరించకుంటే బాధ కలుగుతుంది. ప్రజలతో సౌమ్యంగా ఉండాలి, వారికి అందుబాటులో ఉండాలి. నేతలు, కార్యకర్తలు చేసే తప్పులు పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తాయి" అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు, ఫొటోలు, కుర్చీల దగ్గర చిన్నపాటి గొడవలు కూడా రాకూడదని, అతిగా ప్రవర్తిస్తే ప్రజలు హర్షించరని హితవు పలికారు. గత పాలకుల గర్వాన్ని, అహంకారాన్ని చూసే ప్రజలు వారికి బుద్ధి చెప్పారని గుర్తుచేశారు. బూతులు, దాడులు, సెటిల్మెంట్లకు దూరంగా ఉండాలని సూచించారు.

 

మిత్రపక్షాలతో సమన్వయం అత్యవసరం

కూటమి ధర్మాన్ని పాటిస్తూ జనసేన, బీజేపీ నేతలతో సమన్వయంతో ముందుకు సాగాలని చంద్రబాబు స్పష్టం చేశారు. "నేను, పవన్ కల్యాణ్ ఎంతో చక్కగా ఉంటున్నాం. మంచి సంబంధాలు కొనసాగిస్తున్నాం. ఇదే స్ఫూర్తి క్షేత్రస్థాయిలోనూ కనిపించాలి. బీజేపీని కూడా సమన్వయం చేసుకుని వెళ్లాలి. రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య గ్యాప్ లేదు, రాకూడదు" అని ఆయన పేర్కొన్నారు. తాను లేకుండా ఎంపీ రాకూడదని ఎమ్మెల్యేలు అనడం సరైన పద్ధతి కాదని, అందరూ మనస్పర్థలు లేకుండా పనిచేయాలని సూచించారు.

 

నేరస్థులతో పోరాడుతున్నాం

ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "నా రాజకీయ జీవితంలో ఎంతోమంది నేతలతో పోరాడాను. కానీ తొలిసారిగా నేరస్థులతో పోరాడుతున్నాం. సొంత బాబాయి వివేకాను హత్య చేసి ఆ నెపాన్ని మనపై నెట్టారు. తమ కార్యకర్తను కారుతో తొక్కించి ఆ పాపాన్ని కూడా మనకే అంటించారు. కబ్జా చేసిన ఆస్తుల కోసం కడపలో అనుచరుడినే చంపేశారు" అని తీవ్ర ఆరోపణలు చేశారు. వాస్తవాలు బయటపడితే ఎదురుదాడి చేయడం వారికి అలవాటని విమర్శించారు. మనది అభివృద్ధి అయితే వాళ్లది అవినీతి అని, మనది వికాసం అయితే వాళ్లది విధ్వంసమని అన్నారు.

 

భవిష్యత్ ఎన్నికలే లక్ష్యం

రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజలు కూటమికి ఓటేశారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చంద్రబాబు అన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించాలని పిలుపునిచ్చారు. "మరో మూడేళ్లలో మళ్లీ ఎన్నికలు వస్తాయి. 2024లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు సాధించాలి. అప్పుడే మనం బాగా పనిచేసినట్టు. వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా ఉండొద్దు, మళ్లీ మళ్లీ గెలవాలి. పనిచేసిన వారికే పదవులు వస్తాయి" అని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేసి పార్టీ ప్రతిష్టను పెంచాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com