ఉద్యోగుల వరుస మరణాలతో ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.
ఉద్యోగుల వరుస మరణాలతో ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం
11-04-2026 Sat 07:08 | Andhra
APSRTC Announces Mandatory Health Checkups for Employees Over 45
షార్ట్స్లో చూడండి
ఏపీఎస్ఆర్టీసీ తమ ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 45 ఏళ్లు పైబడిన ఉద్యోగులందరికీ తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలి కాలంలో అనారోగ్య సమస్యలతో ఉద్యోగులు మరణిస్తున్న ఘటనలు పెరగడంతో నివారణ చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త నిబంధన మే 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలలో అమల్లోకి రానుంది.
గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు కేవలం 11 నెలల వ్యవధిలోనే 272 మంది ఆర్టీసీ ఉద్యోగులు వివిధ అనారోగ్య కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 100 మంది గుండె జబ్బులతో, 62 మంది కాలేయ సంబంధిత వ్యాధులతో, మిగిలిన వారు క్యాన్సర్, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఉద్యోగుల వరుస మరణాలు యాజమాన్యాన్ని తీవ్రంగా ఆందోళనకు గురిచేయడంతో వారి ఆరోగ్యాన్ని పరిరక్షించే లక్ష్యంతో ఈ ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు.
కొత్తగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం 45 ఏళ్లు దాటిన డ్రైవర్లు, కండక్టర్లకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రివెంటివ్ (ముందస్తు) వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే ఇతర విభాగాలు, వర్క్షాపులలో పనిచేస్తున్న 45 ఏళ్లు పైబడిన సిబ్బందికి ఏడాదికి ఒకసారి ఈ వైద్య పరీక్షలు తప్పనిసరి చేశారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ఎన్. బాలసుబ్రమణ్యం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో కేవలం డ్రైవర్లకు మాత్రమే వైద్య పరీక్షల నిబంధన ఉండేది. వారికి కూడా 45 ఏళ్ల వరకు మూడేళ్లకోసారి, ఆ తర్వాత పదవీ విరమణ వరకు ఏడాదికోసారి మాత్రమే పరీక్షలు నిర్వహించేవారు. ఇతర సిబ్బందికి ఈ సౌకర్యం అందుబాటులో లేదు. అయితే, తాజా నిర్ణయంతో ఉద్యోగుల్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటిని ప్రాథమిక దశలోనే గుర్తించి, తగిన వైద్యం అందించేందుకు అవకాశం ఉంటుందని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడికి గురయ్యే సిబ్బందికి ఈ నిర్ణయం ఎంతో ఊరటనిస్తుందని, వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తుందని ఆర్టీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz