2026 ఫిబ్రవరి నెలలో సుమారు 40 లక్షల 20 వేల రూపాయల విలువైన 201 మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన ప్రత్యేక బృందం బాధితుల మొబైల్ ఫోన్లను రికవరీ చేసి అందించేందుకు జిల్లాలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం
బాపట్ల జిల్లా: 100 శాతం మొబైల్ ఫోన్ లను రికవరీ చెయ్యడమే లక్ష్యంగా, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించేందుకు జిల్లాలో ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు తెలిపారు. జిల్లా ఐటి కోర్ బృందం స్థానిక పోలీసులు సమన్వయంతో పనిచేసి, 2026 ఫిబ్రవరి నెలలో రికవరీ చేయబడిన సుమారు 40 లక్షల 20 వేల రూపాయల విలువైన 201 మొబైల్ ఫోన్లను మంగళవారం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మొబైల్ ఫోన్ రికవరీ పంపిణీ కార్యక్రమంలో ఎస్పీ గారు స్వయంగా బాధితులకు అందించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ గారు మాట్లాడుతూ, ప్రస్తుత జీవన విధానంలో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికీ అత్యంత అవసరమైన విలువైన వస్తువుగా మారిపోయిందన్నారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ లావాదేవీలు, ముఖ్యమైన పాస్వర్డ్లు వంటి విలువైన డేటాను మొబైల్ ఫోన్లలోనే నిక్షిప్తం చేసుకుంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఫోన్ పోయినా లేదా దొంగిలించబడినా ఆ సమాచారాన్ని తిరిగి పొందడం చాలా కష్టసాధ్యమవుతుందన్నారు.
ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బాపట్ల జిల్లాలో మొబైల్ ఫోన్లను రికవరీ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. CEIR (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా లేదా పోలీస్ స్టేషన్లలో మొబైల్ ఫోన్కు సంబంధించి ఇచ్చే ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోయిన ఫోన్లను వేగంగా రికవరీ చేస్తున్నామని తెలిపారు. ప్రతి నెలా "మొబైల్ రికవరీ మేళా" నిర్వహించి బాధితులకు ఫోన్లను అందజేస్తున్నామని చెప్పారు.
2026 ఫిబ్రవరి నెలలో సుమారు 40 లక్షల 20 వేల రూపాయల విలువైన 201 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందిస్తున్నామన్నారు. గత 3 నెలల కాలంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన సుమారు 1 కోట్ల 61 లక్షల 20 వేల విలువ గల 806 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించడం జరిగిందని తెలిపారు. గతంలో మొబైల్ రికవరీ శాతం 30 గా ఉన్నదానిని దాదాపుగా 60 శాతానికి పెంచడం జరిగిందన్నారు. 100 శాతం మొబైల్ ఫోన్ లను రికవరీ చెయ్యడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎస్పీ గారు తెలిపారు.
మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు ఆందోళన చెందకుండా వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లలో లేదా CEIR (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. www.ceir.gov.in వెబ్సైట్ను ఓపెన్ చేసి పోర్టల్లో "Block Stolen/Lost Mobile" ఆప్షన్ను ఎంచుకుని, ఫోన్ యొక్క IMEI నంబర్, మొబైల్ కొనుగోలు రసీదు, ఫోన్ పోయిన ప్రదేశం వంటి తదితర వివరాలను నమోదు చేయాలన్నారు.
అందిన ఫిర్యాదుల మేరకు ప్రత్యేక బృందం అందుబాటులో ఉన్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోయిన ఫోన్లను వేగంగా గుర్తించి రికవరీ చేసి తిరిగి బాధితులకు అప్పగించడం జరుగుతుందని తెలిపారు.
ప్రజలు సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, సరైన బిల్లులు లేని, అతి తక్కువ ధరకు విక్రయించే అనుమానాస్పద ఫోన్లను కొనవద్దని హెచ్చరించారు. ఎక్కడైనా మొబైల్ ఫోన్ దొరికినట్లయితే స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించాలని ప్రజలకు సూచించారు.
పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి రికవరీ చేసి అప్పగించడంపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఫోన్లను రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఐటి కోర్ బృందాన్ని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో బాపట్ల, చీరాల, రేపల్లె డిఎస్పి లు పి.జగదీష్ నాయక్, ఎండి.మోయిన్, ఏ.శ్రీనివాసరావు, సోషల్ మీడియా సెల్ ఇన్స్పెక్టర్ వి.సూర్యనారణ, ఎస్.బి ఇన్స్పెక్టర్ బి.నారాయణ, ఆర్.ఐ షేక్.మౌలుద్దిన్ ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా బాధితులు తదితరులు పాల్గొన్నారు.
#Narendra
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz