Andhra Pradesh: ఏపీ వ్యవసాయ వర్సిటీల ప్రొఫెసర్లకు హైకోర్టులో ఊరట.. ప్రభుత్వ తీరుపై కీలక వ్యాఖ్యలు.

0
89

 

 

Andhra Pradesh: ఏపీ వ్యవసాయ వర్సిటీల ప్రొఫెసర్లకు హైకోర్టులో ఊరట.. ప్రభుత్వ తీరుపై కీలక వ్యాఖ్యలు

24-02-2026 Tue 11:55 | Andhra

AP Professors Retirement Age Increased High Court Orders

వ్యవసాయ వర్సిటీల ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపుపై హైకోర్టులో ఊరట

కొందరికి పెంచి, మరికొందరికి పెంచకపోవడం వివక్షేనన్న ధర్మాసనం

తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రొఫెసర్లను సర్వీసులో కొనసాగించాలని ఆదేశం

పదవీ విరమణ వయసు పెంపును తిరస్కరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసిన కోర్టు

ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించి, విచారణ మూడు వారాలకు వాయిదా

 

ఏపీలోని నాలుగు వ్యవసాయ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. తమ పదవీ విరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచకపోవడాన్ని సవాల్ చేస్తూ వారు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టింది. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని ప్రొఫెసర్లకు పదవీ విరమణ వయసు పెంచి, వ్యవసాయ శాఖ పరిధిలోని వారికి పెంచకపోవడం వివక్ష చూపడమేనని, ఇది రాజ్యాంగంలోని అధికరణ 14కు విరుద్ధమని జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

 

ఈ సందర్భంగా ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యానవన, శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ, ఏపీ ఫిషరీస్ యూనివర్శిటీల పరిధిలో పదవీ విరమణ చేయనున్న పిటిషనర్లను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సర్వీసులోనే కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే ఈ యూనివర్సిటీలలో పదవీ విరమణ వయసు పెంచడానికి వీల్లేదంటూ ఫిబ్రవరి 15న వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ జారీ చేసిన ఆదేశాలను కూడా హైకోర్టు సస్పెండ్ చేసింది. ప్రభుత్వం దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

 

గతంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోని వర్సిటీల్లో యూజీసీ స్కేల్స్ పొందుతున్న ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును ప్రభుత్వం 62 నుంచి 65 ఏళ్లకు పెంచింది. అయితే, వ్యవసాయ శాఖ పరిధిలోని నాలుగు వర్సిటీలకు ఈ ప్రయోజనాన్ని వర్తింపజేయలేదు. దీంతో ప్రొఫెసర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గతంలో సింగిల్ జడ్జి విచారణ జరిపి, ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని పేర్కొన్నారు. అనంతరం పిటిషనర్లు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించగా, తాజా విచారణ జరిగింది.

 

విచారణకు హాజరైన వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్, కాంపిటెంట్ అథారిటీ నిర్ణయం మేరకే పదవీ విరమణ వయసు పెంపు ప్రతిపాదనలను తిరస్కరించినట్లు తెలిపారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం ఎందుకు సమర్థిస్తోందని, తిరస్కరించడానికి గల కారణాలను స్పష్టంగా చెప్పలేదని ప్రశ్నించింది. ఉన్నత పదవుల్లో ఉన్నవారి ఆలోచనలు తెలుసుకోకుండా అధికారులు ఎలా నిర్ణయాలు తీసుకుంటారని ప్రభుత్వాన్ని నిలదీసింది.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com