స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో లోపం

0
71

*స్టీల్ బ్రిడ్జి నిర్మాణంలో లోపం*

గడ్డర్లు తొలగించి తిరిగి నిర్మాణం

*పనులు ఆలస్యం అయ్యే అవకాశం*

 

 అమరావతి రాజధాని కనెక్టివిటీ కోసం ఏర్పాటు చేస్తున్న స్టీలు బ్రిడ్జిలో నిర్మాణ లోపం బయటపడింది. రాజధాని నగరం నుండి నేరుగా 16వ నెంబరు జాతీయ రహదారికి అనుసంధానం చేసేందుకు వంతెన నిర్మాణం ఇతర పనులకు కలిపి రూ.68 కోట్లు కేటాయించారు. ఉండవల్లి నుండి మణిపాల్‌ ‌వరకూ ఎలివేటెడ్‌ ‌కారిడార్‌ ‌నిర్మాణం, అలాగే కొండవీటివాగు గేట్ల వద్ద రెండు లైన్ల వంతెన నిర్మాణంలో భాగంగా రాజధాని ట్రాఫిక్‌‌ను మళ్లించేందుకు దీన్ని నిర్మిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ వంతెనను తొలుత ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తి చేయాలని అనుకున్నారు. అయితే మార్చి, ఆ తర్వాత ఏప్రిల్‌ ‌నెలాఖరుకు పూర్తిచేస్తామని తెలిపారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ వంతెనపై ముఖ్యమంత్రి కూడా రెండుసార్లు సమీక్ష నిర్వహించారు. పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ తొమ్మిది సార్లు ఈ వంతెన పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అప్పట్లో ఐరన్‌ ‌స్వాన్లు బిగించేశారు. మొత్తం నాలుగు లైన్లుగా బిగిస్తున్న ఈ వంతెన నిర్మాణంలో దక్షిణ భాగంలో నిర్మించిన వంతెన గడ్డర్లు వంకర పోయాయి. తొలుత వేగంగా నిర్మాణ పనులు చేపట్టామని తెలిపిన అధికారులు చివర్లో లోపాన్ని గుర్తించారు. దక్షిణ భాగంలో నిర్మించిన రెండో వంతెన మధ్యలో గడ్డర్లు ఉండాల్సిన దానికంటే అదనంగా వంకర పోయాయి. దీనిపై శ్లాబు వేస్తే ఇబ్బందులొస్తాయని అధికారులు హెచ్చరించడంతో కొద్దికాలం భారీ క్రేన్‌ ‌సపోర్టుతో నిలబెట్టారు. వంకర మరీ పెరిగిపోతుండటంతో వెంటనే తొలగించాలని నిర్ణయించారు. బుధ, గురువారాల్లో తొలగింపు పనులు చేపట్టారు. దక్షిణభాగంలో ఉన్న వంతెన మధ్యలో ఉన్న స్టీలు గడ్డర్లు తొలగించారు. అవన్నీ పూర్తిగా తొలగించి మరలా ఎలైన్‌‌మెంట్‌ ‌పూర్తి చేసి శ్లాబు వేస్తామని అధికారులు చెబుతున్నారు. దీనిపై సిఆర్‌‌డిఎ అధికారులను అడగగా వంతెన నిర్మాణం ఎన్‌‌సిసి కంపెనీ చేపడుతోందని, గడ్డర్లు బిగించే సమయంలో కొంత వంకర వచ్చిందని, నిర్మాణ లోపాన్ని గుర్తించామని తెలిపారు. గడ్డర్లు వంకర పోవడంతో పాటు ఎత్తులోనూ స్వల్ప తేడా వచ్చిందని గుర్తించి నట్లు పేర్కొన్నారు. అప్పుడే సరిచేయాలని కాంట్రాక్టు సంస్థలను కోరగా.. చేశామని చెప్పారని, శ్లాబువేసే సమయంలో లోపం మరింత పెరిగిందని వివరించారు. గత నెల 20వ తేదీనే దీన్ని గుర్తించామని పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం వంకర ఉన్నచోట్ల గడ్డర్లు తొలగించి మరలా బిగిస్తామని, అనంతరం శ్లాబు వేస్తామని కాంట్రాక్టు సంస్థ తెలిపినట్లు వివరించారు. అమరావతి నిర్మాణ పనుల్లో లోపాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గతంలో సెక్రటేరియల్‌ ‌వెనుక సిఎం నివాసం నిర్మిస్తున్న రోడ్డు కూడా పూర్తిగా పగిలిపోయింది. దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో రోడ్డును పునర్నిర్మించారు. ఇప్పడు స్టీలు బ్రిడ్జి నిర్మాణంలో లోపాలు వెలుగు చూశాయి. దాన్ని కూడా పునర్నిర్మిస్తున్నారు. వేల కోట్ల విలువైన పనులు చేపడుతున్న కాంట్రాక్టు సంస్థలు కూడా లోపాలతో నిర్మాణాలు చేపట్టడం, అధికారులో.. మరొకరో గుర్తించిన తరువాత సరిచేయడం వంటి చర్యలతో అమరావతి రాజధాని పనులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

Search
Categories
Read More
Andhra Pradesh
రైతు పొలంలో పైపులైన్లు, స్ప్రింకర్ల ధ్వంసం – ఎస్ఐకి ఫిర్యాదు.
చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలోని రెడ్డివారిపల్లి గ్రామంలో రైతు టి. కుమార్ పొలంలో అమర్చిన...
By Pagadala Venkateswar 2026-02-03 12:39:05 0 112
Telangana
జనావాసాల మధ్య మద్యం దుకాణాలు: నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ.|
సికింద్రాబాద్ : జనావాస ప్రాంతాలలో మద్యం దుకాణాలను ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేస్తూ బేగంపేట...
By Sidhu Maroju 2025-11-01 17:10:55 0 207
Telangana
తెలంగాణ : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల..!
తెలంగాణ : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నట్టు  బోర్డ్ వెల్లడించింది....
By Sunka Santhosh 2026-04-11 18:15:33 0 157
Telangana
ఫ్రిజ్లో పెట్టిన మటన్ తిని అస్వస్థకు గురైన కుటుంబం
మటన్ తిని ఒకరి మృతి.. ఏడుగురికి సీరియస్ HYD వనస్థలిపురంలో తీవ్ర విషాదం నెలకొంది. ఫ్రిజ్లో నిల్వ...
By Vadla Egonda 2025-07-23 07:14:50 0 1K
Andhra Pradesh
పెద్దాపురం: సుదముక్యలతో సాక్ష్య కళాఖండాలు
పెద్దాపురం పట్టణానికి చెందిన గృహిణి కొరుకొండ మహాలక్ష్మి సుదముక్యలతో సాక్ష్య కళాఖండాలను తయారు చేసి...
By Ratna Sekhar 2026-02-12 08:22:04 0 247
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com