Nara Lokesh: విద్యాశాఖపై లోకేశ్ సమీక్ష... మధ్యాహ్న భోజనం, క్లిక్కర్ విధానంపై కీలక ఆదేశాలు.

0
156

 

 

 

Nara Lokesh: విద్యాశాఖపై లోకేశ్ సమీక్ష... మధ్యాహ్న భోజనం, క్లిక్కర్ విధానంపై కీలక ఆదేశాలు

01-04-2026 Wed 21:59 | Andhra

Nara Lokesh Reviews Education Department Issues Key Orders

 

 

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక సదుపాయాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా, విద్యావ్యవస్థలో చేపట్టాల్సిన సంస్కరణలపై ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో సమగ్రశిక్ష అధికారులతో ఆయన సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని, కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. అదే సమయంలో, అభ్యసన ఫలితాలను మెరుగుపరిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా 9వ తరగతి విద్యార్థులకు క్లిక్కర్ ఆధారిత విధానాన్ని అమలు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.

 

మధ్యాహ్న భోజనం, లీప్ యాప్‌పై దృష్టి

 

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతపై మంత్రి లోకేశ్ ప్రధానంగా దృష్టి సారించారు. ఈ విషయంలో ఎలాంటి ఫిర్యాదులకు తావివ్వకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దీనిపై అధికారులు స్పందిస్తూ, సోమవారం నుంచి లీప్ యాప్ ద్వారా ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరిస్తున్నామని మంత్రికి వివరించారు. మంగళవారం నాటికి 6,719 పాఠశాలల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు తెలిపారు. ఈ ఫీడ్‌బ్యాక్ సేకరణ ప్రక్రియను పూర్తిగా ఆటోమేషన్ చేయాలని లోకేశ్ ఆదేశించారు. లీప్ యాప్ వినియోగంపై తల్లిదండ్రుల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు. పాఠశాలల అభివృద్ధిలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల పాత్ర చాలా కీలకమని, అభ్యసన ఫలితాల మెరుగుదలలో వారిని భాగస్వాములను చేయాలని అభిప్రాయపడ్డారు.

 

క్లిక్కర్ విధానం, స్టూడెంట్ కిట్లపై సమీక్ష

 

నూతన సాంకేతికతను విద్యారంగంలో వినియోగించడంపై సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న క్లిక్కర్ ఆధారిత పునశ్చరణ విధానంపై తల్లిదండ్రుల నుంచి సానుకూల స్పందన వస్తోందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన లోకేశ్, తొలుత రాష్ట్రవ్యాప్తంగా 9వ తరగతి విద్యార్థులందరికీ ఈ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత దశలవారీగా ఇతర తరగతులకు విస్తరించాలని సూచించారు. మరోవైపు, ఇరాన్ యుద్ధం కారణంగా పెట్రోలియం ఆధారిత ఉత్పత్తుల లభ్యత తగ్గడంతో స్టూడెంట్ కిట్లపై ప్రభావం పడుతోందని అధికారులు వివరించారు. అయితే, విద్యార్థి మిత్ర కిట్ల నాణ్యత విషయంలో పూర్తిస్థాయిలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు.

 

ఆటిజం సెంటర్లు, ఖాళీల భర్తీ

 

సమాజంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేశ్ తెలిపారు. ఇందులో భాగంగా ఆటిజం సపోర్ట్ సెంటర్ల ఏర్పాటుపై సమీక్షించారు. ఫేజ్-1 కింద చినకాకాని, బాపట్లలో నిర్మాణం పూర్తయిన కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని నిర్ణయించారు. ఫేజ్-2 కింద ఈ ఏడాది జూన్ నాటికి 28 కేంద్రాలు, నవంబర్ నాటికి 95 కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు వివరించారు. ఈ కేంద్రాల నిర్వహణకు నిమ్హాన్స్ (NIMHANS) వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల సహకారంతో మానసిక వైద్యులు, కౌన్సిలర్లకు శిక్షణ ఇప్పించాలని మంత్రి ఆదేశించారు. కేజీబీవీ అడ్మిషన్లు, 1095 బోధనేతర, 277 బోధన సిబ్బంది నియామక ప్రక్రియలపైనా సమావేశంలో చర్చించారు.

 

అమరావతిలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ

 

ప్రజాప్రభుత్వం అమరావతిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ప్రాజెక్టుపై కూడా మంత్రి లోకేశ్ సమీక్ష జరిపారు. భవన తుది నమూనాను ఈ సందర్భంగా ఆమోదించారు. పనులను త్వరితగతిన ప్రారంభించి, 2028 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మానవవనరుల శాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య డైరెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, సమగ్రశిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ సీఎన్ దీవన్ రెడ్డి, పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు మండల పరిధిలో లారీ బోల్తా.
ఆదివారం, అన్నమయ్య జిల్లాలోని మొలకల చెరువు నుంచి చెన్నైకు టమోటా లోడుతో వెళుతున్న లారీ పుంగనూరు...
By Kothuru Murali 2026-01-19 12:21:15 0 181
Andhra Pradesh
దర్శి-దొనకొండ ఇండస్ట్రియల్ ఏరియాలో BDL పరిశ్రమ ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ వేగవంతం
దర్శి-దొనకొండ ఇండస్ట్రియల్ ఏరియాలో BDL పరిశ్రమ ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ వేగవంతం ప్రకాశం జిల్లా...
By Chennaiah Kati 2026-07-03 12:08:52 0 42
Andhra Pradesh
ఏపీలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్-2026 ప్రారంభం... తొలి మ్యాచ్ లో కాకినాడ కింగ్స్ గెలుపు.
  ఏపీలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్-2026 ప్రారంభం... తొలి మ్యాచ్ లో కాకినాడ కింగ్స్ గెలుపు...
By Pagadala Venkateswar 2026-06-10 06:03:03 0 97
Andhra Pradesh
పుంగనూరు డివిజన్లో 34 వేల బస్తాల యూరియా పంపిణీ
పుంగనూరు సబ్ డివిజన్ పరిధిలోని 8 మండలాలలో జనవరి 10 నాటికి 34,811 బస్తాల యూరియా పంపిణీ చేసినట్లు...
By Kothuru Murali 2026-01-13 09:07:30 0 182
Telangana
రాత్రి లేదు...!పగలు లేదు..!.. ములుగు జిల్లా...Sp
*రాత్రి లేదు...!! పగలు లేదూ...!!!*    *మంచు లేదు..!! ఎండలేదు...!!!* ...
By CM_ Krishna 2026-01-14 04:56:48 0 284
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com