జగన్ పేరులో 'జీ' అంటే 'జెన్ జీ' కాదు.. గొడ్డలి.. విధ్వంసమే ఆయన ఎజెండా: మంత్రి లోకేశ్‌.

0
82

 

 

జగన్ పేరులో 'జీ' అంటే 'జెన్ జీ' కాదు.. గొడ్డలి.. విధ్వంసమే ఆయన ఎజెండా: మంత్రి లోకేశ్‌

12-06-2026 Fri 13:48

Andhra

Nara Lokesh says G in Jagan name means Goddali not Gen Z and destruction is his agenda

రూ. లక్ష కోట్లతో 'మిషన్ రాయలసీమ' ప్రాజెక్టును ప్రారంభిస్తామ‌న్న మంత్రి

జగన్‌కు క్రెడిట్ చోరీ డిజార్డర్ (సీసీడీ) అనే జబ్బు ఉందంటూ సెటైర్లు

చిన్నప్పుడు టీచర్లు కొట్టారనే కోపంతోనే జగన్ డీఎస్సీపై ప‌గ‌బ‌ట్టార‌ని ఎద్దేవా

ప్రజాప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో దాడులు, కబ్జాలు, హత్యలు లేవన్న లోకేశ్‌

డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్‌తో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతుంద‌న్న మంత్రి

రాయలసీమను 'రాయల్ సీమ'గా మార్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, ఇందుకోసం రూ.లక్ష కోట్ల భారీ బడ్జెట్‌తో 'మిషన్ రాయలసీమ' ప్రాజెక్టును చేపట్టబోతున్నామని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి లోకేశ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష నేత జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

 

జగన్‌కు సీసీడీ జబ్బుంది.. జీ అంటే గొడ్డలి

ప్రతిపక్ష నేత జగన్‌కు 'సీసీడీ' (క్రెడిట్ చోరీ డిజార్డర్) అనే జబ్బు ఉందని లోకేశ్‌ ఎద్దేవా చేశారు. తాము కష్టపడి గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ వంటి కంపెనీలను రాష్ట్రానికి తీసుకొస్తే, వాటిని తానే తెచ్చానని ప్రెస్‌మీట్ పెట్టి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. "ఇంకొంత కాలం సమయం ఇస్తే, ఆగస్టు 15న ప్రెస్‌మీట్ పెట్టి భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చింది మా తాతేనని ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు" అని లోకేశ్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ తెచ్చిన కంపెనీలు కేవలం ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్ వంటి మద్యం బ్రాండ్లు మాత్రమేనని ఆరోపించారు. "జగన్ పేరులో ఉన్న 'జీ' అంటే జెన్-జీ అనుకుంటున్నారు. కానీ, ఆ జీకి అసలు అర్థం 'గొడ్డలి'. విధ్వంసమే ఆయన ఎజెండా" అని లోకేశ్‌ తీవ్రంగా విమర్శించారు. తమది గూగుల్ అయితే వాళ్లది గొడ్డలని, తమది ఫైటర్ జెట్స్ అయితే వాళ్లది ఫ్యాక్షన్ అని, తమది కియా అయితే వాళ్లది కిడ్నాప్ అని పోల్చారు.

 

రెండేళ్ల పాలనలో ప్రశాంతత

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొందని లోకేశ్‌ అన్నారు. గతంలో మాదిరిగా దాడులు, జేసీబీలతో కూల్చివేతలు, కబ్జాలు, హత్యలు, బెదిరింపులు లేవని చెప్పారు. "ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే చంద్రగిరి గడ్డపై చెప్పాను. వెంకన్నతో పెట్టుకోవద్దు, మాడి మసైపోతావని జగన్‌ను హెచ్చరించాను. ఆయన వినకుండా స్వామితోనే పెట్టుకున్నారు, ఫలితం 2024లో చూశారు" అని గుర్తుచేశారు. వై నాట్ 175 అన్నవారికి ప్రజలు 11 సీట్లు ఇచ్చారని, సిద్ధం అన్నవారికి ప్రజలు యుద్ధం ప్రకటించారని అన్నారు.

 

డీఎస్సీపై జగన్ విమర్శలు.. రాజ్యాంగంపై దాడి

చిన్నప్పుడు పదో తరగతి పేపర్ లీక్ కేసులో దొరికినప్పుడు టీచర్లు కొట్టారనే కోపంతోనే జగన్ ఉపాధ్యాయులపై కక్షగట్టారని లోకేశ్‌ ఆరోపించారు. ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టిన చరిత్ర జగన్‌దని విమర్శించారు. మెగా డీఎస్సీని అడ్డుకోవడానికి 226 కేసులు వేశారని, అయినా 150 రోజుల్లో 16,347 పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. ఇప్పుడు డీఎస్సీపై జగన్ చేస్తున్న ఆరోపణలు తనపైనో, ప్రభుత్వంపైనో కాదని, నేరుగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను ప్రశ్నించడమేనని అన్నారు. 

 

అభివృద్ధి, సంక్షేమంలో పరుగులు

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని లోకేశ్‌ తెలిపారు. పెన్షన్‌ను రూ.2000 నుంచి ఒకేసారి రూ.4000కు పెంచామని, అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించామని, 16,347 డీఎస్సీ పోస్టులతో పాటు 6,000 కానిస్టేబుల్ పోస్టులు, జాబ్ క్యాలెండర్ ద్వారా మరో 10,060 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామని వివరించారు. స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం, 'దీపం-2' కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం వంటి పథకాలతో జనరంజక పాలన అందిస్తున్నామన్నారు.

 

డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వల్లే ప్రపంచంలో భారత్‌కు గౌరవం పెరిగిందని లోకేశ్‌ అన్నారు. ఏపీలో ఉన్నది సాధారణ డబుల్ ఇంజన్ సర్కార్ కాదని, ఇది 'డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్' అని అభివర్ణించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, పోలవరం, అమరావతికి నిధులు, ఫైటర్ జెట్ ప్రాజెక్టు వంటివి సాకారమయ్యాయని తెలిపారు. త్వరలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు అహంకారానికి పోకుండా, ఒకే కుటుంబంలా కలిసి పనిచేయాలని, ప్రజలకు చేసిన మంచి పనులను వివరించాలని లోకేశ్‌ దిశానిర్దేశం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నిజాయితీ చాటుకున్న ఆటో *డ్రైవర్
చీరాల: బాపట్ల జిల్లా చీరాల మండలంలోని సాల్మన్ సెంటర్ సమీపంలోని హైమ ఆసుపత్రి వద్ద నుండి ఒక మహిళ...
By Gadiyapudi Narendra 2026-02-21 07:14:22 0 174
SURAKSHA
K. Sethuraman IPS: Leading Kerala Police with Integrity
The Journey Begins "True leadership in policing is measured not by authority,...
By Fathima Safa 2026-07-09 07:26:01 0 89
Andhra Pradesh
మౌలిక వసతులు లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు
*మౌలిక వసతులు లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు*      *సెక్యూరిటీ, శానిటేషన్...
By Rajini Kumari 2026-02-23 10:23:51 0 155
Andhra Pradesh
పులిచర్లలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దిరెడ్డి
బుధవారం పులిచర్ల మండల కేంద్రంలోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి....
By Kothuru Murali 2026-04-29 11:24:33 0 99
Andhra Pradesh
ఇలాంటి నాయకుడు కోసమే కదా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు ఇన్నాళ్లు వేచి చూసింది .
ఇలాంటి నాయకుడు కోసమే కదా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు ఇన్నాళ్లు వేచి చూసింది . నేను కలలో కూడా...
By Chennaiah Kati 2026-06-18 08:50:24 0 65
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com