Chandrababu Naidu: మరో 15 ఏళ్లు మనం ఇలాగే బలంగా నిలబడాలి: సీఎం చంద్రబాబు.

0
134

 

Chandrababu Naidu: మరో 15 ఏళ్లు మనం ఇలాగే బలంగా నిలబడాలి: సీఎం చంద్రబాబు

11-02-2026 Wed 16:58 | Andhra

Chandrababu Naidu Aims for 15 Years of Strong NDA Governance in Andhra Pradesh

ఐక్యంగా ఉంటేనే గుజరాత్ తరహాలో అభివృద్ధి సాధ్యమని స్పష్టం

ప్రభుత్వ విజయాలను ఎమ్మెల్యేలు ఓన్ చేసుకోవాలని, సభకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశం

కేంద్రం సహకారంతోనే పోలవరం, అమరావతి, స్టీల్ ప్లాంట్ వంటివి గాడిన పడ్డాయని వెల్లడి

విభేదాలుంటే అంతర్గతంగా చర్చిద్దామని పవన్ పిలుపు

 

రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి మరో 15 ఏళ్ల పాటు ఐక్యంగా, బలంగా కొనసాగాలని, అప్పుడే గుజరాత్ తరహాలో సుస్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఎన్నికల సమయంలో ప్రజల ముందు ఏ స్ఫూర్తితో నిలబడ్డామో, అదే ఐక్యతను భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. గడిచిన 20 నెలల్లో కూటమి నాయకత్వంలో ఎక్కడా విభేదాలు రాకపోవడం శుభపరిణామమని, ఇదే ఐక్యతతో పనిచేసి ఎమ్మెల్యేలు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు.

 

ఎన్నికల నాటి కంటే ఇప్పుడు కూటమిపై ప్రజా మద్దతు మరింత పెరిగిందని చంద్రబాబు అన్నారు. "గుజరాత్‌లో బీజేపీ వరుసగా ఐదుసార్లు గెలిచి అధికారంలో ఉంది. ఒకే ప్రభుత్వం సుదీర్ఘకాలం కొనసాగడం వల్లే అక్కడ అభివృద్ధి సాధ్యమైంది. మన రాష్ట్రంలోనూ అదే జరగాలి. మరో 15 ఏళ్ల పాటు మూడు పార్టీలు ఐక్యంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి రావాలి. అప్పుడే శాశ్వతంగా రాజకీయాల్లో నిలబడగలం" అని ఆయన దిశానిర్దేశం చేశారు.

 

ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు

ఈ సందర్భంగా శాసనసభ్యులకు ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు. "అసెంబ్లీ సమావేశాలను ప్రతి సభ్యుడు సీరియస్‌గా తీసుకోవాలి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందరూ సభలోనే ఉండాలి. నేను కూడా సభను పూర్తిగా ఫాలో అవుతాను. సభలో సబ్జెక్టులపై అర్థవంతమైన చర్చలు జరగాలి. ఎదుటివారు తిట్టారని మనం కూడా బూతులు తిట్టకూడదు. ప్రజామోదయోగ్యంగా సభను నడుపుదాం" అని అన్నారు. త్వరలోనే జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు, ఎస్పీలతో ఉమ్మడి సమావేశాలు నిర్వహించి, నియోజకవర్గాల్లో పెండింగ్ పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.

 

విశాఖ స్టీల్ ప్లాంట్‌ కోసం కేంద్రం తన పాలసీనే మార్చుకుంది

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం వల్లే రాష్ట్రం వేగంగా కోలుకుంటోందని చంద్రబాబు వివరించారు. "వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని గాడిన పెట్టామంటే దానికి కేంద్రం చేయూతే కారణం. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇవ్వకపోయి ఉంటే అవి ముందుకు కదిలేవి కావు. 2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తున్నామంటే అది కేంద్రం సాయంతోనే. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిలబెట్టేందుకు కేంద్రం తన పాలసీనే మార్చుకుంది. ఫలితంగా, మొదటిసారిగా స్టీల్ ప్లాంట్ ఒక్క నెలలో రూ.54 కోట్ల లాభాలు సాధించింది. సూపర్ సిక్స్‌తో సహా అన్ని పథకాలు అమలు చేస్తున్నామంటే దాని వెనుక కేంద్రం అండ ఉంది. ఈ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతి ఎమ్మెల్యే ఓన్ చేసుకోవాలి" అని ఆయన పిలుపునిచ్చారు.

 

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూటమి నేతలు ఎదుర్కొన్న అణచివేతను చంద్రబాబు గుర్తుచేశారు. పవన్ కల్యాణ్‌ను విశాఖలో హోటల్ గదికే పరిమితం చేయడం, తన అరెస్టు సమయంలో ఆయనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం వంటి ఘటనలను ప్రస్తావించారు. అలాంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఐక్యంగా నిలబడి గెలిచామని, ఈ స్ఫూర్తిని ఎప్పటికీ మరువకూడదని హితవు పలికారు.

 

కూటమి ధర్మానికి కట్టుబడి ఉందాం: పవన్ కల్యాణ్

ముఖ్యమంత్రి అభిప్రాయంతో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూర్తిగా ఏకీభవించారు. గత 20 నెలలుగా ఐక్యంగా పనిచేసి, వైసీపీ ఐదేళ్ల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి ప్రగతి బాట పట్టిస్తున్నామని అన్నారు. "రాష్ట్రాభివృద్ధి కోసం మరో 15 ఏళ్లు కూటమి కలిసి ఉంటుంది. ఐక్యంగా ముందుకు వెళ్తుంది. ఎన్నికల్లో ఏ స్ఫూర్తితో పనిచేశామో, అదే స్ఫూర్తి భవిష్యత్తులోనూ అవసరం. పార్టీల మధ్య ఏవైనా భిన్నాభిప్రాయాలు ఉంటే, వాటిని అంతర్గతంగా కూర్చుని పరిష్కరించుకోవాలి. ప్రతి ఒక్కరూ కూటమి ధర్మానికి కట్టుబడి పనిచేయాలి" అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Business & Finance
Foxconn Recalls Staff From India
In a setback to Apple’s India expansion plans, Foxconn Technology Group has been sending...
By Bharat Aawaz 2025-07-03 08:16:40 0 3K
Business & Finance
How to Change Your Company or Organization Name Legally
Changing the name of a company or organization involves obtaining approval from the relevant...
By Navya Sree 2026-07-20 05:00:47 0 29
Telangana
ఆశా వర్కర్లతో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి చాయ్ పే చర్చ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తన కార్యాలయంలో చాయ్ పే...
By Sidhu Maroju 2026-01-10 12:33:34 0 211
Andhra Pradesh
ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: అదనపు ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో 'ప్రజా సమస్యల పరిష్కార...
By Pagadala Venkateswar 2026-05-19 05:02:45 0 69
Andhra Pradesh
మదనపల్లెలో గణతంత్ర దినోత్సవ వేడుకలు: బాణాసంచాతో ఆకాశం మెరిసింది.
మదనపల్లెలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బి.టీ కాలేజ్ గ్రౌండ్ నందు "మా" టపాసులు...
By Pagadala Venkateswar 2026-01-27 07:12:56 0 174
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com