నిలకడలేని జగన్ ను సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదు: మంత్రి నారా లోకేశ్.

0
133

 

నిలకడలేని జగన్ ను సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదు: మంత్రి నారా లోకేశ్

08-04-2026 Wed 22:19 | Andhra

Nara Lokesh Slams Jagans Unstable Politics

 

వైసీపీ అధినేత జగన్ మాటలను ఎవరూ సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని, ఆయనకు నిలకడ లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు కూడా ఆయన ప్రజలకు దూరంగానే ఉంటున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ కేడర్ కోసం ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల్లో భాగంగా, ‘కాఫీ కబుర్లు’ పేరుతో క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చార్జ్‌లతో నారా లోకేశ్ నేడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ, నాయకత్వ మార్పులు, కేడర్‌కు దిశానిర్దేశం చేశారు.

 

ఈ సందర్భంగా జగన్ తీరుపై లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. "నిన్న ‘మావిగన్’ అన్న నోటితోనే, ఈరోజు మళ్లీ మూడు రాజధానులు అంటున్నారు. ఆయన మాటలకు నిలకడ ఉండదు. అధికారంలో ఉన్నప్పుడూ ప్రజలకు దగ్గరగా లేరు, ఇప్పుడు కూడా ఇంటి చుట్టూ 30 అడుగుల ఇనుప కంచె ఏర్పాటు చేసుకుని దూరంగా ఉంటున్నారు" అని ఎద్దేవా చేశారు. 2019లో టీడీపీ ఓటమి తర్వాత చంద్రబాబు నిత్యం జనంలోనే ఉన్నారని, వారి కష్టసుఖాలు తెలుసుకున్నారని గుర్తుచేశారు. ఏడాదిలోనే ఇసుక కష్టాలపై ఉద్యమించారని, కార్యకర్తల ఆవేదనను అర్థం చేసుకుని ముందుకు సాగారని తెలిపారు.

 

టీడీపీ 3.0.. సరికొత్త పంథా

 

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ 3.0 వర్షన్‌తో సరికొత్త పంథాలో ముందుకు సాగుతోందని లోకేశ్ స్పష్టం చేశారు. పార్టీలో గ్రామస్థాయి నుంచి పొలిట్‌బ్యూరో వరకు సమూల మార్పులు తెస్తున్నామన్నారు. "ప్రతి టర్మ్‌లో 33 శాతం కొత్తవారికి అవకాశం కల్పించాలన్నది మా అభిమతం. గ్రామస్థాయి నాయకుడు కూడా పొలిట్‌బ్యూరో వరకు ఎదిగేలా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం" అని వివరించారు. 

 

పార్టీ సభ్యత్వ నంబర్‌ను ఆధార్ కార్డులా పరిగణిస్తామని, ఆ నంబర్ ఎంటర్ చేస్తే ఎవరు ఎంత పనిచేశారో తెలిసిపోతుందని తెలిపారు. ఎలాంటి పైరవీలకు తావులేకుండా, కేవలం పనితీరు ఆధారంగానే కార్యకర్తలను గుర్తించి పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు చంద్రబాబు పక్కన సామాన్య కార్యకర్తలు కూర్చోవడమే పార్టీలో వస్తున్న మార్పులకు సంకేతమని అన్నారు.

 

తెలుగుదేశం ఒక రాజకీయ విశ్వవిద్యాలయం

 

తెలుగుదేశం పార్టీని ఒక రాజకీయ విశ్వవిద్యాలయంగా అభివర్ణించిన లోకేశ్, ఇకపై ఏడాది పొడవునా శిక్షణా తరగతులు నిర్వహిస్తామని ప్రకటించారు. క్లస్టర్, యూనిట్, గ్రామ, మండల స్థాయిల వరకు నిరంతరం శిక్షణ ఉంటుందన్నారు. "తెలంగాణలో ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రులతో పాటు మెజారిటీ నాయకులు టీడీపీ నుంచి వచ్చినవారే. 1989-94 మధ్య చంద్రబాబు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు శిక్షణా తరగతులతో కేడర్‌ను చైతన్యవంతం చేశారు. అయితే, పార్టీ ఆవిర్భావం తర్వాత అట్టడుగు స్థాయి నుంచి ఇంత పెద్దఎత్తున శిక్షణ ఇవ్వడం ఇదే ప్రథమం" అని లోకేశ్ పేర్కొన్నారు.

 

నాయకులు కాదు.. పార్టీనే శాశ్వతం

 

టీడీపీ కేడర్ బేస్డ్ పార్టీ అని, ‘నేనే రాజు, నేనే మంత్రి’ అనే భావనను నాయకులు వీడాలని లోకేశ్ హితవు పలికారు. "టీడీపీలో లోకేశ్ లేదా మరో నాయకుడు శాశ్వతం కాదు, పార్టీ మాత్రమే శాశ్వతం. సమర్థవంతమైన నాయకుడు తన తర్వాతి తరం నాయకత్వాన్ని తయారుచేస్తాడు" అని స్పష్టం చేశారు. 

 

గతంలో వ్యక్తులను నమ్మి పార్టీ నష్టపోయిందని, ఇప్పుడు వ్యక్తులపై కాకుండా వ్యవస్థపైనే ఆధారపడ్డామని తెలిపారు. క్రమశిక్షణ గల కేడర్ ఉన్న బీజేపీని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వారి ‘సరళ్’ యాప్ మాదిరిగానే మనకు ‘మై టీడీపీ’ యాప్ ఉందని, అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించడమే విజయ రహస్యమని సూచించారు.

 

చంద్రబాబు నీడే శ్రీరామరక్ష

 

గత ఐదేళ్ల అరాచక పాలనలో కార్యకర్తలు పడిన ఇబ్బందులను మరువవద్దని లోకేశ్ కోరారు. "దేవాలయాలపై దాడులు చేశారు, కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారు, 35 వేల తప్పుడు కేసులు పెట్టారు. వాటన్నింటినీ అధ్యయనం చేసి 60 శాతం అక్రమ కేసులను తొలగించాం. అధికారం ఉందని అహంకారం వద్దు. ఓర్పు, సహనంతో ముందుకు సాగుదాం. చంద్రబాబు అనే మహావృక్షం నీడే మనకు శ్రీరామరక్ష" అని అన్నారు. 

 

ఒంటెద్దు పోకడలతో వెళ్లే నాయకులకు మూడుసార్లు చెప్పి చూస్తామని, వినకపోతే దండం పెట్టి కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తామని హెచ్చరించారు.

 

హనీమూన్ ముగిసింది.. జనంలోకి వెళ్దాం

 

కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ముగిసిందని, ఇక ప్రతిఒక్కరూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పనిచేయాలని లోకేశ్ పిలుపునిచ్చారు. జూన్ నుంచి ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లే కార్యక్రమాన్ని రూపొందిస్తామన్నారు. 

 

"94 శాతం స్ట్రైక్ రేటుతో గెలిచినా, రాష్ట్రవ్యాప్తంగా 4,600 బూత్‌లలో వెనకబడ్డాం. వాటిపై నాయకులు దృష్టి సారించాలి. చంద్రబాబు బలంగా ఉంటేనే అంతా సంతోషంగా ఉంటారన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి" అని కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న మహానాడును విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలని కోరారు

Search
Categories
Read More
Andhra Pradesh
కులాలకు అతీతమైన నాయకత్వమే నిజమైన ప్రజాస్వామ్యం_వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్‌ఆర్‌ఐ విభాగం గ్లోబల్ కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు.
◆ కువైట్‌లో జరిగిన ప్రవాసాంధ్ర రెడ్డి సంఘ సమావేశానికి హాజరైన రాష్ట్ర ప్రధాన...
By John Baji 2026-01-03 05:41:58 0 217
Telangana
నిజామాబాద్
యోగా...ఏకాగ్రత, సహనం, నిర్ణయ సామర్థ్యం పెరగడానికి దోహదపడుతుంది. యోగా... శరీరానికి బలం, మనసుకు...
By Sadaq Sadaq 2026-06-20 11:48:01 0 154
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : షేర్ ఆటో బోల్తా పడి ఇద్దరి పరిస్థితి విషమం
శనివారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, గడ్డం వారిపల్లి సమీపంలో ఫోన్ మాట్లాడుతూ ఆటో...
By Kothuru Murali 2026-01-31 16:03:17 0 168
Business & Finance
Bank Loan Syndication Unlocks Bigger Funding Power
Bank loan syndication enables multiple banks or financial institutions to jointly finance large...
By Navya Sree 2026-07-09 07:08:08 0 83
Andhra Pradesh
Tirumala: శ్రీవారికి భారీ విరాళాలు.. ఒకే రోజు కోట్లలో కానుకలు.
పీఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నుంచి రూ.2.50 కోట్ల విరాళం మంత్రి లోకేశ్‌ పుట్టినరోజు...
By Pagadala Venkateswar 2026-01-23 10:54:30 0 166
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com