కూకట్‌పల్లి అభివృద్ధి పనులపై మేడ్చల్ కలెక్టర్ సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కీలక సూచనలు

0
103

మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం (18-05-2026) నిర్వహించిన జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో కూకట్‌పల్లి నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పలు కీలక విషయాలను ప్రస్తావించారు. ఈ సమావేశానికి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు , జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు మరియు మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

సమావేశంలో మాట్లాడుతూ కేపీహెచ్‌బీ లోని ఎన్టీఆర్ స్కూల్ నిర్మాణ పనులు గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనులు నిలిచిపోయాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఆ స్థలాన్ని జీహెచ్‌ఎంసీకి కేటాయించి స్కూల్ నిర్మాణం పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అవసరమైతే సొంత నిధులతోనైనా నిర్మాణం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, కానీ అధికారుల నుంచి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే ఫతేనగర్ డివిజన్ అమృత తండాలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిరుపేదలకు వెంటనే కేటాయించాలని కోరారు. కేపీహెచ్‌బీలోని జీహెచ్‌ఎంసీ స్థలాలపై హౌసింగ్ బోర్డు బోర్డులు ఏర్పాటు చేస్తున్నారని, ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సూచించారు.

ప్రశాంత్ నగర్‌లో హెల్త్ సెంటర్ నిర్మాణానికి ఇప్పటికే స్థలం కేటాయించామని, పనులు త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అలాగే కేపీహెచ్‌బీలో నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రి పనులను వేగవంతం చేయాలని తెలిపారు. టెండర్ ప్రక్రియ పూర్తై గుత్తేదారుని కూడా నియమించారని, ఆసుపత్రి త్వరగా పూర్తైతే పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని పేర్కొన్నారు.

నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసి, త్వరితగతిన పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమావేశంలో విజ్ఞప్తి చేశారు.

References

Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com