బీసి రక్షణ చట్టంపై చంద్రబాబు మరో కుట్ర

0
193

*బీసీ రక్షణ చట్టంపై చంద్రబాబు మరో కుట్ర*

 

- అనుకూల మీడియా ద్వారా తప్పుడు కథనాలు, బీసీల దృష్టి మరల్చే కుట్ర

 

- బిసివై పార్టీ "బిసి మహా గర్జన" కు భయపడే చంద్రబాబు డ్రామాలు

 

- బిసిల ఐక్యతను దెబ్బతీసేందుకు సరికొత్త నాటకాలు

 

- బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ఆగ్రహం

 

*(మంగళగిరి, జనవరి 2)*

 

దశాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న బీసీల ఆశలతో, ఆకాంక్షలతో చెలగాటమాడుతూ, వారిని మరోసారి మోసగించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారని బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్రయాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "బీసీ రక్షణ చట్టం" ముసాయిదా సిద్ధమైందంటూ తన అనుకూల పత్రికల్లో కట్టుకథలు అల్లించి, బీసీల భవిష్యత్తును పణంగా పెట్టి, కేవలం కాలయాపన చేయాలనే దుర్మార్గపు ఆలోచనతోనే ఈ లీకుల నాటకానికి తెరలేపారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బీసీల ఆత్మగౌరవంపై చంద్రబాబు చేస్తున్న మరో దాడి అని ఆయన అభివర్ణించారు. ఈమేరకు ఆయన శుక్రవారం ఓ పత్రికాప్రకటన విడుదల చేశారు. 

 

*కట్టుకథల వెనుక దాగి ఉన్న అసలు కుట్ర*

 

 "ఒక అంశాన్ని నీరుగార్చాలన్నా, దానిపై ప్రజల్లో ఉన్న ఆసక్తిని పక్కదారి పట్టించాలన్నా, ముందుగా తన అనుకూల పత్రికల్లో కట్టుకధలు రాయించి, దానిపై చర్చను తప్పుదోవ పట్టించడం చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య. బీసీ రక్షణ చట్టం విషయంలో ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. బీసీల పట్ల ఆయనకు నిజంగా చిత్తశుద్ధి, ప్రేమ ఉంటే, ముఖ్యమంత్రి హోదాలో ఆయనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి, బిసి రక్షణ చట్టం గురించి ధైర్యంగా ప్రకటించాలి. అలా చేయకుండా, దొంగచాటుగా పత్రికలకు కథనాలు రాయించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? ఇది బీసీల కళ్ళల్లో మట్టికొట్టి, వారిని వంచించే ప్రయత్నం కాదా?" అని రామచంద్రయాదవ్ సూటిగా ప్రశ్నించారు.

 

*'బీసీ మహా గర్జన'ను చూసి భయపడ్డారు*

 

రాబోయే ఫిబ్రవరి 22న, బీసీల హక్కుల సాధన కోసం, వారి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్వావలంబన కోసం బీసీవై పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన "బీసీ మహా గర్జన"కు రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న అపూర్వ స్పందనను చూసి చంద్రబాబు ప్రభుత్వంలో వణుకు మొదలైందని రామచంద్రయాదవ్ అన్నారు. "లక్షలాదిగా తరలివచ్చి, తమ గళాన్ని వినిపించేందుకు బీసీలు ఏకమవుతున్నారన్న సమాచారంతోనే కూటమి ప్రభుత్వానికి భయం పట్టుకుంది. ఈ మహా గర్జనను నీరుగార్చేందుకు, బీసీల ఐక్యతను దెబ్బతీసేందుకు, వారి దృష్టిని మరల్చేందుకే ఈ 'రక్షణ చట్టం ముసాయిదా' అనే ఎత్తుగడ వేశారు. బీసీలంతా, ఇది మనల్ని మభ్యపెట్టే ఎత్తుగడ అని గ్రహించాలి," అని ఆయన పిలుపునిచ్చారు.

 

*చిత్తశుద్ధిని నిరూపించుకోండి, డ్రామాలు ఆపండి*

 

"బిసి రక్షణ చట్టం ముసాయిదా నిజంగా సిద్ధమైతే, దానిని ఎందుకు అధికారికంగా ప్రకటించడం లేదు? కేబినెట్‌లో పెట్టి ఎందుకు ఆమోదించడం లేదు? అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ఉన్న అడ్డంకులు ఏమిటి? ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. దశాబ్దాలుగా బీసీల జనాభా దామాషా ప్రకారం వారికి చట్టసభల్లో, ప్రభుత్వ పదవుల్లో, విద్య, ఉద్యోగాల్లో దక్కాల్సిన వాటాను అడ్డుకున్నది మీరు కాదా? ఇప్పుడు బీసీలంతా ఏకమవుతున్నారన్న భయంతో 'రక్షణ చట్టం' పేరుతో మొసలి కన్నీరు కారిస్తే నమ్మడానికి బీసీలు అమాయకులు కాదు," అని రామచంద్రయాదవ్ తీవ్రంగా విమర్శించారు.

 

*బీసీ సోదరులకు బీసీవై పార్టీ పిలుపు*

 

"పాలకుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడటం కాదు, పోరాడి హక్కులను సాధించుకోవాలి. ఈ పత్రికా లీకులను, మాయమాటలను నమ్మి మోసపోవద్దు. మన తలరాతలను మనమే రాసుకోవాలి. మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఇది. ఫిబ్రవరి 22న జరగబోయే 'బీసీ మహా గర్జన'కు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా బీసీ సోదరులంతా కదలివచ్చి, మన సత్తా ఏమిటో, మన ఐక్యత ఏమిటో ఈ పాలకులకు రుచి చూపించాలి. బిసి రక్షణ చట్టం విషయంలో చంద్రబాబు, ఆయన పుత్రరత్నం ఆడుతున్న డ్రామాలను బిసి సోదరులు గుర్తించాలి. బిసి రక్షణ చట్టం అమలయ్యే వరకు బిసివై పార్టీ పోరాటం కొనసాగిస్తుంది" అని బోడె రామచంద్రయాదవ్ పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Himachal Pradesh
शिमला की खोती रौनक पर हाई कोर्ट की चिंता: पैदल संस्कृति खतरे में
हिमाचल प्रदेश #हाई_कोर्ट ने शिमला नगर की बदलती स्थिति पर गंभीर चिंता जताई है। न्यायालय ने कहा कि...
By Pooja Patil 2025-09-11 11:12:00 0 249
Telangana
సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలి: TSCPSEU
  ​కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 4: తెలంగాణ రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ...
By Bittu Bittu 2026-02-03 11:49:44 0 1K
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : మహా సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దిరెడ్డి
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, మంగళంపేటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి మహా...
By Kothuru Murali 2026-02-20 11:00:54 0 113
Telangana
ఎన్నికలు పకడ్బందీగా ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పని చేయాలి
జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్,   మహబూబాబాద్ జిల్లా, డిసెంబర్ 13:...
By Bittu Bittu 2025-12-13 12:49:19 0 306
Andhra Pradesh
మదనపల్లె: జనసేన నేతపై అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు.
లక్షల్లో అద్దె బకాయిలు చెల్లించకుండా వేధిస్తున్నారని జనసేన పార్టీకి చెందిన ఓ రాష్ట్ర నేతపై...
By Pagadala Venkateswar 2026-03-04 11:43:13 0 110
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com