S Abdul Nazeer: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు: ఏపీ గవర్నర్ ప్రసంగం...

0
143

 

 

S Abdul Nazeer: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు: ఏపీ గవర్నర్ ప్రసంగం... Andhra

S Abdul Nazeer Speech Highlights AP Budget Session

రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ గాడిన పడిందన్న గవర్నర్ అబ్దుల్ నజీర్

ఉభయ సభలను ఉద్దేశించి బడ్జెట్ సమావేశాల తొలిరోజు ప్రసంగం

రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.17.62 లక్షల కోట్లకు చేరిందని వెల్లడి

తలసరి ఆదాయం రూ.2.95 లక్షలకు పెరిగిందని స్పష్టీకరణ

గత ప్రభుత్వ పాలనపై 7 శ్వేతపత్రాలు విడుదల చేశామని వెల్లడి

 

ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ ప్రక్రియ పక్కాగా గాడిన పడిందని, ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ జాగ్రత్తతో కూడిన ప్రాధాన్యతలు, సంస్కరణల ద్వారా రాష్ట్రం వృద్ధి పథంలోకి తిరిగి వస్తోందని గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ అన్నారు. బుధవారం నాడు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా శాసనసభ, శాసనమండలి ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. గత 21 నెలల్లో ప్రభుత్వం మౌలిక సంస్కరణలను పూర్తి చేసిందని, అన్ని రంగాల్లోనూ స్పష్టమైన ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు.

 

సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ద్వారా రాష్ట్రాన్ని పునర్నిర్మించే బాధ్యతను ప్రజలు తమ ప్రభుత్వానికి అప్పగించారని గవర్నర్ గుర్తుచేశారు. "గత కొన్నేళ్ల ఆర్థిక ఒత్తిడి తీవ్ర అసమతుల్యతలను సృష్టించింది. అనేక రంగాల్లో గణనీయమైన అప్పులు పేరుకుపోయాయి. అయినా, ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి, రుణ వ్యయాలను తగ్గించడానికి, విశ్వసనీయతను తిరిగి సంపాదించడానికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. స్వర్ణాంధ్ర దార్శనికతతో ముందుకు సాగుతున్నాం" అని ఆయన వివరించారు.

 

ప్రభుత్వ ప్రయత్నాల ఫలితంగా రాష్ట్ర ఆర్థిక పనితీరు మెరుగుపడిందని గవర్నర్ తెలిపారు. "2025-26 మొదటి ముందస్తు అంచనాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP) గత ఏడాది రూ.15.91 లక్షల కోట్ల నుంచి రూ.17.62 లక్షల కోట్లకు పెరిగింది. ఇది 10.75 శాతం నామమాత్రపు వృద్ధి రేటును సూచిస్తోంది. రాష్ట్ర తలసరి ఆదాయం గతేడాది రూ.2.66 లక్షల నుంచి రూ.2.95 లక్షలకు పెరిగింది. వ్యవసాయ రంగంలో 7.83 శాతం, పరిశ్రమల రంగంలో 9.53 శాతం, సేవల రంగంలో 12.94 శాతం వృద్ధి సాధించాం" అని ఆయన గణాంకాలతో సహా వివరించారు.

 

గత ప్రభుత్వ హయాంలో జరిగిన దుష్పరిపాలనపై ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు ఏడు శ్వేతపత్రాలను విడుదల చేసినట్లు గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రజాధనం దుర్వినియోగం, పోలవరం ప్రాజెక్టును పట్టాలు తప్పించడం, విద్యుత్ రంగం విధ్వంసం, సహజ వనరుల దుర్వినియోగం, అవినీతిమయమైన ఎక్సైజ్ విధానాలు, శాంతిభద్రతల క్షీణతతో పాటు భవిష్యత్ రాజధాని అమరావతిని నాశనం చేసే లక్ష్యంతో చేసిన మూడు రాజధానుల ప్రతిపాదన వంటి అంశాలను ఈ శ్వేతపత్రాల ద్వారా ప్రజల ముందు ఉంచామన్నారు.

 

అధికారంలోకి వచ్చిన వెంటనే 'సూపర్ సిక్స్' హామీలను నెరవేర్చడంపై దృష్టి సారించామని, క్రమంగా పాలనను పునరుజ్జీవనం నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లామని గవర్నర్ తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ అనే జాతీయ ఆకాంక్షలకు అనుగుణంగా, రాష్ట్రాన్ని 'సంపన్న, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన'దిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ పరివర్తన యజ్ఞంలో ప్రతి పౌరుడూ భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. మన బలంపై విశ్వాసంతో, ఐక్య లక్ష్యంతో ఏపీ ముందుకు సాగుతోందని, ప్రతి పౌరుడూ గౌరవంగా, అవకాశాలతో జీవించే భవిష్యత్తుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించారు.

Search
Categories
Read More
Business & Finance
Environmental Challenges Impact Kashmir’s Lake Economy
Pollution, climate change, and unplanned urban development are contributing to the shrinking of...
By Navya Sree 2026-06-30 05:28:48 0 62
Andhra Pradesh
లోకేష్ సార్ మా పాఠశాలను కాపాడండి.
లోకేశ్‌ సర్‌... మా పాఠశాలను కాపాడండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు...
By Pagadala Venkateswar 2026-02-14 12:46:04 0 189
Business & Finance
GST Composition Scheme for Small Business Compliance
The GST Composition Scheme is a simplified taxation scheme designed for eligible small businesses...
By Navya Sree 2026-07-24 06:22:16 0 17
Andhra Pradesh
పుంగనూరు:నేడు కేసుల పరిష్కారానికి లోక్‌అదాలత్
పుంగనూరు పట్టణ కోర్టు ఆవరణంలో శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్...
By Kothuru Murali 2026-07-11 15:50:47 0 77
Andhra Pradesh
కర్నూలు బి క్యాంపు పోస్ట్ ఆఫీస్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు !!
కర్నూలు సిటీ : బి.క్యాంపు స్థానిక బి క్యాంపులో గల బి. క్యాంపు పోస్ట్ ఆఫీస్ నందు 77వ గణతంత్ర...
By Hari Krishna 2026-01-26 08:20:50 0 528
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com