వైయస్సార్సీపి రాష్ట్ర రైతు విభాగం అధికార ప్రతినిధి గడ్డం నారాయణరెడ్డి

0
58

ఎమ్మిగనూరు పట్టణంలోని 'కోతుల బావి' ఆంజనేయ స్వామి ఆలయ భూమి వివాదానికి మున్సిపల్ కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలే కారణమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగం అధికార ప్రతినిధి గడ్డం నారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం ఆలయ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రశాంతంగా ఉండే ఎమ్మిగనూరులో కమిషనర్ తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్రిక్తతలు రేపుతున్నారని మండిపడ్డారు. ఆలయ స్థలంలో ప్రైవేట్ బంకులు (షెడ్లు) వేయించడానికి కమిషనర్ డబ్బులు వసూలు చేశారనే ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేకనే, ఇక్కడ బండలు పాతి భక్తులను, ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. కమిషనర్ నిజాయితీపరుడైతే ఈ వివాదమే వచ్చేది కాదన్నారు. కమిషనర్‌కు కేవలం గుడి స్థలమే రోడ్డు మార్జిన్‌లా కనిపిస్తోందా? అని ఆయన ప్రశ్నించారు. గాంధీ సర్కిల్ నుంచి సోగనూరు రోడ్డు వరకు ఎన్నో అక్రమ నిర్మాణాలు, అక్రమ అంగళ్లు ఉన్నా పట్టించుకోకుండా, కేవలం ఆలయాన్నే లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని నిలదీశారు. రోడ్డు విస్తరణ చేయాలనుకుంటే గాంధీ సర్కిల్ నుంచే మొదలుపెట్టాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేవాలయ భూములను, దేవుడి మాన్యాలను కాపాడాలని చెప్తుంటే, ఇక్కడి కమిషనర్ అందుకు విరుద్ధంగా ప్రవర్తించడం సరికాదన్నారు. దేవుడి స్థలాన్ని కాపాడాలని శాంతియుతంగా అడుగుతున్న భక్తులను, హిందూవులను గుండాలు, రౌడీల్లా భావించి సుమారు 300 మంది పోలీసులతో బందో బస్తు ఏర్పాటు చేయడం, అక్రమంగా అరెస్టులు చేయించడం, కేసులు పెట్టడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఖండించారు. భక్తులెవరూ వారి సొంత ఇళ్ల కోసం స్థలాలు అడగటం లేదని, కేవలం దేవుడి గుడి కోసమే పోరాడుతున్నారని గుర్తు చేశారు. ఇది కేవలం రాజకీయ వివాదం కాదని, మొత్తం హిందువుల మనోభావాలకు సంబంధించిన సమస్య అని ఆయన పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి కూడా ఆంజనేయ స్వామి భక్తులే కాబట్టి, ఆయన వెంటనే స్పందించి కమిషనర్ మొండివైఖరికి అడ్డుకట్ట వేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ ఇక్కడ కేవలం మూడు లేదా ఐదేళ్లు మాత్రమే ఉద్యోగం చేసి వెళ్ళిపోతారని, కానీ స్థానికంగా కలిసిమెలిసి ఉండేది తామేనని గుర్తు చేశారు. కేవలం స్వార్థ ప్రయోజనాలు, ధనదాహం కోసమే కమిషనర్ ఈ వివాదాన్ని పెద్దది చేస్తున్నారని, దేవుడి స్థలంతో పెట్టుకుంటే కమిషనర్ భవిషత్తుకే పెద్ద మచ్చగా మిగిలిపోతుందని, భగవంతుని ఆగ్రహానికి గురికాక తప్పదని గడ్డం నారాయణ రెడ్డి హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మార్కాపురంలో ఘనంగా 'రోడ్డు సేఫ్టీ' అవగాహన ర్యాలీ: రోడ్డు నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకుందాం.
మార్కాపురంలో ఘనంగా 'రోడ్ సేఫ్టీ' అవగాహన ర్యాలీ: రోడ్డు నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకుందాం....
By Chennaiah Kati 2026-02-05 05:05:05 0 178
Andhra Pradesh
పగిలిన హంద్రీనీవా పైపులైను పరిశీలించిన ఎమ్మెల్యే కోట్ల
కర్నూలు : నంద్యాల : డోన్  డోన్ మండలంలోని ఓబుళాపురం గ్రామ సమీపంలో హంద్రీనీవా పైప్‌లైన్...
By Hari Krishna 2026-01-10 13:57:46 0 199
Andhra Pradesh
పోలియో చుక్కల కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే!!
కర్నూలు : డోన్ :  డోన్ పట్టణంలోని K.V.S కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో...
By Hari Krishna 2025-12-21 10:24:18 0 164
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com