నీలాంటి సైకోలు వెయ్యి మంది అడ్డుపడ్డా అమరావతి నిర్మాణం ఆగదు: జగన్ పై చంద్రబాబు ఫైర్.

0
109

 

నీలాంటి సైకోలు వెయ్యి మంది అడ్డుపడ్డా అమరావతి నిర్మాణం ఆగదు: జగన్ పై చంద్రబాబు ఫైర్

09-04-2026 Thu 16:59 | Andhra

Chandrababu Naidu Fires at Jagan Over Amaravati Construction

 

బాపట్ల జిల్లా వేమూరులో నిర్వహించిన 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేసి, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇదే వేదిక నుంచి గత ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ వంటి సైకోలు ఎంతమంది వచ్చినా అమరావతి నిర్మాణం ఆగదని స్పష్టం చేశారు. అటు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన తమ ప్రభుత్వ దార్శనికతను ప్రజలకు వివరించారు. అధికారుల పనితీరును సమీక్షిస్తూనే, వేమూరు నియోజకవర్గానికి పలు అభివృద్ధి పథకాలను మంజూరు చేశారు.

 

భూ హక్కుపై తిరుగులేని భరోసా

 

భూమి అనేది ఆస్తి మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి జీవనాధారం, గౌరవం, భద్రత అని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం ప్రజల భూములపై కన్నేసి, రికార్డులను తారుమారు చేసి, గ్రామాల్లో భూవివాదాలకు తెరలేపిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సమస్యల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. 

 

"ప్రజల ఆస్తులకు భద్రత, జీవితాలకు భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 2027 మార్చి నాటికి రాష్ట్రంలో కోటి 12 లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాలను పకడ్బందీగా అందించే బాధ్యత తీసుకుంటున్నాం" అని ప్రకటించారు. కరెన్సీ నోట్లకు వాడే టెక్నాలజీనే కొత్త పాస్‌బుక్‌లకు వాడుతున్నామని, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ, క్యూఆర్ కోడ్, డిజిటల్ లాక్ వంటి సదుపాయాలతో వీటిని ఎవరూ తారుమారు చేయలేరని భరోసా ఇచ్చారు. మూడు దశల్లో ఈ-కేవైసీ ద్వారా యజమానిని నిర్ధారించుకున్న తర్వాతే పాస్‌బుక్‌లు ఇస్తున్నామని, ఈ ప్రక్రియలో ఒక్క రూపాయి కూడా అవినీతికి ఆస్కారం లేకుండా చూస్తున్నామని వివరించారు.

 

గత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు

 

గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని విధాలా సర్వనాశనమైందని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర విభజన కంటే దారుణమైన పరిస్థితులు గత ప్రభుత్వ హయాంలో నెలకొన్నాయని అన్నారు. "ఆడబిడ్డలకు రక్షణ లేదు, మాట్లాడాలంటే భయం. పరిశ్రమలు పారిపోయాయి, వ్యవస్థలన్నీ విధ్వంసమయ్యాయి" అని విమర్శించారు. తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని, వివేకానందరెడ్డి హత్య కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. 

 

"బాబాయిని చంపేసి ఆ నేరాన్ని నా మీద వేసి, నా చేతిలో కత్తి పెట్టి నరకాసుర రక్త చరిత్ర అంటూ వారి పత్రికలో రాశారు. ఇలాంటి పగటి వేషాలతో ప్రజలను ఏమార్చి గెలిచారు" అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీని ఒక 'సైకో పార్టీ'గా అభివర్ణించిన ఆయన, ప్రతిపక్షంలో ఉన్నా బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇలాంటి రాజకీయాలు రాష్ట్రానికి ప్రమాదకరమని హెచ్చరించారు.

 

అమరావతి మనందరి రాజధాని

 

అమరావతి నిర్మాణంపై తనకున్న నిబద్ధతను చంద్రబాబు పునరుద్ఘాటించారు. 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇస్తే, గత ప్రభుత్వం రాజధానిని నాశనం చేసిందని విమర్శించారు. అమరావతి రైతులు, మహిళలు పడిన కష్టాలను గుర్తుచేసుకున్నారు. "అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని నిన్ననే కేంద్ర ప్రభుత్వం రాజముద్ర వేసింది. అయినా ఇంకా మూడు ముక్కలాట అంటున్నారు. నీలాంటి వెయ్యి మంది సైకోలు అడ్డుపడ్డా అమరావతి నిర్మాణం ఆగదు" అని చంద్రబాబు సవాల్ విసిరారు. 

 

అమరావతి కేవలం రాజధానే కాదని, హైదరాబాద్ తరహాలో సంపద సృష్టించే కేంద్రమని, దానిని పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును కూడా గత ప్రభుత్వం గోదావరిలో కలిపేసిందని, వేల కోట్లు ఖర్చు చేసి దాన్ని మళ్లీ గాడిన పెట్టి, గోదావరి పుష్కరాలలోగా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు.

 

అధికారులకు క్లాస్.. అభివృద్ధిపై ఫోకస్

 

ఈ సభలోనే చంద్రబాబు అధికారుల పనితీరుపై సమీక్ష నిర్వహించడం విశేషం. వేమూరు నియోజకవర్గంలో ఆర్టీసీ, బీసీ సంక్షేమ హాస్టళ్లు, ఇరిగేషన్ వంటి శాఖలు రాష్ట్ర సగటు కన్నా మెరుగ్గా పనిచేస్తున్నాయని అభినందించారు. అదే సమయంలో, రేషన్ పంపిణీ, వ్యవసాయం, మధ్యాహ్న భోజన పథకం, రోడ్లు, ఇసుక సరఫరా వంటి అంశాల్లో వెనుకబడిన అధికారులను వేదికపైనే నిలదీశారు. 

 

"ఇసుక ఉచితంగా ఇస్తుంటే, మీరు ప్రజలకు అందించకుండా చెడ్డపేరు తెస్తే ఎలా?" అని మైనింగ్ అధికారిని ప్రశ్నించారు. పనితీరు బాగోలేని శాఖలు వెంటనే గాడిన పడాలని, ప్రజలకు సేవ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మరోవైపు, రాబోయే ఐదేళ్లలో 20 లక్షల కోట్ల పెట్టుబడులతో 23 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని, సూర్యలంక బీచ్‌ను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

 

వేమూరుకు వరాల జల్లు

 

సభ ముగింపులో వేమూరు నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు పలు వరాలు ప్రకటించారు. బ్రాహ్మణ కోడూరు, కొల్లూరు వద్ద హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణానికి రూ. 25 కోట్లు, బట్టేప్రోలు-పెసర్లంక రోడ్డుకు రూ. 2 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. లంక గ్రామాల్లో భూమి కోతను నివారించేందుకు రూ. 2.54 కోట్లతో గ్రోయిన్‌ల నిర్మాణం చేపడతామన్నారు. 

 

వేమూరులో కొత్త ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు, మూతపడిన జంపని షుగర్ ఫ్యాక్టరీ స్థలంలో ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటుకు కూడా హామీ ఇచ్చారు. వరద నష్టపరిహారం బకాయిలను వెంటనే విడుదల చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా, తెలుగు జాతిని ప్రపంచంలోనే అగ్రగామి జాతిగా నిలబెట్టడమే తన లక్ష్యమని చంద్రబాబు పునరుద్ఘాటించారు.

Search
Categories
Read More
Business & Finance
West Bengal Budget Prioritises Jobs and Industrial Growth
The West Bengal government's 2026–27 Budget focuses on employment generation and industrial...
By Navya Sree 2026-07-04 06:28:13 0 26
Telangana
అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠాను చేదించిన సంగారెడ్డి జిల్లా పోలీసులు
సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్...
By Ponnala Srinivasrao 2026-05-05 09:29:39 0 148
Uttarkhand
Uttarakhand Advances Renewable Energy and Hydropower
Uttarakhand continues to expand its renewable energy sector by promoting hydropower, solar...
By Fathima Safa 2026-06-27 06:47:51 0 44
Andhra Pradesh
పుంగనూరు: జాబ్ మేళాకు భారీగా తరలివస్తున్న యువత
బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని, పుంగనూరు...
By Kothuru Murali 2026-06-18 10:50:54 0 90
Telangana
రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్
పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు...
By Pindikura Mahesh 2026-06-23 17:42:45 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com